హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): గుజరాత్ సహా దేశవ్యాప్తంగా బీజేపీ పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుండటంతో ఆ పార్టీ నేతల్లో వణుకు, భయం మొదలైందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా అన్నారు. గుజరాత్ ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగాలను పరిశీలిస్తే వారిలో నెలకొన్న నిరాశ, భయాందోళనలు స్పష్టమవుతాయని పేర్కొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యాలయం మగ్దూం భవన్లో బుధవారం నిర్వహించిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
కేంద్రంలో బీజేపీకి మరోసారి అధికారమిస్తే దేశ వినాశనం తప్పదని హెచ్చరించారు. కనిష్ఠ ప్రభుత్వం, గరిష్ఠ పరిపాలన అందిస్తానని చెప్పిన మోదీ.. అందుకు భిన్నంగా నిరంకుశ విధానాలు అమలుచేస్తూ దేశాన్ని వినాశనం దిశగా తీసుకుపోతున్నారని మండిపడ్డారు. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని, లౌకిక వ్యవస్థను పరిరక్షించుకోవాలంటే బీజేపీని 2024 ఎన్నికల్లో తప్పక ఓడించాలని పిలుపునిచ్చారు.
బీజేపీని ఓడించేందుకు వామపక్ష, లౌకిక, ప్రజాతంత్ర పార్టీలు, ప్రాంతీయ పార్టీల ఐక్యతను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నదని రాజా చెప్పారు. తెలంగాణలో కూడా ఇదే రాజకీయ అవగాహనతో ముందుకు సాగుతామని తెలిపారు. జాతీయ పత్రికా దినోత్సవాన్ని పురసరించుకొని జర్నలిస్టులకు శుభాకాంక్షలు తెలియజేశారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యదర్శులు డాక్టర్ కే నారాయణ, సయ్యద్ అజీజ్ పాషా, కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.