Made in India | ఆరంభశూరుల్లో అగ్రగణ్యుడు మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన ‘మేకిన్ ఇండియా’ నినాదం కాస్తా ‘జోకిన్ ఇండియా’గా మారింది. ‘మేకిన్ ఇండియా’ వల్ల దేశం ఒక్క అడుగుకూడా ముందుకెయ్యకపోగా వందల అడుగులు వెనక్కి పోయింది. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్టు దేశంలో కొత్త పరిశ్రమల మాట పక్కన పెడితే ఎప్పటి నుంచో దేశానికే వన్నె తెచ్చిన పరిశ్రమలెన్నో నేడు అవసానదశకు చేరుకున్నాయి. బళ్లారి జీన్స్, సూరత్ డైమండ్స్, కశ్మీర్ బ్యాట్లు, సోలాపూర్ చద్దర్లు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో డిమాండ్ ఉండే దేశీయ పరిశ్రమలన్నీ నేడు అంపశయ్య మీదకు చేరాయి. మేకిన్ ఇండియా ఎంబ్లమ్ మీద పెట్టిన దృష్టి ప్రాబ్లమ్ మీద పెట్టకపోవడమే అత్యంత విషాదకరం.
బళ్లారి జీన్స్ అంటే ఫ్యాషన్.. సూరత్ డైమండ్స్ అంటే హంగు, ఆర్భాటం.. కశ్మీర్ బ్యాట్లు అంటే క్వాలిటీ.. సోలాపూర్ చెద్దర్లు, మంగళూరు టైల్స్ అంటే డిమాండ్.. కానీ, ప్రస్తుతం దేశంలో ఇవి కనుమరుగయ్యే దుస్థితికి చేరుకొన్నాయి. కారణం.. బీజేపీ పాలన. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా దేశీయ పరిశ్రమ అంపశయ్యపై చేరింది. కారణం.. బీజేపీ పాలన.
అవును! దేశానికి వన్నె తెచ్చిన ఈ పరిశ్రమలు ఇప్పుడు గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాయి. జీఎస్టీ పేరుతో పన్నులు మోపి, రాయితీలను ఎత్తేయటంతో చిన్న పరిశ్రమలు కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదపుటంచునకు చేరుకొన్నాయి.
మేకిన్ ఇండియాను డౌన్లోడ్ ఇండియాగా మార్చేసి అడ్డదిడ్డంగా దిగుమతులకు అనుమతులు ఇవ్వటంతో వేల మంది కార్మికులు రోడ్డున పడుతున్నారు. అదే సమయంలో చేతివృత్తులు, కులవృత్తులు, దేశీయ పరిశ్రమలు, అంతర్జాతీయ పరిశ్రమలతో తెలంగాణ కళకళలాడుతున్నది.
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): ‘అచ్చేదిన్’ తెస్తామని కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం, ప్రజలకు సచ్చే దినాలను చూపిస్తున్నది. ఇప్పటికే ధరాఘాతం, ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో సామాన్యులు కుదేలవుతుంటే.. పన్నుల వాత, రాయితీల ఎత్తివేతతో చిన్న పరిశ్రమలు మూతపడుతున్నాయి. ఒకవైపు ‘మేకిన్ ఇండియా’ నినాదాన్ని ఇస్తూనే, చైనా నుంచి దిగుమతులకు కేంద్రం గేట్లు బార్లా తెరిచింది. ఫలితంగా రోజుకు 270 కంపెనీల చొప్పున గడిచిన 8 ఏండ్లలో 7.84 లక్షల దేశీయ కంపెనీలకు తాళం పడింది. ఒకప్పుడు అనేక దేశాలకు వస్తువులను ఎగుమతి చేసిన దేశీయ పరిశ్రమలు, ఇప్పుడు తాళం కప్పతో దర్శనమిస్తున్నాయి. ఇదే సమయంలో సంప్రదాయ పరిశ్రమలకు తెలంగాణ ప్రభు త్వం గతవైభవాన్ని తీసుకొస్తున్నది.
