Kalyana Lakshmi | జనగామ, మే 4 (నమస్తే తెలంగాణ): తులం బంగారం వద్దు.. ఏమొద్దు.. కల్యాణలక్ష్మి కింద కేసీఆర్ ఇచ్చినట్టే లక్షా నూట పదహారు రూపాయలు ఇవ్వండి చాలు.. అని జనగామ జిల్లా కేంద్రానికి చెందిన ఓ నిరుపేద మహిళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వేడుకొంటున్నది. తన ఇంటికి జీరో కరెంటు బిల్లు రాలేదు. గతంలో రూ.300 నుంచి రూ.500 లోపు బిల్లు వచ్చేది. ఇప్పుడు దాదాపు రూ.900 వస్తున్నదని ఆ మహిళే వాపోయింది. రేవంత్రెడ్డి ప్రభుత్వ పాలనలో మాలాంటి పేదలు బతికి బట్టకట్టే పరిస్థితి లేదంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. కాంగ్రెస్ మార్పు ఇదేనా? ఈ సర్కారులో నిరుపేదల బతుకులకు గ్యారెంటీ లేదా? అంటూ ఆమెతోపాటు పలువురు స్థానికులు ప్రశ్నిస్తున్నారు. జనగామ జిల్లా కేంద్రంలోని సంజయ్నగర్ ప్రాంతానికి చెందిన మోతె బేబీ అనే మహిళ భర్త ఏడేండ్ల క్రితం చనిపోయారు. అప్పటి నుంచి కూలిపనులు చేసుకుంటూ బతుకుతున్నది.
నిరుడు ఆగస్టులో అప్పుచేసి తన కూతురు పెళ్లి చేసింది. కల్యాణలక్ష్మి ద్వారా రూ.లక్ష వస్తే చేసిన అప్పులో కొంత మేరకైనా తీరుతుందన్న ఆశతో ఆ పథకానికి దరఖాస్తు చేసుకున్నది. ఇంతలో ఎన్నికల కోడ్ రావడంతో ఆలస్యంగా జనవరి నెలలో కల్యాణలక్ష్మి చెకు వచ్చింది. దాన్ని డ్రా చేసుకునేందుకు బ్యాంకుకు వెళితే ఖాతాలో డబ్బులు లేవు. వారం తర్వాత రమ్మని అధికారులు తిప్పి పంపించారు. వారం తర్వాత పోతే మళ్లీ అదే సమాధానం చెప్పి పంపించారు. ఆ పేదింటి మహిళ పలుమార్లు బ్యాంకు చుట్టూ తిరిగినా లాభం లేకుండా పోయింది. ఏప్రిల్ 18న మళ్లీ బ్యాంకుకు వెళ్లగా చెక్కు రిజెక్ట్ అయ్యింది.
ఒక వారం ఆగి రమ్మని చెప్పారు. మళ్లీ 24న వెళితే చెకు మీద రిజెక్ట్ అయిందని స్టాంప్ వేసి పంపించారు. ఇదేమిటని అడిగిన బేబీని ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో నీచెకు రిజెక్ట్ అయ్యిందని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని బాధితురాలు వాపోయింది. ఒక వైపు పెళ్లి కోసం చేసిన అప్పులకు మిత్తి పెరుగుతుండటంతోపాటు ఆర్థికంగా ఎదురవుతున్న ఇబ్బందులను తట్టుకోలేని పరిస్థితితో ఏం చేయాలో తెలియడం లేదని ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఎన్నికల ముందు రేవంత్రెడ్డి చెప్పిన తులం బంగారం ఏమొద్దు.. కేసీఆర్ ఇచ్చినట్టు రూ.లక్షా 116 రూపాలన్న ఇవ్వండి.. అంటూ ఆమె ప్రభుత్వాన్ని వేడుకుంటున్నది. తన ఇంటికి జీరో బిల్లు వచ్చేలా చూడాలని కోరుతున్నది.