హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం తీసుకున్న ఒక్క నిర్ణయం ఆటో డ్రైవర్లకు శరాఘాతంగా మారితే, ఆర్థికసాయంపై ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోకపోవడం వారికి ప్రాణ సంకటంగా మారింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వారి జీవితాలను దారుణంగా దెబ్బతీసింది. బతుకుదెరవు లేక భవిష్యత్తు అగమ్యగోచరంగా మారడంతో మనస్తాపం చెంది ఇప్పటివరకు 21 మంది ఆటో డ్రైవర్లు ప్రాణాలు తీసుకున్నారు. అయినప్పటికీ కండ్లు తెరవకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనమని ఆటో యూనియన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వాస్తవానికి ఆటోవాలాలకు ఆదాయం తెచ్చిపెట్టేది మహిళలే. పురుషులతో పోలిస్తే ఆటోలను ఎక్కువగా ఆశ్రయించేది వారే. ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం కారణంగా వారు ఆటోలవైపు చూడడం మానేయడంతో ఆటో డ్రైవర్ల ఆదాయం గణనీయంగా పడిపోయింది. ఇది ముందే ఊహించిన ఆటో సంఘాలు ఉచిత ప్రయాణంపై ముందునుంచీ ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు వారి ఆందోళన నిజమైంది. ఒక్కసారిగా గిరాకీ తగ్గి, రోజువారీ జీవనం కష్టంగా మారింది. ఈ వేదన భరించలేని కొందరు ఆత్మహత్యలతో విలువైన ప్రాణాలను తీసుకుంటున్నారు. మరికొందరు గుండెపోటుతో మరణించారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 21 మంది ఆటోకార్మికులు ప్రాణాలు తీసుకోవడంతో వారి కుటుంబాలు రోడ్డునపడ్డాయి.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఆటో కార్మికులకు ఏటా రూ.12వేలు ఆర్థికసాయం అందిస్తామని ప్రకటించింది. ఇప్పుడెలాగూ బతుకుదెరువు పోవడంతో ఆ సాయమేదో పెంచి హామీ నిలబెట్టుకోవాలని ఆటోకార్మికులు రోడ్లపైకి వచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదు. చర్చలకు సిద్ధమంటూ ఉత్తుత్తి ప్రకటనలకే పరిమితమైంది. ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీల్లో మరో రెండింటిని అమలు చేస్తామని రెండు రోజుల క్రితం ప్రభుత్వం ప్రకటించినప్పటికీ అందులో ఆటో కార్మికులకు ఇచ్చిన హామీ ఊసులేదు. బడ్జెట్ తర్వాత అమలు చేస్తారని అనుకోవడానికీ లేదు. ఎందుకంటే అప్పటికి ఎన్నికల కోడ్ వచ్చేస్తుంది. అంటే మార్చి, ఏప్రిల్ నెలలు కూడా కోడ్లో కలిసిపోతాయి. ఆటో కార్మికులను ఇది మరింత ఆందోళనకు గురిచేస్తున్నది. రెండు నెలల్లోనే 21 మంది మరణించారని, మరో రెండుమూడు నెలలు ఆగితే మరెన్ని ప్రాణాలు పోతాయోనని భయపడుతున్నారు.