చేతివృత్తులు, కులవృత్తులతో జీవనోపాధి పొందుతున్న కార్మికులకు, రంగాలకు గత ప్రభుత్వాల నుంచి ఆదరణ లభించక లక్షల మంది నైపుణ్యం ఉన్న కార్మికులు కూలీలుగా మారి వలస వెళ్లారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ వృత్తులకు పూర్వవైభవం తేవటంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. కాకతీయ టెక్స్టైల్ పార్క్, సిరిసిల్ల అప్పారెల్ పార్క్ ఏర్పాటు చేసి చేనేత, నేత కార్మికులకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేసింది. ఆధునిక సాంకేతిక సదుపాయాలతో పార్క్లు ఏర్పాటు చేయడం, గత విద్యుత్తు బకాయిలను మాఫీ చేయడంతోపాటు కొన్ని ఉత్పత్తులను (బతుకమ్మ చీరలు) ప్రభుత్వమే కొనుగోలు చేయడం ద్వారా కార్మికుల ఉపాధికి భరోసా ఇస్తున్నది. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పోచంపల్లి చీరలకు జాతీయ, అంతర్జాతీయ మార్కెంటింగ్ కల్పిస్తూ ప్రభుత్వమే బ్రాండ్ అంబాసిడర్గా మారింది. ‘మేకిన్ తెలంగాణ’గా రాష్ట్రం ఖ్యాతి గడించిందంటే అతిశయోక్తి కాదు.
తమంత దేశభక్తులు లేరని రోజూ జబ్బలు చరుచుకొనే బీజేపీ నేతల పాలనలో లక్షల సంఖ్యలో దేశీయ పరిశ్రమలు మూతపడ్డాయి. వందల ఏండ్లుగా నడుస్తూ దేశానికే వన్నె తెచ్చిన సంస్థలు కూడా మోదీ సర్కారు తప్పుడు నిర్ణయాలతో కుదేలయ్యాయి. విదేశీ వస్తువుల దిగుమతులపై బీజేపీ సర్కారు అమిత ప్రేమ చూపిస్తుండటంతో పోటీని తట్టుకోలేక అనేక దేశీయ పరిశ్రమలు మూతపడటంతో, దశాబ్ద క్రితం వరకు కళకళలాడిన పరిశ్రమలకు నేడు తాళం కప్పలు వేళాడుతున్నాయి.
పరిశ్రమ పేరు: చెన్నపట్టణ బొమ్మలు
ప్రాంతం: చెన్నపట్టణ, కర్ణాటక
ప్రారంభం: 1760
ప్రత్యేకత: సహజసిద్ధమైన రంగులతో, చేతితో చేసిన బొమ్మలు
ప్రభావం: 20 వేల మందిపై
కారణం: చైనా దిగుమతులను కేంద్రం ప్రోత్సహించడం
వివరణ: పండుగొస్తే ప్రతీ ఇంటా బొమ్మల కొలువులో ముద్దుగా కొలువుదీరే చెన్నపట్టణ చిట్టి బొమ్మలు ఇప్పుడు చిన్నబోతున్నాయి. చైనా నుంచి బొమ్మల దిగుమతులకు మోదీ సర్కారు తలుపులు బార్లా తెరువడంతో ఈ బొమ్మల పరిశ్రమ దారుణంగా దెబ్బతిన్నది. కళాకారులు ఎంతో నైపుణ్యాన్ని ప్రదర్శించి రూపుదిద్దిన బొమ్మలకు సరైన ధర కూడా లభించట్లేదు. చెన్నపట్టణలో తయారైన రూ.100 విలువైన బొమ్మను పోలిన ప్లాస్టిక్ బొమ్మ చైనా బజార్లలో రూ.30కే లభిస్తుండటంతో కొనుగోలుదారులు చైనా సరుకుపై మక్కువ చూపిస్తున్నారు.
పదేండ్ల కిందటి వరకూ రామనగర, చెన్నపట్టణ ప్రాంతాల్లో ప్రతి ఇంట్లో బొమ్మల తయారీ ఒక కుటీర పరిశ్రమగా ఉండేది. కరియన దొడ్డి వంటి గ్రామంలో ప్రతి ఇల్లూ బొమ్మల తయారీ పరిశ్రమే. చుట్టు పక్కల గ్రామాల్లో దాదాపు 20 వేల మంది బొమ్మల తయారీ కళాకారులుండేవారు. చైనా బొమ్మల దాడికి వీళ్లంతా ఉపాధి కోల్పోయారు. పెద్దగా చదువు లేకపోవటంతో పట్టణాలు, నగరాల్లో కూలీలు, సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారు. చెన్నపట్టణ బొమ్మలకు రంగులను చేతితోనే వేయాలి. యంత్రంతో వేస్తే అతకకపోవటం వాటి ప్రత్యేకత.
