International Women’s Day | మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలందరూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్( Green India Challenge ) కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటాలని బీఆర్ఎస్( BRS ) ఎంపీ సంతోష్ కుమార్( MP Santosh Kumar ) పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సీఎస్ శాంతి కుమారి, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్తో కలిసి ఎంపీ సంతోష్ కుమార్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. పిల్లల్ని పెంచిన చేతులు మొక్కల్ని పెంచితే.. ప్రకృతి పరవశించిపోతుందని పేర్కొన్నారు. తమ పిల్లల్ని పెంచడంలో స్త్రీమూర్తులు చూపించే ప్రేమ, జాగ్రత్త అద్భుతమని.. అంతే ప్రేమతో మహిళా లోకమంతా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఆయన పిలుపునిచ్చారు.
స్త్రీలు శక్తిస్వరూపులని, వారు తాము తలపెట్టిన అన్ని కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేయగలరు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉమెన్స్ డే ప్రత్యేక కార్యక్రమంలో ప్రతి మహిళ, విద్యార్ధిని పాల్గొనేలా తనవంతు కృషి చేస్తాను. – మంత్రి సబితా ఇంద్రారెడ్డి
సృష్టికి మూలం స్త్రీమూర్తి అని, మహిళలంతా ప్రకృతి పరిరక్షణ కోసం పాటు పడాలి. మార్చి 8న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటాలి. మహిళా ఉద్యోగులంతా విరివిగా మొక్కలు నాటాలి. – సీఎస్ శాంతి కుమారి
మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూనే పుడమి బాగుకోసం అలుపెరగక కృషి చేస్తున్నారు. సాలుమారద తిమ్మక్కగారి స్పూర్తితో ప్రతి మహిళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మొక్కను నాటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి. – స్మితా సబర్వాల్
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం తరువాతి తరాల బాగుకోసం తలపెట్టిన నిస్వార్ధమైన కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ప్రతి మహిళా భాగస్వామి కావాలి. – ప్రియాంక వర్గీస్