Indrakaran Reddy | హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో ఆధ్యాత్మిక వైభవం ఉట్టిపడుతుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు. ఆధ్యాత్మిక చింతన కలిగిన సీఎం కేసీఆర్ ఈ ప్రాంత సాంప్రదాయాలకు, ఆలయాలకు, పండుగలకు, వేడుకలకు అత్యంత ప్రాధన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత మన పండుగలకు, వేడుకలకు ప్రపంచ ఖ్యాతి లభించిందన్నారు. స్వపరిపాలనలో తెలంగాణ స్వంత అస్థిత్వంతో కూడిన ఆధ్యాత్మిక శోభను సంతరించుకుందని మంత్రి తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో సుభిక్షంగా, సస్యశ్యామలంగా, సుఖసంతోషాలతో వర్ధిల్లుతుంది అని ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. అందుకు సీఎం కేసీఆర్ 9 ఏండ్ల పాలన సాక్షిగా నిలిచిందని కొనియాడారు. రాష్ట్రాన్ని అన్ని రంగాలతో పాటుగా ఆధ్యాత్మికంగా అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచనతో ఆలయాల అభివృద్ధికి కేసీఆర్ పూనుకున్నారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రణాళికాబద్ధంగా ఆలయాల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. శ్రీ లక్ష్మి నర్సింహుడు కొలువైన యాదాద్రి దేశంలోని గొప్ప పుణ్యక్షేత్రాలలో ఒక్కటిగా రూపుదిద్దుకోవడం మనందరికీ గర్వకారణం అని ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.
బుధవారం ఆధ్మాత్మిక దినోత్సవం సందర్భంగా దేవాదాయ శాఖ ప్రగతి నివేదిక వివరాలను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడించారు.
దేశంలోనే అత్యంత పురాతన పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా పేరొందిన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని దాదాపు రూ.1,200 కోట్ల వ్యయంతో పునర్నిర్మించడం జరిగిందని తెలిపారు. దక్షిణ కాశీగా వెలుగొందుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ అభివృద్ధి పనుల కోసం వీటీడీఏ 35 ఎకరాల భూమిని సేకరించింది. ఇప్పటి వరకు వేములవాడ ఆలయ అభివృద్ధి విస్తరణకు రూ. 70 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. కొండగట్టు అంజనేయ స్వామివారి ఆలయ అభివృద్ధిపై సీయం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆలయ అభివృద్ధికి రూ. 500 కోట్లు ప్రకటించారని గుర్తు చేశారు.
రూ. 50 కోట్లతో బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవాలయం, రూ. 100 కోట్లతో ధర్మపురి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం, రూ.25 కోట్లతో కాళేశ్వర శ్రీ ముక్తేశ్వర స్వామి దేవాలయాలను ప్రత్యేక అభివృద్ధి నిధుల ద్వారా అభివృద్ధి చేసుకుంటున్నాం. వీటితో పాటు మరో 8 ఆలయాలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.