ఉన్నది కాసింత జాగా అయినా సరే.. ఓ రెండు కూరగాయల మొక్కలు, రెండు పండ్ల మొక్కలు, రెండు ఆకుకూరల మొక్కలు పెంచేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. పట్టణాల్లో మిద్దె తోటల ద్వారా కావాల్సిన కూరగాయలను ఇంట్లోనే పండించుకొంటున్నారు. ఎవరికి వారు వినూత్న పద్ధతులను ఆవిష్కరిస్తున్నారు. ఈ కోవలోనే సాక్రో అనే సంస్థ ఏడు వరుసల సాగు పద్ధతిని ఉపయోగిస్తూ, మంచి ఫలితాన్ని రాబడుతున్నది.
హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తేతెలంగాణ): ఖాళీ స్థలాలు, డాబాలు, బాల్కనీలు, బహుళ అంతస్తులు, గేటెడ్ కమ్యూనిటీల్లో కాయగూరలు, ఆకుకూరలు, పండ్లు, పులు పండిస్తున్నవారి సంఖ్య రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్నది. ఒక్కమాటలో చెప్పాలంటే మిద్దెతోటల ఉద్యమం సాగుతున్నది. కొత్త ఆవిష్కరణలతో పంటలను పండిస్తున్నారు. సాక్రో స్వచ్ఛంద సంస్థ కూడా ఏడు వరుసల సాగు పేరుతో కొత్త ఆవిష్కరణ చేసింది. నానక్రాంగూడ చౌరస్తాలో హెచ్ఎండీఏ స్థలంలో ఈ విధానాన్ని చేపట్టింది. ఎకరా స్థలంలోనే స్వల్ప, దీర్ఘకాలిక రకాలను వేసింది. ఒక్క అంగుళం జాగా కూడా వృథా కాకుండా క్షేత్రాన్నే ఒక ప్రయోగశాలగా తీర్చిదిద్దారు. ఏడు వరుసల్లో రకరకాల పంటలు వేస్తూ తక్కువ సమయంలోనే దిగుబడి సాధిస్తున్నారు. కంది, బీన్స్, గోరుచిక్కుడు సాగు ద్వారా ఇతర పంటలకు నైట్రోజన్ అందించే విధానాన్ని అవలంబిస్తున్నారు.
ఏడు వరుసల సాగు ఇలా..
ఏడు వరుసల సాగు విధానాన్ని సాక్రో స్వచ్ఛంద సంస్థ చైర్మన్ డాక్టర్ సునీతప్రసాద్ వివరించారు. మొదటి వరుసలో కరివేపాకు వంటి ఎత్తున్న చెట్లు, రెండో వరుసలో సాధారణ ఎత్తు పెరిగే రకాలు, మూడో వరుసలో క్రీపర్ రకాలు, తర్వాత వరుసగా పూల మొక్కలు, రకరకాల కూరగాయలు, ఆకుకూరలు, దుంప రకాలు సాగు చేస్తున్నట్టు వెల్లడించారు. 30 రోజుల్లో మొదటి పంట వస్తుందని తెలిపారు. తాము ప్రతిరోజు 60 కుటుంబాలకు అవసరమయ్యే కూరగాయలు, ఆకుకూరలు అందిస్తున్నట్టు పేర్కొన్నారు. గ్రామాల్లో చిన్న, సన్నకారు రైతులకు ఏడు వరుసల సాగు విధానం ఆదాయ వనరుగా మారుతుందని వెల్లడించారు. రసాయన ఎరువులు వాడకుండా, 7 రకాల బ్యాక్టీరియా, సేంద్రియ ఎరువులతో ఈ పంటలను పండిస్తున్నారు. ఈ విధానాన్ని పరిశీలించిన తెలంగాణ ఉద్యానశాఖ అధికారులు.. సాక్రో సంస్థను ప్రశంసించారు. ఈ పద్ధతిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు. త్వరలో ప్రధాన రోడ్ల డివైడర్లపై పశుగ్రాసం పెంపకం బాధ్యతలను సాక్రో సంస్థకు అప్పగించాలని అర్బన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ భావిస్తున్నట్టు డైరెక్టర్ ప్రభాకర్ పేర్కొన్నారు.
పోషకాహారం అందించటమే లక్ష్యం
ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ విధానంలో ఉత్తమ మార్గాలను అన్వేషిస్తూ సాగు చేస్తున్నాం. రైతులకూ దీనిపై అవగాహన కల్పిస్తున్నాం. ఆరు రకాల బ్యాక్టీరియాలు, 6 రకాల ఫంగస్లను సాగులో వాడుతూ పోషకాహార పంటలను పండిస్తున్నాం.