పాలమూరు.. ఒకప్పుడు కరువుసీమ. వలసల జిల్లా. ఉపాధి కరువై, పొట్టకూటి కోసం బతుకుజీవుడా.. అంటూ రైళ్లల్లో, బస్సుల్లో సుదూర మహానగరాలకు వలసవెళ్లే పేదలే గుర్తొచ్చేవారు. ఊళ్లకు ఊళ్లు తాళాలు పడిన ఇండ్లే కనిపించేవి. గుక్కెడు నీటి కోసం గోసపడి కోసుల దూరం నడిచే మహిళలు తారసపడేవాళ్లు. నడిచినంత మేర నెర్రెలిచ్చిన నేలే కాలికి తగిలేది. ఆత్మహత్యలు, ఆకలిచావులు నిత్యకృత్యం. గంజి కేంద్రాలతో పొట్టపోసుకున్న కుటుంబాలకు కొదువేలేదు. ఇదంతా 8 ఏండ్లకు ముందు..
పాలమూరు.. ఇప్పుడు ప్రగతి సీమ. పాత యాతనను పాతరేసుకుని పరుగులు తీస్తున్న జిల్లా. ప్రాజెక్టులు పూర్తికావడంతో ఎటుచూసినా సాగునీటి గలగలలు వినిపిస్తున్నాయి. పంటచేలల్లో బంగారం పండుతున్నది. రైతు మోములో నవ్వు కనిపిస్తున్నది. తాగునీరు ఇంటింటికీ అందుతున్నది. పరిశ్రమలు తరలివస్తున్నాయి. దాని వెంటే వలస కుటుంబాలు వెనక్కి తిరిగొచ్చేశాయి. పాలమూరు గడ్డమీద ఎంపీగా ఉండి, తెలంగాణ ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్.. ముఖ్యమంత్రి అయ్యాక వలస జిల్లా అనే పేరును తుడిచిపెట్టుకుపోయేలా చేశారు. కేసీఆర్ సర్కారు అందిస్తున్న చేయూతతో ఉమ్మడి జిల్లా రూపురేఖలు మారిపోయాయి.
మహబూబ్నగర్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ ఏర్పడ్డాక.. పాలన మారాక.. పాలమూరు నుదుటిరాత మారింది. వలస వెళ్లే కూలీల జాడ కనిపించడం లేదు. మహబూబ్నగర్ జిల్లాపై ప్రత్యేకంగా దృష్టిపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్.. సాగునీటితోనే ఈ ప్రాంత రూపురేఖలు మార్చవచ్చని బలంగా విశ్వసించారు. అందుకే పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేశారు. కొత్త ప్రాజెక్టులు నిర్మించారు. ఎత్తిపోతలతో రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. దీంతో సాగు, తాగునీటికి ఢోకా లేకుండాపోయింది. నెర్రెలుపడిన నేలలు.. సాగునీటి రాకతో పచ్చబడ్డాయి. వాన చినుకుకోసం ఆకాశం కేసి చూసే రైతులు కానరావడంలేదు. కిలోమీటర్ల దూరం బిందెలు పట్టుకుని నడిచివెళ్లే ఆడపడుచులు కనిపించట్లేదు. మిషన్ భగీరథతో ఇంటింటికీ శుద్ధజలం సరఫరా అవుతున్నది. 70 ఏండ్లలో సాధించలేని అభివృద్ధిని కేవలం 8 ఏండ్లలో కండ్లముందు కనబడేలా చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. దేశంలోనే వలసల జిల్లాగా పేరుగాంచిన పాలమూరు బతుకుచిత్రం దీంతో పూర్తిగా మారిపోయింది. వలసలు వెళ్లిన వారు సొంతూళ్లకు తిరిగివస్తున్నారు. ఉన్న ఊరిలోనే ఉపాధి లభిస్తున్నది. వలసలు ఆగిపోయి ఇతర రాష్ర్టాల నుంచి ఇక్కడికి వలసలు వచ్చే వారి సంఖ్య పెరిగింది. కొత్త జిల్లాల ఏర్పాటుతో సుపరిపాలన ప్రజలకు మరింత చేరువైంది.
