వనపర్తి : తెలంగాణలో సామాన్యులకు సత్వర న్యాయ సేవలందించేందుకు గాను కోర్టులో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం చిత్తశుద్ధితో చర్యలు తీసుకుంటుందని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా కోర్టు ప్రధాన భవనంతో పాటు సీనియర్ సివిల్ జడ్జి కోర్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ సమాజంలో నేరాల స్వరూపం, స్వభావం మారుతున్నందున దానికి అనుగుణంగా న్యాయవాదులు తమ వృత్తిలో నైపుణ్యతను పెంచుకోవాలని సూచించారు.
గతంలో సామాన్యులు నేరాలు చేసే వారని, ప్రస్తుతం చదువుకున్నవారు నేరాల్లో ఉంటున్నారని తెలిపారు. శాస్త్ర సాంకేతిక రంగం అభివృద్ధి చెందిన నాటినుంచి వివాదాలు, నేరాలు వాటి రూపు మార్చుకున్నాయని అన్నారు. కోర్టులకు మౌలిక సౌకర్యాలు కోసం ఎన్ని నిధులైన అందజేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని పేర్కొన్నారు.
జస్టిస్ నాగార్జున మాట్లాడుతూ ఇదే కోర్టులో కెరీర్ ప్రారంభించి హై కోర్టు జడ్జి స్థాయికి ఎదిగానని అన్నారు. న్యాయవాదులు ఎప్పటికప్పుడు స్కిల్స్ పెంచుకోవాలని, సీనియర్స్ వద్ద నేర్చుకోవాలని సూచించారు. ప్రజలకు న్యాయవ్యవస్థ మీద ఉన్న విశ్వాసం పెంపొందించాలని తెలిపారు. వనపర్తి కి మరో రెండు కోర్టులు రానున్నాయని వెల్లడించారు. ప్రభుత్వం కోర్టుల సముదాయానికి 20ఎకరాలు కేటాయించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి సాంబశివ నాయుడు, న్యాయవాదులు, అధికారులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.