Telangana | హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): రాబోయే ఐదు రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన ఓ మెస్తరు వానలు కురిసే అవకాశమున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాబోయే 48 గంటల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై, సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో తేలికపాటి నుంచి మోస్తరు లేదా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని బుధవారం వెల్లడించింది. జార్ఖండ్ నుంచి ఛత్తీస్గఢ్ మీదుగా తెలంగాణ వరకు ఉన్న ద్రోణి బుధవారం ఒడిశా వైపు కదిలిందని, తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి రాష్ట్రం వైపు గాలులు వీస్తున్నాయని, వీటి ప్రభావంతో వానలు పడుతాయని వివరించింది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు వచ్చే ఐదు రోజులు యెల్లో హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం వాతావరణం ఒక్కసారిగా చల్లపడినట్టు తెలిపింది.
గురువారం నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి-భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. శుక్ర, శని, ఆదివారాల్లో కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, యాదాద్రి-భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశమున్నట్టు వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు వివరించారు.