నల్లగొండ ప్రతినిధి, మే 26 (నమస్తే తెలంగాణ)/నేరేడుచర్ల: :‘తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాలుగు కోట్ల ప్రజల పండుగ. అలాంటి వేడుకను ఫెయిల్ తెలంగాణ కార్యక్రమం చేస్తారట. తెలంగాణ ఫెయిల్ కాలేదు, కాంగ్రెస్ ఫెయిల్ అయ్యింది. ఆ పార్టీ నేతలు నాడు ఉద్యమంలో కలిసి రాలేదు. ఇప్పుడు అభివృద్ధిలో, తెలంగాణ ప్రజల సంబురంలో కలిసి రావడం లేదు. అప్పుడు రాజీనామాలు చేయకుండా మొఖం చాటేశారు. వెన్ను చూపి పారిపోయారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును, తెలంగాణ జాతిని, అమరుల త్యాగాలను కాంగ్రెస్ అవమానిస్తున్నది’ అని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఫెయిల్ తెలంగాణ పేరుతో జరుపుకొంటామని రేవంత్రెడ్డి మాట్లాడటం ఆయన వక్రబుద్ధికి నిదర్శనమని మండిపడ్డారు.
తెలంగాణ ఎందులో ఫెయిల్ అయిందో చెప్పాలని డిమాండ్ చేశారు. 24 గంటల కరెంటు, వృద్ధులకు రూ.2 వేలు, దివ్యాంగులకు రూ.3 వేల పింఛన్, రైతుబంధు కింద ఎకరానికి రూ.5 వేలు, రైతుబీమా రూ.5 లక్షలు, మిషన్ భగీరథ కింద ఇంటింటికీ తాగునీరు, పేదింటి ఆడబిడ్డకు కల్యాణలక్ష్మి? కేసీఆర్ కిట్టు ఇస్తున్నందుకా? జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నందుకా? పల్లె ప్రగతి, పట్టణ ప్రగతితో గ్రామాలు, నగరాలు అభివృద్ధి చెందుతున్నందుకా? దళితులకు దళితబంధు ఇస్తున్నందుకా? ఎందుకు ఈ ఫెయిల్ ఉత్సవాలు అని ప్రశ్నించారు. మిర్యాలగూడ, హుజూర్నగర్లో శుక్రవారం మంత్రి జగదీశ్రెడ్డితో కలిసి హరీశ్రావు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన లు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం మిర్యాలగూడ, మఠంపల్లిల్లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడారు.\
తెలంగాణ కోసం రాజీనామా చేయని కిషన్రెడ్డి ఆవిర్భావ ఉత్సవం ఎలా చేస్తారని హరీశ్రావు నిలదీశారు. ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను ఏపీలో కలిపినందుకా? లోయర్ సీలేరు ప్రాజెక్టును తెలంగాణకు దక్కకుండా చేసినందుకా? బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని ఎగవెట్టినందుకా? రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఇవ్వనందుకా? ఏమని చేస్తారు ఉత్సవాలు అని ప్రశ్నించారు. మిషన్ భగీరథకు నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్ సూచించినా? 15వ ఆర్థిక సంఘం తెలంగాణకు రూ.5 వేల కోట్లు ఇవ్వాలని చెప్పినా పెడచెవిన పెట్టినందుకా? బోరు మోటర్లకు మీటర్లు పెట్టలేదని రాష్ర్టానికి రావాల్సిన రూ.35 వేల కోట్లను ఎగవెట్టినందుకా? అంటూ నిలదీశారు. ఇది పోరాటాల గడ్డ అని, బీజేపీ మాయమాటలకు మోసపోదని హెచ్చరించారు.
అభివృద్ధిని చూసి ఓర్వలేకనే జూటా మాటలని మండిపడ్డారు. నిరుద్యోగంపై హిమాచల్ సీఎం చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని కొట్టిపరేశారు. నిరుద్యోగం తెలంగాణలో కాదు.. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో పదవుల నిరుద్యోగం ఉన్నదని ఎద్దేవాచేశారు. హిమాచల్ నుంచి ఎంతో మంది తెలంగాణకు వచ్చి బతుకుతున్నారని, మాకు నీతులు చెప్పే స్థాయి ఆ రాష్ట్ర సీఎంకు లేదని మండిపడ్డారు. నీతులు మాని.. ఇక్కడి నుంచి నేర్చుకొని వెళ్లాలని హితవుపలికారు. మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో కాంగ్రెస్ మంచుకొండలా కరిగిపోగా బీఆర్ఎస్ తన అడ్డాగా మార్చుకున్నద న్నారు. ఎమ్మెల్యేలు భాస్కర్రావు, సైదిరెడ్డి, ఎంపీ బడుగుల, జడ్పీ చైర్మన్ నరేందర్రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్, చిరుమర్తి, భూపాల్రెడ్డి, నోముల భగత్ పాల్గొన్నారు.