చైనా బొమ్మల వల్ల ఉపాధి కోల్పోయాం
మైసూరు పులిగా ప్రసిద్ధిగాంచిన టిప్పు సుల్తాన్ చెన్నపట్టణానికి పట్టుతోపాటు పరిచయం చేసిన పరిశ్రమ బొమ్మల తయారీ. తర్వాతి కాలంలో మైసూరు రాజులు ఈ పరిశ్రమను ప్రోత్సహించి వృద్ధి చేశారు. దసరా, దీపావళి పర్వదినాల్లో బొమ్మల కొలువు ప్రతి ఇంటా పెట్టడం పాత మైసూరుతోపాటు దేశంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్నది. ఇప్పుడు చేతితో తయారైన బొమ్మల స్థానంలో చైనా బొమ్మలు వచ్చి మా కడుపు కొట్టాయి.
– వెంకటేశ్, బొమ్మల తయారీదారు, చెన్నపట్టణ, కర్ణాటక
పరిశ్రమ పేరు: బళ్లారి జీన్స్
ప్రాంతం: బళ్లారి, కర్ణాటక
ఆరంభం: 1900
ప్రత్యేకత: మన్నికైన జీన్స్
ప్రభావం: లక్ష మందిపై
కారణం: ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించకపోవడం
వివరణ: బెల్బాటమ్, ప్యారెలల్ ప్యాంట్లనే ధరించిన భారతీయులకు జీన్స్ను పరిచయం చేసిన సంస్థ ల్లో బళ్లారి జీన్స్ పరిశ్రమ ఒకటి. ఇప్పుడు ఆ జీన్స్ ఉనికికి ప్రమాదం ఏర్పడింది. ఈ ప్రాంతంలో పత్తి సాగు ఎక్కువ. ఇక్కడి నుంచి దక్షిణాదిలోని అనేక ప్రాంతాలకు రైలు సదుపాయం ఉన్నది. ఈ కారణంగానే బ్రిటిష్ పాలకులు సైన్యానికి ఇక్కడి నుంచి యూనిఫారాలు కుట్టించి పంపేవారు.
కాలగమనంలో రెడీమేడ్ దుస్తుల తయారీ ప్రారంభించారు. చిన్న యంత్రాలతో ఉత్పత్తి నెమ్మదిగా సాగుతుండటంతో పెద్ద యం త్రాల కొనుగోలుకు సహకరించాలని కార్మికులు 2017, 2018లో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. ఈ వినతులను కేంద్రం పట్టించుకోలేదు. ఇదే సమయంలో గుజరాత్ అహ్మదాబాద్లో జీన్స్ అపారెల్ పార్కును ప్రారంభించి ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఈ దెబ్బ కు కుదేలైన బళ్లారి జీన్స్పై కరోనా మరింత ప్రభావం చూపింది.
గత రెండుమూడేండ్లలోనే బళ్లారి జీన్స్ ఉత్పత్తి, అమ్మకాలు నలభైశాతం తగ్గాయి. ఇది రాబోయే పెద్ద ప్రమాదానికి సూచిక. ఇక్కడ ప్రత్యక్షంగా పది వేల కుటుంబాలకు, పరోక్షంగా లక్ష మందికి ఉపాధి లభిస్తున్నది. బంగ్లాదేశ్, అహ్మదాబాద్లో మాదిరి అపారెల్ పార్కును బళ్లారిలోనూ ప్రారంభించాలి. మార్కెటింగ్లో సాయపడాలి.
