హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): ఇంటర్మీడియట్ కోర్సుల సిలబస్ సమగ్రంగా మారనున్నది. వచ్చే విద్యాసంవత్సరం కల్లా కొత్త సిలబస్ అందుబాటులోకి రానున్నది. శుక్రవారం నిర్వహించిన ఇంటర్ బోర్డు సమావేశంలో సిలబస్ మార్పు, కొత్త సిలబస్ ఖరారుకు పాలకమండలి ఆమోదం లభించింది. నూతన సిలబస్ రూపకల్పనకు సబ్జెక్టుల వారీగా నిపుణుల కమిటీలను వేయాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన పాలకమండలి సమావేశం నిర్ణయించింది. ఇప్పటికే తెలుగు, ఇంగ్లిష్ సిలబస్ను మార్చారు. తాజాగా మిగతా సబ్జెక్టుల్లో కొత్త సిలబస్ తీసుకురానున్నారు. సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఇంటర్బోర్డు కార్యదర్శి నవీన్మిట్టల్, ఓయూ వీసీ డీ రవీందర్, జేఎన్టీయూ వీసీ కట్టా నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ముందే విద్యార్థుల చేతికి పుస్తకాలు
ప్రభుత్వ కాలేజీల విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలను ముందే అందజేయాలని అధికారులు నిర్ణయించారు. ఏటా పుస్తకాల పంపిణీ తీవ్ర జాప్యమవుతుండగా, వచ్చే విద్యాసంవత్సరం కోసం పుస్తకాల ముద్రణ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని తెలిపారు.
అఫిలియేషన్ల సాగతీతకు చెక్
ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు ఇంటర్బోర్డు ఏటా జారీచేసే అనుబంధ గుర్తింపును విద్యాసంవత్సరం మధ్య వరకు పొడిగించకుండా మే నెలాఖరు కల్లా పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇక మిక్స్డ్ ఆక్యుపెన్సీతో నడుస్తున్న కాలేజీలకు ఒకట్రెండేండ్లు మాత్రమే అనుమతి ఉంటున్నదని మంత్రి సబిత తెలిపారు. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని యాజమాన్యాలు ఆయా భవనాలను మార్చాలని సూచించారు. ఈ ఏడాది 432 కాలేజీలు మిక్స్డ్ ఆక్యుపెన్సీ భవనాల్లో నడుస్తుండగా, వీటికి ఫైర్ ఎన్వోసీ తప్పసరికావడంతో అవి అనుబంధ గుర్తింపును పొందలేకపోతున్నాయి.