హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): ఆదాయ పన్ను శాఖ శాసనసభ ఎన్నికల విధుల్లో భాగస్వామ్యానికి సిద్ధమైంది. ఎన్నికల నిర్వహణలో ముఖ్యమైన శాఖల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ఆదాయ పన్ను శాఖ జిల్లాల వారీగా నోడల్ ఆఫీసర్లను నియమించింది. ఈ మేరకు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. నోడల్ అధికారి పరిధిలో కనీసం ముగ్గురు నుంచి ఆరుగురిని నియమించారు. వీరందరు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నాటినుంచి ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యేవరకు కేటాయించిన జిల్లాల్లో ఉండాలని పేర్కొంటూ ఆదాయ పన్ను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విభాగాల కమిషనర్ రవికిరణ్ ఆదేశాలు జారీ చేశారు.
ఎన్నికల విధులు కేటాయించిన అధికారులు ఇప్పటికే సెలవుల్లో ఉండి ఉంటే సెలవు రద్దు చేస్తున్నామని ఆయన ప్రకటించారు. వైద్య, ఇతర అత్యవసర సెలవులు కావాలంటే నోడల్ అధికారికి దరఖాస్తు చేసుకోవాలని, వారు నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. ఎన్నికల విధుల్లో నియమితులైన వారిని ఐటీశాఖ పరిశోధన విభాగానికి డిప్యూటేషన్పై వెళ్లినట్టు పరిగణిస్తామని తెలిపారు. ఎన్నికల విధుల్లో నియమితులైనవారు జిల్లా ఎన్నికల యంత్రాంగం ఏర్పాటు చేసే శిక్షణలు, సమీక్షా సమావేశాలకు హాజరుకావాలని సూచించారు. ఎన్నికల విధులకు నియమితులైనవారు తమ బంధువులు, కుటుంబసభ్యులు ఎన్నికల్లో పోటీ చేస్తే జిల్లా ఆదాయ పన్ను శాఖ సూపర్వైజింగ్ అధికారులకు వెంటనే సమాచారం అందించాలని ఆదేశించారు.