హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): ఆదివాసీ గిరిజనుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. హైదరాబాద్ బంజారాహిల్స్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన ఆదివాసీ, బంజారా భవనాలను సీఎం కేసీఆర్ ఈ నెల 17న ప్రారంభించనున్నారని, ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని ఆదివాసీ గిరిజనులు లక్షలాదిగా తరలి రావాలని పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్లోని సంక్షేమభవన్లో మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో చిన్నారులు, స్త్రీలు, ఆదివాసీ గిరిజన జీవితాలను బాగుచేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. చిన్నారులు, మహిళల పౌష్టికాహారం కోసం ఆరోగ్యలక్ష్మి కార్యక్రమాన్ని చేపట్టిందని, ఇలాంటి పథకం దేశంలో ఎక్కడాలేదని తెలిపారు. గురుకులాలను తీర్చిదిద్ది గిరిజన బిడ్డలు ప్రపంచంతో పోటీపడేలా చేశారని వివరించారు. అంగన్వాడీల వేతనాల్లో కేంద్రం వాటా 20 శాతమేనని చెప్పారు.
పంచాయతీలకు కొత్త భవనాలు
గిరిజన తండాలు, ఆదివాసీగూడెలను గ్రామపంచాయతీలుగా చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని మంత్రి సత్యవతి తెలిపారు. కొత్త గ్రామపంచాయతీలకు సొంత భవనాల నిర్మాణం కోసం బడ్జెట్లో రూ.600 కోట్లు కేటాయించామని, ఒక్కో భవన నిర్మాణాకి రూ.25 లక్షల చొప్పున ఖర్చుచేయనున్నామన్నారు. త్వరలోనే కొత్త భవనాల నిర్మాణ అనుమతి పత్రాలు అందజేసే ఏర్పాట్లు సాగుతున్నాయని వివరించారు.
17న లక్షలాదిగా తరలిరండి
బంజారాహిల్స్లోని ఆదివాసీ, బం జారా భవనాల ప్రారంభోత్సవానికి ఆదివాసీ గిరిజనులు లక్షలాదిగా తరలిరావాలని మంత్రి సత్యవతి పిలుపునిచ్చారు. ఈ భవనాలను ప్రారంభించిన అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించే భారీ బహిరంగలో సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారని చెప్పారు. హరితప్లాజా నుంచి నెక్లెస్రోడ్ మీదుగా ఆదివాసీ, గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా భారీ సాంస్కృతిక ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు.సమావేశంలో ట్రైకార్ చైర్మన్ రామచంద్రునాయక్, జీసీసీ చైర్మన్ వాల్యానాయక్, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తూ, మహిళా, శిశు సంక్షేమశాఖ కార్యదర్శి దివ్యా దేవరాజన్ తదితరులు పాల్గొన్నారు.