చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కొంత మంది విదేశీయులు కూడా ఓటు వేశారు. ఎయిర్పోర్ట్లో చెకింగ్ సందర్భంగా వారి చేతి వేలిపై ఉన్న ఎన్నికల సిరాను అధికారులు గుర్తించారు. విదేశీయుల వద్ద భారత ఓటరు కార్డులు ఉండటం చూసి షాక్ అయ్యారు. (Foreigners Arrested For Voting) గత నెలలో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో చాలా మంది విదేశీయులు అక్కడకు వచ్చి ఓటు వేసినట్లు తెలుస్తున్నది. వీరిలో ఎక్కువ మంది శ్రీలంకకు చెందిన వారు ఉన్నట్లు సమాచారం.
కాగా, మే 12న చెన్నై, మధురై విమానాశ్రయాల్లో తనిఖీ సందర్భంగా విదేశీయుల చేతి వేలిపై చెరగని ఎన్నికల సిరా గుర్తును చెకింగ్ అధికారులు గుర్తించారు. విదేశీ పాస్పోర్టులు కలిగిన వారి వద్ద భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) జారీ చేసిన భారత ఓటరు కార్డులు కూడా ఉన్నట్లు చెకింగ్లో బయటపడింది. ఈ నేపథ్యంలో పది మంది విదేశీయులను అరెస్ట్ చేశారు.
మరోవైపు అరెస్టైన విదేశీయుల్లో ఎక్కువ మది శ్రీలంక పౌరులేనని అధికారులు తెలిపారు. శ్రీలంక జాతీయులను రంజని (59), సర్ఫుద్దీన్ (68), నీలంతి (44), జయంతన్ (40), చార్లీ బాలచంద్రన్ (48), చక్రవర్తి లోకప్రియ (50), సునీత చక్రవర్తి (48)గా గుర్తించారు. యూకేకు చెందిన అయ్యదురై (53), ఇండోనేషియాకు చెందిన టిట్టిన్ మారియట్టి (47), కెనడాకు చెందిన జితేంద్రనాథ్ (38) కూడా అరెస్టైన వారిలో ఉన్నట్లు ఇమ్మిగ్రేషన్ అధికారి తెలిపారు. విదేశీయులైన వారు తమిళనాడు ఎన్నికల్లో ఓటు వేయడంపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
కాగా, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు నిర్వహించిన ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో సుమారు 74 లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగించారు. అలాగే సుమారు 27.5 లక్షల మంది కొత్త ఓటర్లను చేర్చారు.
అయితే ‘సర్’ ప్రక్రియ చేపట్టినప్పటికీ విదేశీ జాతీయులు ఓటర్ల జాబితాలో ఎలా కొనసాగారు? అన్నది అనుమానాలకు తావిస్తున్నది. ‘సర్’ ప్రక్రియ, ధృవీకరణ యంత్రాంగాల్లో లోపాలు ఉన్నాయా? అన్న ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. తాజా సంఘటన తమిళనాడులో రాజకీయ, పాలనా వివాదానికి దారితీయవచ్చని తెలుస్తున్నది.
Also Read:
Congress Leader Dies Of Snakebite | ఉప ఎన్నిక పోటీలో ఉన్న కాంగ్రెస్ నేత.. పాము కాటుతో మృతి
Woman Kills Lover | భర్తతో కలిసి ప్రియుడ్ని హత్య చేసిన మహిళ.. మృతదేహాన్ని డ్రమ్లో కుక్కి పారవేత
Watch: భర్తపై పోక్సో కేసు.. విడుదల చేయాలంటూ టవర్ ఎక్కిన యువతి, తర్వాత ఏం జరిగిందంటే?