Revanth Reddy | హైదరాబాద్, సెప్టెంబర్ 6(నమస్తే తెలంగాణ): టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఒంటెత్తు పోకడలకు కాంగ్రెస్ అధిష్ఠానం అడ్డుకట్ట వేసిందా? ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డితో రేవంత్కు చెక్ పెట్టే ప్లాన్ వేసిందా? అంటే అవుననే అంటున్నాయి గాంధీభవన్ వర్గాలు. ఇటీవల అధిష్ఠానం రేవంత్రెడ్డికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకపోవడం, ఉత్తమ్కుమార్రెడ్డికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుండటాన్ని ఆ పార్టీ నేతలు ఉదహరిస్తున్నారు. కాంగ్రెస్లో రేవంత్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఉత్తమ్ అనేకసార్లు రేవంత్రెడ్డిని బహిరంగంగానే విమర్శించారు. ఒక దశలో ఉత్తమ్ పార్టీ మారుతున్నట్టు ప్రచారం జరిగింది. దీని వెనక రేవంత్ హస్తం ఉన్నట్టు ఉత్తమ్ పరోక్షంగా ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్రెడ్డితో సమానంగా ఉత్తమ్కుమార్రెడ్డికి ప్రాధాన్యం ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఇటీవల ఏర్పాటు చేసిన రాష్ట్ర, జాతీయ స్థాయి ఎన్నికల కమిటీల్లో ఉత్తమ్కు అధిష్ఠానం చోటు కల్పించింది. పార్టీ జాతీయ ఎలక్షన్ కమిటీలో రాష్ట్రం నుంచి ఒక్క ఉత్తమ్కు మాత్రమే చోటు దక్కింది. కీలక కమిటీల్లో ఉత్తమ్కుమార్రెడ్డికి స్థానం కల్పించడం రేవంత్రెడ్డి ఏకపక్ష నిర్ణయాలకు చెక్ పెట్టేందుకేనని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
రేవంత్కు షాక్లపై షాక్లు
కాంగ్రెస్ అధిష్ఠానం రేవంత్రెడ్డికి వరుస షాక్లు ఇస్తున్నది. ఆయనకు గతంలో ఇచ్చినంత ప్రాధాన్యం ప్రస్తుతం ఇవ్వడంలేదన్న అభిప్రాయం బలంగా వినిపిస్తున్నది. కమిటీల్లోనూ, అభ్యర్థుల ఎంపికలోనూ రేవంత్ వర్గానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదని తెలుస్తున్నది. ఇటీవల ప్రకటించిన సీడబ్ల్యూసీ కమిటీలో రేవంత్రెడ్డి వర్గానికి చెందిన ఒక్కరికి కూడా చోటు కల్పించలేదు. ఇప్పుడు ప్రదేశ్ ఎన్నికల కమిటీ, స్క్రీనింగ్ కమిటీల్లో సైతం రేవంత్ వ్యతిరేక వర్గంగా పేరొందిన ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, భట్టి విక్రమార్క, జగ్గారెడ్డికి చోటు కల్పించడం చర్చనీయాంశంగా మారింది. ఇక పార్టీలో రేవంత్రెడ్డి ఆటలు సాగే పరిస్థితి లేదని, ఏదైనా అధిష్ఠానం నిర్ణయం మేరకే జరిగే అవకాశం ఉన్నదని పలువురు కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.