(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): పారిశ్రామిక, ఉపాధికల్పన రంగాల్లో తెలంగాణ కొత్త చరిత్ర సృష్టిస్తున్నది. రెండు ఆర్థిక సంవత్సరాల్లో రాష్ర్టానికి సుమారు రూ. లక్ష కోట్ల పెట్టుబడులు తెచ్చుకుంది. ఈ విషయాన్ని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ (ఎంఎస్ఎంఈ)ల ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఈపీసీ) నివేదిక వెల్లడించింది. 2020-21తో చూస్తే 2021-22లో వచ్చిన పెట్టుబడి ప్రతిపాదనల విలువ సుమారు 150 శాతం పెరిగినట్టు తెలిపింది. 2014-15తో పోలిస్తే, 2021-22లో రాష్ట్ర ఐటీ ఎగుమతులు రెండింతలయ్యాయి. తా జా పెట్టుబడులతో మరో 60 వేల మందికి ఉపాధి లభించనున్నది.
పెట్టుబడులకు గేట్ వే
చైనాను వదిలి భారత్లోకి ప్రవేశిస్తున్న తయారీ రంగ పరిశ్రమలకు, విదేశీ పెట్టుబడులకు తెలంగాణ గేట్ వే ఆఫ్ ఇండియాగా మారింది. తైవాన్కు చెందిన ప్రపంచ దిగ్గజ సంస్థ ఫాక్స్కాన్ ఇక్కడ అతిపెద్ద తయారీ కేంద్రాన్ని పెట్టేందుకు ముందుకు రావడమే ఇందుకు ఉదాహరణ. అమెరికాకు చెందిన బోయింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా విమానాలు, హెలికాప్టర్ల బాడీ లు, ఇతర విడిభాగాలను తయారు చేస్తున్నది. ఇక ఐటీ, ఔషధరంగ పరిశ్రమల్లో ఇప్పటికే నగరం తిరుగులేని శక్తిగా మారింది. మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, యాపిల్, నోవార్టిస్ వంటి ప్రపంచస్థాయి కంపెనీలు అమెరికా వెలుపల తమ రెండో అతిపెద్ద క్యాంపస్లను ఏర్పాటుచేశాయి.
విప్లవాత్మక విధానాలు, సమర్థ నాయకత్వం
సుహృద్భావపూరిత వాతావరణం, సరళీకృత విధానాలు తెలంగాణలో ఉండటం వల్లే పెట్టుబడులకు ఈ ప్రాంతం అనుకూలంగా ఉన్నదని ఇన్వెస్టర్లు విశ్వసిస్తున్నట్టు ఎంఎస్ఎంఈ-ఈపీసీ నివేదిక తెలిపింది. విప్లవాత్మక విధానాలు, సమర్థ నాయకత్వంతో అన్ని రంగాల్లో దూసుకుపోతున్న తెలంగాణపై విదేశీ కంపెనీల దృష్టి కేంద్రీకృతమైంది. దీనికితోడు పెట్టుబడుల ఆకర్షణలో మంత్రి కేటీఆర్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా తయారీరంగాన్ని పరుగులు పెట్టించేందుకు కృషిచేస్తున్నారు. దావోస్ ప్రపంచ వాణిజ్య వేదిక, బయో ఏషియా సదస్సుతోపాటు అమెరికా, లండన్, తైవాన్ పర్యటనలను పెట్టుబడుల ఆకర్షణకు అనుకూలంగా మలుచుకున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు, పారిశ్రామిక విధానాలను వివరిస్తూ పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నారు.
తెలంగాణకు వచ్చిన ఏర్పాటైన కొన్ని విదేశీ సంస్థలు
జపాన్కు చెందిన నికోమాక్ తైకిషా క్లీన్రూమ్స్, దైఫూవ్కు కంపెనీ, ఫ్రాన్స్కు చెందిన ష్నీడర్ ఎలక్ట్రిక్ సంస్థ, శాఫ్రాన్ కంపెనీ, అమెరికాకు చెందిన వాహన విడిభాగాల తయారీ సంస్థ అడ్వాన్స్ ఆటోపార్ట్స్, అజ్యూర్ పవర్ గ్లోబల్ లిమిటెడ్, ప్రఖ్యాత డిజిటల్ టెక్నాలజీ కన్సల్టింగ్ సేవల సంస్థ గ్రిడ్ డైనమిక్స్, థర్మో ఫిషర్ సైంటిఫిక్ సంస్థ కంపెనీ, గ్రాస్-లైన్ పరికరాలను ఉత్పతి ్తచేసే జీఎంఎం ఫాడులర్ సంస్థ, ఇంగ్లండ్కు చెందిన సర్ఫేస్ మెజర్మెంట్ సిస్టమ్స్ సంస్థ, స్విట్జర్లాండ్కు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ ఫెర్రింగ్ ఫార్మా, స్టాడ్లర్రైల్ రైల్ కోచ్, సౌత్ కొరియాకు చెందిన బహుళజాతి ఆటోమోటివ్ దిగ్గజం హ్యుందయ్, కెనడాకు చెందిన ప్రముఖ జనరిక్ ఔషధాల తయారీ సంస్థ జాంప్ ఫార్మాస్యూటికల్స్ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ తమ శాఖలను ఏర్పాటు చేశాయి. మరికొన్ని ఈ ప్రక్రియలో ఉన్నాయి.