– పోలక్స్ మల్లికార్జున, జీన్స్ వ్యాపారి, బళ్లారి, కర్ణాటక
పరిశ్రమ పేరు : చెద్దర్ల తయారీ
ప్రాంతం : సోలాపూర్, మహారాష్ట్ర
ప్రారంభం : 1950
ప్రత్యేకత : దేశంలోనే నాణ్యమైన చెద్దర్లు
ప్రభావం : లక్ష మంది కుటుంబాలపై
కారణం : పరిశ్రమ తరలింపు, ప్రోత్సాహకాల లేమి
వివరణ: చలికాలం వచ్చిందంటే, అల్మారాలో ఉంచిన చెద్దర్లను అమ్మమ్మ తీసుకొచ్చి ఇవ్వడం ఇప్పటికీ గుర్తే. ఇంట్లో గృహిణులు గార్మెంట్ షాప్లలోకి వెళ్తే ముందుగా అడిగేది సోలాపూర్ చెద్దర్లే. నాణ్యంగా ఉండి, చౌకగా లభించడంతో 90వ దశకం వరకూ వీటికి అసాధారణ డిమాండ్ ఉండేది. యూరప్, అమెరికా, యూఏఈ, కువైట్, దక్షిణాఫ్రికాకు కూడా ఎగుమతి చేసేవారు. సోలాపూర్ పరిసర ప్రాంతాల్లోని లక్షమందికి ఉపాధి కల్పించే ఈ పరిశ్రమ చడీచప్పుడు లేకుండా ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్లోని అహ్మదాబాద్, సూరత్కు తరలిపోయింది. ప్రస్తుతం సోలాపూర్లో ఉన్న కొద్దిపాటి చిన్న పరిశ్రమలకు ప్రభుత్వ రాయితీ కరువైంది. దీంతో గతంలో ఓ వెలుగు వెలిగిన సోలాపూర్ బ్రాండ్ చెద్దర్లు భవిష్యత్తులో అంతర్ధానమయ్యే పరిస్థితి వచ్చింది.
నా చేతులతో లక్షకు పైగా చెద్దర్లను తయారు చేశాను. గతంలో ప్రతీ వారాంతంలో నగరం నడిబొడ్డున పెద్ద బజార్ ఏర్పాటుచేసి చెద్దర్లను విక్రయించేవాళ్లం. దేశంలోని నలుమూలల నుంచి వ్యాపారులు వచ్చి హోల్సేల్గా కొనుగోలు చేసేవారు. ఇప్పుడు పరిస్థితి మొత్తం మారిపోయింది. ఇక్కడి పరిశ్రమలను ఇతర ప్రాంతాలకు పట్టుకుపోయారు.
-కృష్ణస్వామి, చెద్దర్ల తయారీదారుడు, సోలాపూర్, మహారాష్ట్ర
పరిశ్రమ పేరు : సూరత్ వజ్రాల పరిశ్రమ
ప్రాంతం : సూరత్, గుజరాత్
ఆరంభం : 1865
ప్రత్యేకత : వజ్రాల శుద్ధి
ప్రభావం : 30 లక్షల మందిపై
కారణం : డిమాండ్ లేకపోవడం
వివరణ: తెల్లని కాంతిని రంగులమయం చేసే వజ్రాన్ని సానబెట్టే గుజరాత్ వజ్ర శుద్ధి కార్మికుల జీవితాలు 27 ఏండ్ల బీజేపీ పాలనలో కాంతిని కోల్పోయాయి. ప్రపంచంలోని 90 శాతానికి పైగా వజ్రాలను శుద్ధి చేస్తున్న సూరత్ కార్మికుల అవస్థలను బీజేపీ సర్కారు పట్టించుకోవట్లేదు. సౌరాష్ర్ట, సూరత్, నవ్సారి ప్రాంతాల్లో నివసించే దాదాపు 30 లక్షల మంది కార్మికులు.. సూరత్లోని 20 వేల చిన్న, పెద్ద ఫ్యాక్టరీలు, దుకాణాల్లో వజ్రాలను శుద్ధి చేసే పనిలో రోజూ నిమగ్నమవుతున్నారు.
