Harish rao | హైదరాబాద్/సిటీబ్యూరో, మార్చి 13 (నమస్తే తెలంగాణ): నిమ్స్ దవాఖానలో ‘అంతర్గత ఆన్లైన్ విధానం’ ప్రారంభించాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ఆదేశించారు. ఓపీ రిజిస్ట్రేషన్ మొదలు వైద్యులను సంప్రదించడం, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, ఫలితాలు, చికిత్స అందించడం ఇలా అన్ని దశల్లోనూ ఆన్లైన్లో పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. ఇందుకు సమగ్ర విధానం రూపొందించాలని చెప్పారు. నిమ్స్, ఎంఎన్జే క్యాన్సర్ దవాఖానల పనితీరుపై మంత్రి సోమవారం సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశనంలో ప్రభుత్వ దవాఖానలు బలోపేతమై ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నాయని అభినందించారు. ముఖ్యంగా నిమ్స్పై ప్రజల్లో అపారమైన నమ్మకం ఉన్నదని, దాన్ని కాపాడుకోవాలని సూచించారు. దూర ప్రాంతాల రోగులకు అదేరోజు ఓపీ, కన్సల్టేషన్, పరీక్షలు, డాక్టర్ మెడికల్ అడ్వైజ్ పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. ఇందుకోసం రివ్యూ ఓపీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎమర్జెన్సీ వార్డులో బెడ్స్ కొరత లేకుండా అనుసరిస్తున్న విధానాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని చెప్పారు.
మరింత మెరుగుపడాలని సూచించారు. ఇన్ పేషెంట్ (ఐపీ), ఔట్ పేషెంట్ (ఓపీ) బిల్లుల చెల్లింపు కోసం కొత్త కౌంటర్లు ఏర్పాటు చేయడాన్ని మంత్రి అభినందించారు. కార్డియోథొరాసిక్ సర్జరీ విభాగం, నిలోఫర్ పీడియాట్రిక్ విభాగం కలిసి బ్రిటన్ వైద్య బృందం సహకారంతో చిన్నారులకు గుండె సర్జరీలు నిర్వహించడం గొప్ప విషయమని కొనియాడారు. రోగులకు ఇబ్బంది కలుగకుండా నిమ్స్ దవాఖాన నుంచి బయటి వాహనాల రాకపోకలు నియంత్రించి, వాయు, శబ్ద కాలుష్యాన్ని తగ్గించాలని ఆదేశించారు.
ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ తరఫున మొబైల్ క్యాన్సర్ స్రీనింగ్ను జిల్లాల్లో ఎక్కువగా నిర్వహించాలని సూచించారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత 300 పడకల కొత్త బ్లాక్ను ప్రారంభిస్తామని చెప్పారు. నిమ్స్, ఎంఎన్జేలో పరిశోధనలపైనా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేతా మహంతి, నిమ్స్ ఇంచార్జి డైరెక్టర్ బీరప్ప, ఎంఎన్జే డైరెక్టర్ జయలత, సీఎం ఓఎస్డీ గంగాధర్, అరోగ్య శ్రీ సీఈవో విశాలాచ్చి, టీఎస్ఎంఎస్ఐడీసీ సీఈ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ ఏడాది జనవరిలో 15 కిడ్నీ మార్పిడి సర్జీలు పూర్తిచేసి నిమ్స్ ప్రతిష్టను జాతీయ స్థాయికి చేర్చినందుకు వైద్యులను మంత్రి హరీశ్రావు ప్రత్యేకంగా అభినందించారు. నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రకారం అవయవ దాతలు, మార్పిడుల విషయంలో 2022లో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నదని గుర్తు చేశారు. ఇందులో నిమ్స్ కృషి ఎంతో ఉన్నదని చెప్పారు. ఇందుకు జీవన్ దాన్ కోఆర్డినేటర్ డాక్టర్ స్వర్ణలత, డీఎంఈ, నిమ్స్ డైరెక్టర్కు అభినందనలు తెలిపారు. ఆర్థో విభాగంలో మూడేండ్లలో 200 మందికి సోలియోసిస్ (గూని) సర్జరీలు చేశారని మెచ్చుకున్నారు.