మహబూబ్నగర్ : ప్రభుత్వ దవాఖానల పట్ల పేద ప్రజల్లో విశ్వాసం పెరిగిందునే నేనుపోత బిడ్డో సర్కారు దవాఖానకు అంటున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం ఆయన మహబూబ్ నగర్ ప్రభుత్వ జనరల్ దవాఖానలో తెలంగాణ డయాగ్నోస్టిక్ కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు.
ఈ డయాగ్నొస్టిక్ కేంద్రంలో హార్ట్, కిడ్నీ, బ్రెస్ట్ క్యాన్సర్, షుగర్, లిపిడ్ ప్రొఫైల్ వంటి అన్ని రకాల టెస్టులు నిర్వహిస్తారని తెలిపారు. నూతనంగా ఏర్పాటు చేసిన డయాగ్నొస్టిక్ కేంద్రం ద్వారా పరీక్షల ఫలితాలను ఎప్పటికప్పుడే ఇవ్వాలని, ఫలితాలను డిజిటలైజేషన్ చేయాలన్నారు. నమూనాల సేకరణ ఫలితాల విషయంలో ఎలాంటి తేడా లేకుండా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు ఫలితాలను తక్షణమే సంబంధిత రోగులకు వారి వాట్సాప్ కు పంపించే ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.
ఫలితాల వివరాలను కంప్యూటర్లలో నిక్షిప్తం చేయాలని, ఫలితాలను పర్యవేక్షించేందుకు ఒక విజిలెన్స్ బృందాన్ని ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. అంతేకాక తెలంగాణ డయాగ్నొస్టిక్ వాట్సాప్ ను కూడా ఏర్పాటు చేయాలని చెప్పారు.
మహబూబ్ నగర్ ప్రభుత్వ జనరల్ దవాఖానలో డాక్టర్లు , నర్సులు, సిబ్బంది సంఖ్య పెరిగిందని, 500 పడకలు, ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేశామన్నారు. ఇటీవల సుమారు140 మంది హౌస్ సర్జన్లు సేవలందిస్తున్నారని ఇకపై నిరంతరం 300 మంది డాక్టర్లు దవాఖానలో సేవలు అందించే అవకాశం ఉందన్నారు.
మహబూబ్ నగర్ జిల్లా ను అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సీఎం కేసీఆర్ పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పై వారంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారని, టెండర్లను పిలిచి కాలువల నిర్మాణం చేపట్టి కాలువల ద్వారా చేరువులన్ని నింపుతామని మంత్రి వెల్లడించారు.
కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, కలెక్టర్ వెంకట్రావు, జిల్లా ఎస్సీ ఆర్. వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్మన్ కె.సి. నర్సింహులు, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ పర్యవేక్షకుడు డాక్టర్ రాంకిషన్, మెడికల్ కళాశాల డైరెక్టర్ పుట్టా శ్రీనివాస్, డీఎంహెచ్ఓ డా. కృష్ణ, డిప్యూటీ డీఎంహెచ్ ఓ డాక్టర్ శశికాంత్, ఆర్ఎంవో డాక్టర్ జీవన్, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్ తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
అందరికి హెల్త్ ప్రొఫైల్.. అదే సీఎం కేసీఆర్ లక్ష్యం
ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం
ప్రభుత్వ వైద్య రంగంలో మరో మందడుగు : మంత్రి పువ్వాడ
తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్ను ప్రారంభించిన మంత్రి సబితా రెడ్డి
రేపు ఆకాశంలో ఆవిష్కృతమవనున్న అద్భుతం
వైద్య ఆరోగ్య శాఖ మరింత బలోపేతం : మంత్రి నిరంజన్ రెడ్డి