కులగణనకు బీజేపీ నేతలు ఒత్తిడి తేవాలి
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య
కాచిగూడ, ఫిబ్రవరి 20: ప్రధాని మోదీ పాలనలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య విమర్శించారు. జనాభా గణనలో కులగణన కూడా చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇందుకు బీజేపీలోని బీసీ నేతలంతా కేంద్రంపై ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు. ఆదివారం కాచిగూడలోని ఒక హోటల్లో బీసీ సంక్షేమ సంఘం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కుల గణన కోసం జాతీయస్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయడం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీ గణన పట్ల తన నిజాయతీని ప్రదర్శించారని ప్రశంసించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం బీసీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నదని దుయ్యబట్టారు. పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టాలని, చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, కేంద్ర క్యాబినెట్లో బీసీ మంత్రిత్వశాఖను ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, సంఘం నాయకులు కోలా జనార్ధన్, అంజి, జయంతిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.