శ్రీశైలం : ఎగువ నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతున్నది. జూరాల ప్రాజెక్టు గేట్ల ద్వారా 1,25,116 క్యూసెక్కులు.. విద్యుత్ ఉత్పత్తి ద్వారా మరో 30,285 క్యూసెక్కులు విడుదల చేశారు. అలాగే సుంకేశుల నుంచి 66,752 క్యూసెక్కులు, హంద్రీ నుంచి 117 క్యూసెక్కుల నీరు విడుదల చేయగా.. సాయంత్రం వరకు రిజర్వాయర్కు 4,01,187 క్యూసెక్కులు ఇన్ఫ్లో వస్తున్నది.
దీంతో తొమ్మిది గేట్లను ఎత్తివేసి, 2,49,786 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. కుడిగట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా 27,137 క్యూసెక్కులు.. ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 35,315 క్యూసెక్కుల వరద సాగర్కు వెళ్తున్నది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 884.30 అడుగుల మేర నిల్వ ఉన్నది. నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 211.47 టీఎంసీలు నిల్వ ఉన్నది.