నాగారం, జూన్ 4 : రెండో పంటను ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడుకోవాలంటే.. పంటల సాగును ముందుకు జరుపుకోవాలని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి సూచించారు. ఆదివారం ఆయన సూర్యాపేట జిల్లా నాగారం మండల కేంద్రంలోని తన వ్యవసాయ క్షేత్రంలో తండ్రి రామచంద్రారెడ్డి, కుమారుడు వేమన్రెడ్డితో కలిసి విత్తనాలు చల్లారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ రోహిణి కార్తె పూర్తయ్యేలోపు మొదటి పంట నాట్లు వేసుకోవాలని రైతులకు సూచించారు.
ఇదేమీ కొత్త పద్ధతి కాదని, గతంలో ఉన్నదేనని చెప్పారు. రెండో పంటపై ప్రకృతి వైపరీత్యాల ప్రభావం పడుతుండటంతో సీఎం కేసీఆర్ పాత పద్ధతిని పునరుద్ధరించారని పేర్కొన్నారు. ఈ విషయమై సీఎం కేసీఆర్ వ్యవసాయరంగ నిపుణులు, శాస్త్రవేత్తలు, రైతు సంఘం ప్రతినిధులతో చర్చించాకే ఈ నిర్ణయానికి వచ్చారని చెప్పారు. ఇప్పటికే కోదాడ, హుజూర్నగర్, మిర్యాలగూడ, నాగార్జునసాగర్ నియోజకవర్గాలతోపాటు నిజామాబాద్ జిల్లా జక్కల్లో ఇదే పద్ధతిలో నాట్లు పెడుతున్న విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్, కలెక్టర్ ఎస్ వెంకట్రావ్ పాల్గొన్నారు.