Telangana | కోటగిరి, ఏప్రిల్ 3: ‘తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సాబ్ బహుత్ అచ్చా కామ్ కర్హ్రే హై’ అని మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ముద్కేడ్ తాలూకా ఆళంది గ్రామంలోని యోవ్తి సంస్థాన్ పీఠాధిపతి సద్గురు నరేశ్ మహారాజ్ కితబిచ్చారు. సోమవారం నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం టాక్లీ గ్రామంలో శివాజీ విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న మహారాజ్ తెలంగాణలో అమలవుతున్న అభివృద్థి, సంక్షేమ పథకాలను చూసి ఫిదా అయ్యామని తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల గురించి మరాఠీ భాషలో స్పష్టంగా వివరించారు. మహారాష్ట్రలోని ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యలు, అభివృద్ధి గురించి పట్టించుకోరని వాపోయారు. అక్కడికి ఇక్కడికి భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉన్నదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.
దేశంలోని 24 రాష్ర్టాల్లో కాంగ్రెస్, బీజేపీల ప్రభుత్వాలు ఉన్నాయని, కానీ ఎక్కడా తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు లేవని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. టాక్లీలో రూ.కోటితో నిర్మించిన వంతెన, కల్వర్టులను స్పీకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ.. బీజేపీ పాలిత 20 రాష్ర్టాల్లో ప్రజలు నానా కష్ట్టాలు పడుతున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ హయంలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతూ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉన్నదని చెప్పారు. నిజాంసాగర్ ప్రాజెక్టులోకి కాళేశ్వరం జలాలను మళ్లించి సాగునీటిని అందిస్తామని, రైతులు రెండు పంటలు వేసుకోవచ్చని భరోసా కల్పించారు. టాక్లీలో బీఆర్ఎస్ రాష్ట్ర నేత పోచారం సురేందర్రెడ్డి సహకారంతో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని పోచారం శ్రీనివాసరెడ్డి, సద్గురు నరేశ్ మహరాజ్ ఆవిష్కరించారు.