పగలు, రాత్రి అని తేడా లేకుండా రోజులో పది నుంచి పన్నెండు గంటలపాటు పనిచేసినప్పటికీ, వీరి నెల జీతం రూ.10 వేలు కూడా దాటట్లేదు. దీనిపై కార్మికులు ఎన్నిసార్లు మొరపెట్టుకొన్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. స్థూల జాతీయోత్పత్తిలో వజ్రా ల వ్యాపారం ఏడెనిమిది శాతం ఉంటుందని ఆర్థిక నిపుణుల అంచనా. చాలీచాలని జీతం, భవిష్యత్తుపై బెంగతో 2010 నుంచి 2022 వరకు గుజరాత్లో 5 వేల మంది వజ్రాల శుద్ధి కార్మికులు ఆత్మహత్య చేసుకొన్నారంటే అక్కడి పరిస్థితులను అర్థం చేసుకోవచ్చు. పశ్చిమ దేశాలతోపాటు చైనాలో నెలకొన్న పరిస్థితుల వల్ల పాలిషింగ్ డైమండ్లకు ఇటీవల డిమాండ్ తగ్గింది. దీంతో 80 వేల మంది ఉపాధి కోల్పోయారు. అయినప్పటికీ ప్రభుత్వం వారికి చేయూతనివ్వట్లేదు.
20 ఏండ్లుగా డైమండ్ పాలిషింగ్ కార్మికుడిగా పనిచేస్తున్నా. ఈ కాలంలో నా జీతం కేవలం రూ.2 వేలే పెరిగింది. 27 ఏండ్లుగా రాష్ట్రంలో బీజేపీనే అధికారంలో ఉన్నది. అయినప్పటికీ మా కష్టాలను ఏ నాయకుడూ పట్టించుకోలేదు.
– భరత్ భాయ్ చౌదరి, డైమండ్ పాలిషింగ్ కార్మికుడు, సూరత్, గుజరాత్
పరిశ్రమ పేరు : బ్యాట్ల తయారీ
ప్రాంతం:కశ్మీర్ లోయ, జమ్ముకశ్మీర్
ఎప్పుడు ఆరంభం: 1920
ప్రత్యేకత:కశ్మీర్ విల్లో ట్రీతో బ్యాట్ల తయారీ
ప్రభావం : లక్షమందిపై
కారణం : దిగుమతులు పెరుగడం, రాయితీ లేమి
వివరణ: ‘మేకిన్ ఇండియా’ అనే నినాదాన్ని ఎన్నికల ప్రచారాస్త్రంగా చేసుకొని స్వదేశీ వస్తువులనే ప్రోత్సహిస్తామని గప్పాలు కొట్టిన బీజేపీ, చేతల్లో మాత్రం దానిని గాలికొదిలేసింది. ఫలితంగా భారత క్రికెటర్లే కాదు.. ప్రపంచంలోని టాప్ ప్లేయర్లు ఇప్పటివరకూ వినియోగిస్తున్న కశ్మీర్ విల్లో బ్యాట్లకు గిరాకీ తగ్గి, విదేశీ బ్యాట్లకు డిమాండ్ పెరిగింది. ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడం, లోయలో కలప రవాణాకు అడ్డంకులు సృష్టిస్తుండటంతో దాదాపు లక్షమంది భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. విల్లో ట్రీల పెంపకంపై కూడా ప్రభుత్వం రాయితీ ప్రకటించట్లేదని పలువురు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
లోయలో 400 తయారీ కర్మాగారాలున్నాయి. ఏడాదికి 30 లక్షల బ్యాట్లను ఉత్పత్తి చేసేవాళ్లం. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ప్రభుత్వ ప్రోత్సాహం లేదు. విల్లో ట్రీలు కనుమరుగవుతున్నాయి. రాయితీల ఊసేలేదు. ఇది ఇలాగే కొనసాగితే మరో ఐదేండ్లలో అన్ని ఫ్యాక్టరీలు మూతపడొచ్చు.
-జావిద్ అహ్మద్, కశ్మీర్లోయ విల్లో బ్యాట్ తయారీదారు.
