భువనగిరి కలెక్టరేట్, ఫిబ్రవరి 20 : రాబోయే ఇంటర్మీడియట్, పదో తరగతి పరీక్షలను పకండ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ హనుమంతు కె.జెండగే అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం ఇంటర్మీడియట్, విద్యాశాఖ, సంబంధిత శాఖల అధికారులతో పరీక్షలకు తీసుకోవాల్సిన చర్యలు, బాధ్యతలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 28 నుంచి మార్చి 16 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు ఉంటాయని, జిల్లాలో 30 పరీక్ష కేంద్రాల్లో మొదటి, రెండో సంవత్సరం కలిపి మొత్తం 12,559 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష ఉంటుందని, 9 గంటల తరువాత పరీక్ష కేంద్రాల లోపలికి విద్యార్థులకు అనుమతి ఉండదని చెప్పారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పదో తరగతి పరీక్షలు జరుగుతాయని, మొత్తం 51 పరీక్షా కేంద్రాల్లో 9,402 మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తారని అన్నారు. ఫ్లయింగ్, సిట్టింగ్ స్వాడ్స్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పరీక్షల నిర్వహణకు సంబంధిత అధికారులు సమన్వయంతో పని చేయాలని, పరీక్షల సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండరాదని, తాగునీరు, టాయ్లెట్స్, ఫ్యాన్లు, వెలుతురు, తగిన వసతులు కల్పించాలని, ప్రాథమిక చికిత్సతోపాటు వైద్య బృందాలు అందుబాటులో ఉండాలని సూచించారు. పరీక్షా కేంద్రాల్లో తగినంత ఫర్నిచర్తోపాటు సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉండాలని తెలిపారు. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా పరీక్ష సమయానికి ఆర్టీసీ బస్సులు నడిపేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. స్మార్ట్ ఫోన్లు, మొబైల్స్, స్మార్ట్ వాచీలు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి ఉండదని తెలిపారు. పరీక్షల అనంతరం జవాబు పత్రాలను క్లోజ్డ్ వెహికిల్స్లో తరలించే విధంగా విద్యాశాఖ, తపాల శాఖ చర్యలు తీసుకోవాలని సూచించారు. డిప్యూటీ పోలీస్ కమిషనర్ రాజేశ్ చంద్ర మాట్లాడుతూ అన్ని పరీక్షా కేంద్రాల వద్ద తగినంత బందోబస్తు ఏర్పాటు చేస్తామని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎ.భాసరరావు, భువనగరి రెవెన్యూ డివిజనల్ అధికారి అమరేందర్, జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణ రెడ్డి, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రమణి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.