హైదరాబాద్, అక్టోబరు 19 (నమస్తే తెలంగాణ): ఎన్నికల్లో పార్టీలు, అభ్యర్థుల కార్యకలాపాలపై ఎన్నికల సంఘం పటిష్టమైన నిఘా వ్యవస్థ ద్వారా పర్యవేక్షిస్తున్నది. ఎన్నికల ప్రచారం, ప్రసారం, నియమావళి ఉల్లంఘనలు, సోషల్ మీడియా తదితర వాటిపై నిఘా పెట్టడానికి ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసింది. బీఆర్కేఆర్ భవన్లో ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూంను సిద్ధం చేసింది.
దీని ద్వారా అభ్యర్థులు, రాజకీయ పార్టీల సభలు, సమావేశాలు, మీడియాలో ప్రసారమయ్యే కథనాలు, సమావేశాలు, సోషల్ మీడియా, చెక్పోస్టుల్లోని సీసీ కెమెరాలకు అనుసంధానం చేయడం, సీవిజిల్ యాప్, 1950 నెంబర్, సువిధ ఇలా అన్ని రకాల ఫిర్యాదుల వ్యవస్థను ఇక్కడి నుంచే పర్యవేక్షిస్తారు. వీటన్నంటిని సీఈవో వికాస్ రాజ్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. వీటిపై కేంద్ర ఎన్నికల సంఘానికి సమాచారం అందిస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్లో ఎలక్ట్రానిక్ మీడియా మానిటరింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. దీనిలో 16 తెలుగు న్యూస్ ఛానల్స్ లో ప్రసారమయ్యే వార్త కథనాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ను కూడా ఇక్కడే ఏర్పాటు చేశారు.