పరిశ్రమ పేరు: జైనాకాట్ వాచీ
ప్రాంతం: జైనాకాట్, కశ్మీర్
ప్రారంభం: 1972
ప్రత్యేకత: ప్రపంచస్థాయి వాచీలు
ప్రభావం: 1500 కుటుంబాలపై
కారణం: జీఎస్టీ దెబ్బ, ప్రోత్సాహం లేకపోవడం
వివరణ: దేశీయ విపణికి ప్రపంచస్థాయి వాచీలను పరిచయం చేసిన హిందుస్థాన్ మెషిన్ టూల్స్ (హెచ్ఎంటీ) సంస్థ బెంగళూరు తర్వాత 1972లో కశ్మీర్ లోయలోని జైనాకాట్ ప్రాంతంలో వాచీల తయారీ కేంద్రాన్ని స్థాపించింది. 1500కు పైగా కుటుంబాలు ఉపాధి పొందేవి. ఇందులో 500కు పైగా కుటుంబాలు కశ్మీరీ పండిట్లవే. ఒకానొక దశలో బెంగళూరు కేంద్రంతో పోలిస్తే, ఇక్కడి నుంచి ఉత్పాదకత ఎక్కువగా ఉండేది. అయితే, 1990 దశకంలో పండిట్లపై ఉగ్రవాదుల దాడులతో ఉత్పత్తి తగ్గిపోయింది. జీఎస్టీ, ప్రభుత్వ ప్రోత్సాహం లోపించడంతో హెచ్ఎంటీ కార్యకలాపాలను నిలిపేసింది.
కశ్మీర్కు పారిశ్రామిక సంస్కృతిని పరిచయం చేసిందే జైనాకాట్ వాచీలు. ఇప్పుడు ఆ దర్పం మసకబారింది. ఇది తలుచుకుంటే బాధగా ఉంటుంది.
– మన్మోహన్ కౌల్, హెచ్ఎంటీ మాజీ ఉద్యోగి, కశ్మీర్
పరిశ్రమ పేరు: లూధియానా గార్మెంట్స్
ప్రాంతం: లూధియానా, పంజాబ్
ప్రారంభం: 1900
ప్రత్యేకత: నాణ్యమైన వస్ర్తాలు
ప్రభావం: 4 లక్షల మందిపై
కారణం: జీఎస్టీ, పెద్దనోట్ల రద్దు
వివరణ: దక్షిణ భారత్లో వస్త్ర పరిశ్రమ కు పేరుగాంచిన పుణె, సూరత్, ముంబై, భీవండీ, సోలాపూర్కు దీటుగా పంజాబ్లో ని లూధియానాలో గార్మెంట్స్ పరిశ్రమ ప్రసి ద్ధి చెందింది. విదేశాలకు కూడా ఇక్కడి వస్ర్తాలు ఎగుమతయ్యేవి. మోదీ సర్కారు వచ్చాక జీఎస్టీ, పెద్దనోట్ల రద్దు, ప్రభుత్వ ప్రోత్సాహ లోపంతో పరిశ్రమ దెబ్బతిన్నది. అనంతరం కరోనా సంక్షోభం వెరసి ఇక్కడి 40 శాతం కంపెనీలు మూతబడ్డాయి. ఐరో పా నుంచి వస్త్ర దిగుమతులను కేంద్రం సరళీకృతం చేయడంతో గడిచిన మూడేండ్లలో 60 వేల మంది ఉపాధి కోల్పోయారు.
దేశంలోని 90 శాతం గార్మెంట్ అవసరాలను లూధియానా తీర్చేది. ఏటా రూ. 20 వేల కోట్ల బిజినెస్ జరిగేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పెరిగిన ధరలు, ప్రభుత్వ సుంకాలు పరిశ్రమను కుదేలు చేస్తున్నాయి. పనులు లేక, వర్కర్లు తమ స్వస్థలాలకు వెళ్లిపోతున్నారు.
-మంగారామ్, గార్మెంట్ వ్యాపారి, లూధియానా, పంజాబ్
పరిశ్రమ పేరు: వస్త్ర పరిశ్రమ
ప్రాంతం: భీవండీ, మహారాష్ట్ర
ప్రారంభం: 1950
ప్రత్యేకత: నాణ్యమైన వస్ర్తాలు
ప్రభావం: లక్ష మందిపై
కారణం: జీఎస్టీ, ద్రవ్యోల్బణం, ప్రోత్సాహంలేమి ద్రవ్యోల్బణం కాటేసింది
మా తాత, నాన్న చిన్నప్పుడే ఇక్కడికి బతుకడానికి వచ్చారు. పదేండ్ల క్రితం వరకూ బాగానే ఉన్నది. విద్యుత్తు కోతలు, వస్ర్తాలపై జీఎస్టీ, ముడిసరుకు ధరలు పెరిగిపోవడంతో క్రమంగా పరిశ్రమలు మూతబడ్డాయి. ఇప్పటికే 40 శాతం మంది ఉపాధి కోల్పోయారు.
