జిన్నారం, మార్చి 17: తెలంగాణ ప్రభుత్వం మహిళల రక్షణకు కఠిన చట్టాలు తీసుకొచ్చిందని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ అన్నారు. బుధవారం గడ్డపోతారం పారిశ్రామిక వాడలోని మెట్రోకెమ్ ఏపీఎల్ పరిశ్రమ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్తో పాటు జిల్లా ఎస్పీ చంద్రశేఖర్రెడ్డి, షీటీమ్స్ డీసీపీ అనసూయ, ఎస్సీఎస్సీ సెక్రెటరీ జనరల్ కృష్ణ, ఉమెన్ ఫోరం పద్మప్రియ, పరిశ్రమ సీఎండీ ఎన్.వెంకటేశ్వర్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా పరిశ్రమలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కమిషనర్ సజ్జనార్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని తెలిపారు. ఐటీ తర్వాత ఫార్మా రంగంలో మహిళలు ఎక్కువగా పనిచేస్తున్నారని చెప్పారు. ఫార్మారంగంలో ప్రపంచ క్యాపిటల్గా ఇండియా ఉందన్నారు. చాలా రకాల మందులను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నామన్నారు. కొవిడ్-19 సమయంలో పోలీసులు, వైద్యులు, పారిశుధ్య కార్మికులతో పాటు ఫార్మా పరిశ్రమల్లో కార్మికులు బాగా పనిచేసినట్లు గుర్తుచేశారు. మహిళలు పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ రెండింటినీ విజయవంతంగా నడిపిస్తూ పని చేస్తున్నారన్నారు. కలలు కనాలి వాటిని సాకారం చేసుకోవాలని మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం చెప్పిన సూక్తులను గుర్తుచేశారు. మహిళలకు ఏ రంగంలోనైనా వేధింపులు తప్పడం లేదని, ఇలాంటి వాటి నుంచి వారిని రక్షించేందుకు తెలంగాణ ప్రభు త్వం కఠిన చట్టాలను తీసుకొచ్చిందన్నారు. వేధింపులు ఎదుర్కొంటున్న మహిళలు చాలా మంది కేసులు పెట్టడానికి ముందుకు రావడం లేదన్నారు. కేసులు పెడితే నిందితులకు శిక్ష పడే విధంగా చూస్తామన్నారు. ఇలాంటి ఘటనల్లో తెలంగాణలో ఎనిమిది కేసుల్లో 11 మందికి శిక్ష పడిందని గుర్తు చేశారు. అనవసర ఫ్రెండ్ రెక్వెస్ట్లను ఆక్సెప్ట్ చేయొద్దన్నారు. పిల్లలు కూడా మొబైల్ వినియోగిస్తున్న తీరును గుర్తించాలన్నారు. సంగారెడ్డి, సైబరాబాద్ పోలీస్ ఫోరం మహిళలకు అండగా ఉంటుందన్నారు. మెట్రోకెమ్ పరిశ్రమలో నాలుగు వందల మంది మహిళ ఉద్యోగులు ఉండడం అభినందనీయమని, వారికి ప్రత్యేకంగా వాహనం సౌకర్యం, పరిశ్రమలో సదుపాయాలు కల్పించిన పరిశ్రమ సీఎండీ వెంకటేశ్వర్రావును అభినందించారు. అనంతరం ఎస్పీ చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ మహిళలకు ఇంట్లో, బయట వేధింపులు ఎక్కువగా ఉంటున్నాయ న్నారు. ఇంటి వేధింపులు ఉంటే 100కు ఫోన్ చేయాలని సూచించారు. సెల్ఫోన్ ద్వారా మహిళలకు సమస్యలు వస్తున్నాయని తెలిపారు. ఫొటోస్ తీయడం, అసభ్యకరమైన మెస్సెజ్లు పంపడం, సోషల్ మీడియా ద్వారా బ్లాక్ మెయిల్ చేయడం జరుగుతున్నాయని తెలిపారు. ఇలాంటి వాటిపై ధైర్యంగా ముందుకు రావాలన్నారు. అనంతరం షీటీమ్స్ డీసీసీ అనసూయ, ఉమెన్ ఫోరం పద్మప్రియ, పరిశ్రమ సీఎండీ ఎన్.వెంకటేశ్వర్రావు, ఎస్సీఎస్సీ సెక్రెటరీ జనరల్ కృష్ణ, మోడల్ అసోసియేషన్ అధ్యక్షుడు మూర్తి, సర్పంచ్ ప్రకాశ్చారి మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం పరిశ్రమలో మహిళ ఉద్యోగులకు నిర్వహించిన పలు పోటీల్లో గెలుపొందిన వారికి సజ్జనార్ బహుమతులను ప్రదానం చేశారు.