శక్కర్నగర్/ఎడపల్లి, మే 24: పురాతన ఆలయాల అభివృద్ధితో పాటు నూతన ఆలయాల నిర్మాణం, ఆలయాల భూముల పరిరక్షణకు తెలంగాణ సర్కారు పటిష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతున్నదని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. బుధవారం నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో దేవాదాయశాఖ, గ్రామస్థుల భాగస్వామ్యం, దాతల సహకారంతో నిర్మించిన పురాతన హనుమాన్ మందిరాన్ని మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధి, జీర్ణోద్ధరణ కార్యక్రమాలు చేపడుతున్నదని, సీఎం కేసీఆర్ చొరవతో యాదాద్రితో పాటు పలు దేవాలయాల రూపురేఖలు మారుతున్నాయని చెప్పారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో పురాతన దేవాలయాలు గుర్తించి అన్ని ఆలయాలకు ఈ పథకం అమలు చేస్తామని పేర్కొన్నారు. ఆలయాల భూములను అన్యాక్రాంతం చేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.