నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూన్ 6 రాష్ట్రం పారిశ్రామిక రంగంలో దూసుకెళ్తున్నది. దేశీయ, విదేశీ పరిశ్రమలకు అడ్డగా మారింది. ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారక రామారావు చొరవతో తొమ్మిదేండ్లలో రాష్ర్టానికి 23 వేల కొత్త పరిశ్రమలు వచ్చాయి. వాటి ద్వారా 17 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయి. మన ఐటీ రంగం దేశానికే దిక్సూచిగా మారింది. టీఎస్ ఐపాస్తో 21 రోజుల్లోనే అనుమతులు వస్తుండటంతో అంతర్జాతీయ సంస్థలు సైతం రాష్ర్టానికి క్యూ కడుతున్నాయి.
దేశంలో ఎక్కడా లేని విధంగా అన్ని రంగాలకు 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్తు సరఫరా కావడం పారిశ్రామిక ప్రగతి పరుగులకు దోహద పడుతున్నది. కరోనా వ్యాక్సిన్ను ప్రపంచ దేశాలకు 35 శాతం అందించిన ఘనత కూడా మన రాష్ర్టానికే దక్కింది. 2014లో రాష్ట్రం నుంచి ఐటీ ఎగుమతి రూ.57 వేల కోట్లు ఉంటే, నేడు రూ.2.44 లక్షల కోట్లకు పెరిగింది. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది వేడుకలు జరుపుకుంటున్న తరుణంలో మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా పారిశ్రామిక ప్రగతి ఉత్సవాలు నిర్వహించారు. ్ల మంత్రులు, ప్రజాప్రతినిధులు, నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
తెలంగాణలో పరిశ్రమలు, ఐటీ కంపెనీల స్థాపనలో మంత్రి కేటీఆర్ చేస్తున్న కృషి వెలకట్టలేనిదని రోడ్డు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి చెప్పారు. దేశానికి పరిశ్రమలు తేవడానికి ప్రధాని మోదీ కంటే కేటీఆరే ఎక్కువగా శ్రమిస్తున్నారని అన్నారు. నిజామాబాద్ సమీకృత కలెక్టరేట్లో నిర్వహించిన పారిశ్రామిక ఉత్సవంలో మంత్రి వేముల మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ పడుతున్న శ్రమలో ప్రధాని మోదీ సగం శ్రమించినా దేశ జీడీపీ కనీసం 4 శాతం ఎగబాకేదని అన్నారు. రాష్ట్ర ఐటీ రంగం లో ఒకప్పుడు 3 లక్షల మందికి ఉపాధి ఉంటే, 2023 నాటికి ఆ సంఖ్య 9 లక్షలకు చేరిందని చెప్పారు. ప్రపంచంలోనే టాప్ 5 ఐటీ కంపెనీలు.. వారి మొదటి ఆఫీస్ వాళ్ల దేశంలో ఉంటే రెండో ఆఫీస్ మన హైదరాబాద్లో పెట్టడానికి కేటీఆరే కారణమని అన్నారు. ఈ తొమ్మిదేండ్లలో రూ.3 లక్షల కోట్ల విలువతో 20 వేల కొత్త పరిశ్రమలు ఏర్పాటయ్యాయ ని, తద్వారా 18 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. ఐపాస్ లాంటి అద్భుతమైన చట్టాలను తీసుకొచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని కొనియాడారు.