ఉమ్మడి జిల్లాలో పండుగలా వ్యవసాయం
ఆకలిచావులతో ఒకప్పుడు వార్తల్లో నిలిచిన జిల్లా ఇప్పుడు ధాన్యాగారంగా మారుతున్నది. అదీ పరివర్తన. పాలన తెచ్చిన ప్రగతి. స్వరాష్ట్రం వచ్చాక రైతులకు ప్రభుత్వం ఇస్తున్న ఉచిత విద్యుత్తు, రైతుబంధు పథకంతో ఉమ్మడి జిల్లాలో సాగుబడి పండుగలా మారింది. రికార్డు స్థాయిలో రైతులు పంటలు పండిస్తున్నారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడంతో ఉమ్మడి జిల్లాలో నాలుగేండ్లుగా 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నది. రెండేండ్లుగా సాగువిస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ఈ ఏడాదైతే ఏకంగా 16 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు పండించారు. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు పడటంతో ప్రాజెక్టులు, జలశయాలు నిండుకుండలను తలపిస్తున్నాయి. చెరువులు, కుంటల వద్ద జలసిరులు పొంగిపొర్లుతున్నాయి.
4 మెడికల్ కాలేజీలు
పాలమూరు జిల్లాను విభజించాక ఏర్పడిన ఐదు కొత్త జిల్లాల్లో నాలుగు జిల్లాలకు మెడికల్ కళాశాలను ప్రభుత్వం మంజూరు చేసింది. నాలుగేండ్ల కిందట మహబూబ్నగర్కు మంజూరైన మెడికల్ కాలేజీ ఒక్కటే ఉండేది. కొత్తగా వనపర్తి, నాగర్కర్నూల్, నారాయణపేటకు వైద్యకళాశాలలను కేటాయించారు. వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాల్లో ఇటీవలే సీఎం కేసీఆర్ ఆన్లైన్లో తరగతులను ప్రారంభించారు. నారాయణపేట జిల్లా కేంద్రానికి మంజూరైన మెడికల్ కాలేజీ పనులు ప్రారంభదశలో ఉన్నాయి. అలాగే గద్వాల, మహబూబ్నగర్, వనపర్తి జిల్లాలకు ప్రభుత్వం నర్సింగ్ కాలేజీలను మంజూరు చేసింది. అన్నిచోట్ల క్లాసులు నడుస్తున్నాయి. బీసీ, ఎస్సీ, మైనార్టీ గురుకుల పాఠశాలలు, కళాశాలలతో కార్పొరేట్ స్థాయి రెసిడెన్షియల్ విద్య గ్రామీణ ప్రాంతాలకు చేరువైంది.
వేల కోట్ల నిధులు.. వేగంగా పనులు
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రూ.వేల కోట్లతో అభివృద్ధి పనులు సాగుతున్నాయి. రహదారుల విస్తరణ, ఫ్లైఓవర్లు, మినీట్యాంక్ బండ్ నిర్మాణాలతో పట్టణాలు కళకళలాడుతున్నాయి. హరితహారంతో రహదారుల వెంబడి పచ్చదనం పర్చుకున్నది. పల్లెప్రగతితో గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మారిపోయాయి. మౌలికవసతులు సమకూరాయి. ప్రతి జిల్లాకూ సమీకృత కలెక్టరేట్ సముదాయాన్ని మంజూరు చేశారు. వనపర్తిలో నూతన కలెక్టరేట్ను ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. మహబూబ్నగర్లో కలెక్టరేట్ పూర్తికాగా, జోగుళాంబ గద్వాల, నాగర్కర్నూల్ జిల్లాల్లో పనులు తుదిదశకు చేరాయి. నారాయణపేట జిల్లాలో కలెక్టరేట్ పనులకు త్వరలో సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు.
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని అప్పన్నపల్లి రైల్వే క్రాసింగ్ వద్ద బారులు తీరిన వాహనాలు (ఫైల్)
తెలంగాణ ఏర్పడిన తర్వాత ఫైఓవర్ ఏర్పాటు చేయడంతో అప్పన్నపల్లి రైల్వే క్రాసింగ్ వద్ద తీరిన ట్రాఫిక్ కష్టాలు