హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో అనేక ప్రైవేట్ భూములు అధికారుల పొరపాటుతో నిషేధిత జాబితాలోకి వెళ్లినయ్. వాటికి సంబంధించి ఇప్పటికే 757 వరకు దరఖాస్తులు వచ్చినయ్. ఇంకా బాధితులు ఉంటే 18005994788 టోల్ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయొచ్చు.
హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): నిషేధిత భూముల జాబితా రూపొందించడంలో తప్పు జరిగినట్టు రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అంగీకరించారు. ఈ తప్పుతో ఇబ్బందులు పడుతున్న ప్రజలను మంత్రి క్షమాపణ కోరారు. సోమవారం సచివాలయంలో 22-ఏ నిషేధిత జాబితాపై అధికారులతో సమీక్ష అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తమ పట్టా, ప్రైవేట్ భూములు నిషేధిత జాబితాలో చేరాయని, రిజిస్ట్రేషన్లు జరుగడం లేదని చాలా మంది తనకు చెప్తున్నట్టు తెలిపారు. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల పరిధిలో ఎక్కువగా ఉన్నదని, అధికారుల తప్పిదం కారణంగా ఈ సమస్య ఏర్పడిందని వివరించారు. ప్రైవేట్ భూములు సైతం నిషేధిత జాబితాలో చేరాయని పేర్కొన్నారు. 2025 డిసెంబర్లో హైకోర్టుకు తమ అధికారులు నిషేధిత భూముల జాబితాను అందించారని, గతజీవోలు, ఉత్తర్వులను పట్టించుకోకుండా, నిషేధిత జాబితాను రూపొందించారని తెలిపారు. పాత జీవోలను వెబ్సైట్లో పెట్టకపోవడంతో ఆ భూములన్నీ ప్రభుత్వ భూములుగా చూపుతున్నట్టు తెలిపారు. ఇది ముమ్మాటికీ తప్పేనని అంగీకరించారు. ఈ తప్పును సవరిస్తున్నామని, వాటికి సంబంధించిన ఉత్తర్వులను అప్లోడ్ చేస్తున్నామని వివరించారు. కొద్ది రోజుల్లోనే సమస్యను పరిష్కరించి మళ్లీ రిజిస్ట్రేషన్లు అయ్యేలా చేస్తామని తెలిపారు.
ఇప్పటి వరకు 757 దరఖాస్తులు
ఇప్పటి వరకు నాలుగు జిల్లాల నుంచి 757 దరఖాస్తులు వచ్చినట్టు మంత్రి తెలిపారు. మేడ్చల్ జిల్లాలో నిషేధిత జాబితాలో పెట్టిన వాటిలో ఎక్కువగా యూఎల్సీ భూములు ఉన్నాయని చెప్పారు. ఈ భూములను గతంలోనే క్లియర్ చేశారని, ఇవన్నీ న్యాయబద్ధంగా ఉన్నాయని తెలిపారు. కానీ తమ అధికారులు యూఎల్సీ ల్యాండ్ అంటే ప్రభుత్వ భూమి అని పేర్కొని నమోదు చేశారని, తద్వారా ఈ పరిస్థితి ఏర్పడిందని వివరించారు. ఇక జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ ద్వారా విక్రయించిన ప్లాట్లను ఆన్లైన్లో ఎంట్రీ చేయలేదని, అందుకే ప్రొహిబిటెడ్ జాబితాలో చూపిస్తున్నాయని, వీటన్నింటిని పరిష్కరిస్తామని తెలిపారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తొందర్లోనే నిషేధిత జాబితా నుంచి తొలగిస్తామని హామీ ఇచ్చారు. ఇందుకు మంత్రి ఉదాహరణ కూడా చెప్పారు.. రంగారెడ్డి జిల్లాలో 12 ఎకరాల భూమిలో 2 ఎకరాలు భూదాన్ భూమి ఉండగా ఈ 2 ఎకరాలు జాబితాలో పెట్టాల్సింది పోయి మొత్తం భూమిని పెట్టారని తెలిపారు.
ఇలాంటివి చాలా కేసులు ఉన్నాయని, ఫారెస్ట్, ఎండోమెంట్ జాబితాలోనూ చాలా కేసులు ఉన్నాయని చెప్పారు. సీఎస్-7, సీఎస్-14 కు సంబంధించి ఏండ్లుగా కోర్టు కేసులు ఉన్నాయని, వీటన్నింటినీ కండీషనల్గా రిజిస్ట్రేషన్లు చేస్తామని వివరించారు. కానీ వీటిలో కొన్ని పార్సిళ్లకు జీవోల ద్వారా క్లియర్ చేస్తూ వచ్చారని, ఈ జీవోలు, మెమోలు అప్లోడ్ చేయని కారణంగా 35-38 వేల పార్సిల్స్ నిషేధిత జాబితాలోకి వచ్చాయని తెలిపారు. అల్విన్, ఆస్బెస్టాస్ కాలనీల్లో ప్రభుత్వ, ప్రైవేట్ స్థలాలు ఒకే సర్వే నంబర్లో ఉండటంతో ప్రైవేట్ స్థలాలు కూడా నిషేధిత జాబితాలోకి వెళ్లాయని, వీటిని రెండు రోజుల్లో తొలగిస్తారని చెప్పారు. నారపల్లి 867 సర్వే నంబర్లో 20 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నదని, ఇది కాకుండా మిగతా భూమిని జాబితా నుంచి తొలగిస్తామని వెల్లడించారు. ఎలాంటి సమస్యలేని భూములను రిజిస్ట్రేషన్ చేయాలని, ఏదో బూచి చూపించి ప్రజలను ఆఫీసులచుట్టూ తిప్పితే అలాంటి అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కేసులపై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసి అన్నిటినీఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని చెప్పా రు. ఫిర్యాదుల కోసం 18005994788 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి వివరాలు చెప్పాలని సూచించారు.
సీఎం ఇల్లూ నిషేధిత జాబితాలోనే
స్వయంగా సీఎం రేవంత్రెడ్డి ఇల్లు కూడా నిషేధిత జాబితాలో చేరినట్టు మంత్రి పొంగులేటి అంగీకరించారు. దీన్ని కూడా కప్పిపుచ్చుకునే ప్రయత్నంచేశారు. జూబ్లీహిల్స్ సొసైటీకి సంబంధించిన 356 ప్లాట్లు అంతకు ముందు సొసైటీ పేరుపై కాకుండా ప్రభుత్వ ఖాతాలో ఉండేవని తెలిపారు. ఆ తర్వాత సొసైటీకి కేటాయించినట్టు ఉన్న ఉత్తర్వులను అప్లోడ్ చేయని కారణంగా ఆ ప్లాట్లు కూడా నిషేధిత జాబితాలోకి చేరాయని చెప్పారు. ముఖ్యమంత్రి ఇల్లు నిషేధిత జాబితాలో ఉంటే దాన్ని తాను పెట్టించినట్టా? అని ప్రశ్నించడం గమనార్హం. ఇలా స్వయంగా సీఎం రేవంత్రెడ్డి ఇల్లే నిషేధిత జాబితాలో చేరితే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటనే చర్చ జరుగుతున్నది.