-మహమ్మద్ అన్సారీ, పవర్లూమ్ కార్మికుడు, భీవండీ, మహారాష్ట్ర
పరిశ్రమ పేరు: మంగళూరు టైల్స్
ప్రాంతం: మంగళూరు, కర్ణాటక
ప్రారంభం: 1865
ప్రత్యేకత: నాణ్యమైన టైల్స్
ప్రభావం: 3 వేల కుటుంబాలపై
కారణం: జీఎస్టీ దెబ్బ, ప్రోత్సాహం లేకపోవడం
వివరణ: 90వ దశకంలో గ్రామాలు, చిన్న పట్టణాలు అని తేడాలేకుండా ప్రతీ ఇంటి పైకప్పు నారింజ రంగుతో మెరిసిపోతూ ఎంతో చక్కగా, ఠీవిగా కనిపించేది. దీనికి కారణం.. కర్ణాటకలోని మంగళూరులో తయారైన గూనపెంకు లే (రూఫ్టాప్ టైల్స్). ఒకప్పుడు ఇండ్ల నిర్మాణాల్లో కీలకపాత్ర పోషించిన ఈ పెంకులు కాలగర్భంలో కలసిపోతున్నాయి. పాతికేండ్ల కిందట మంగళూరులో పెంకుల పరిశ్రమలు 40 ఉండేవి. ఇప్పుడు మూడంటే మూడే ఉన్నాయి. గతంలో పట్టణం చుట్టుపక్కల ఉన్న వరి పొలాల్లో బంక మట్టి పుష్కలంగా లభించేది. ఇతర పరిశ్రమల కోసం ప్రభుత్వాలు భూములు బలవంతంగా సేకరించటంతో సారవంతమైన పొలాలు కనుమరుగయ్యాయి. బంక మన్ను లభించక పెంకుల పరిశ్రమ మూత పడటంతో కార్మికులు ఇతర వృత్తులకు మళ్లారు. కరోనా సంక్షోభంతో కుదేలైన ఈ పరిశ్రమపై కేంద్రం విధించిన 5 శాతం జీఎస్టీ తీవ్ర ప్రభావం చూపింది. ఈ పరిశ్రమ పూర్తిగా మూతపడే పరిస్థితికి వచ్చింది.
గోవాలో పెంకుల పరిశ్రమను యాంత్రీకరించారు. అక్కడి ఒక్కో పెంకు రూ.50 ఉంటుంది. మేము ఒక్కో పెంకును రూ.25కే విక్రయిస్తున్నాం. నష్టాలు వస్తున్నా మరొక జీవనాధారం లేకపోవడంతో ఇలా చేస్తున్నాం. ప్రభుత్వం రాయితీలు ఇచ్చి, జీఎస్టీ ఎత్తేయాలి.
– అయాన్ లోబో, పెంకుల తయారీదారు, మంగళూరు, కర్ణాటక
ఇడుక్కి బెల్లం, ఫ్రూట్ ప్రాసెసింగ్ యూనిట్లు (కేరళ), దిండిగల్ తాళాల పరిశ్రమ (తమిళనాడు), గువాహటి ఆయిల్ రిఫైనరీలు (అస్సాం), భటాపురా అటుకుల కంపెనీలు (ఛత్తీస్గఢ్), పానిపట్ టెక్స్టైల్స్ (హర్యానా), తుముకూరు కాటన్ వస్ర్తాలు (కర్ణాటక), ఇండోర్ టెక్స్టైల్స్ (మధ్యప్రదేశ్), కోర్దా-భువనేశ్వర్ టెక్స్టైల్ (ఒడిశా), హోషియార్పూర్ ట్రాక్టర్లు, ప్రెజర్ కుక్కర్లు (పంజాబ్), శాంతినికేతన్ హ్యాండీక్రాఫ్ట్స్ (బెంగాల్).