హైదరాబాద్ : నేడు సమాజంలో మహిళలు సేవలు అందించని రంగమే లేదని.. సమాజ పురోగతిలో మహిళ పాత్ర ప్రాధాన్యాన్ని సంతరించుకుందని మంత్రి హరీశ్రావు అన్నారు. శాసనసభలో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మహిళా సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించారు. మహిళల ఆరోగ్య సంరక్షణ కోసం ఆరోగ్య లక్ష్మి పథకాన్ని ప్రభుత్వం అమలు చేసిందన్నారు. పథకం ద్వారా గర్భిణులకు అంగన్వాడీల ద్వారా పౌష్టికాహారాన్ని అందిస్తుందని, 2014 వరకు 56శాతం అంగన్వాడీ కేంద్రాల్లో మాత్రం భోజనం అందించే వారని, నేడు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వందశాతం కేంద్రాల్లో పాలు, గుడ్లతో కూడిన సమతుల పౌష్టికాహారాన్ని అందిస్తుందన్నారు.
మాతాశిశు సంక్షేమానికి కేసీఆర్ కిట్ పథకాన్ని అమలులోకి తెచ్చిందని, ఈ పథకం సంపూర్ణంగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అమలు చేస్తున్నామన్నారు. మగ పిల్లలవాడికి జన్మనిచ్చిన తల్లికి రూ.12వేలు, ఆడపిల్లను జన్మనిచ్చిన తల్లికి రూ.13వేల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు చెప్పారు. అలాగే బాలింత, నవజాతకు ఉపయోగపడేలా 16 వస్తువులతో కూడిన ప్రత్యేక కిట్ను అందిస్తోందన్నారు. కేసీఆర్ కిట్ ద్వారా ప్రభుత్వ దవాఖానాల్లో 30.5శాతం నుంచి 56శాతానికి పెరిగిందన్నారు. ప్రభుత్వం 10.85లక్షల కిట్లకుపైగా పంపిణీ చేశామన్నారు.
రాష్ట్రంలోని ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, భద్రాచలం కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, వికారాబాద్, ములుగు, జోగులాంబగద్వాల, నాగర్కర్నూల్ జిల్లాలలోని గర్భిణులు, బాలింతల్లో రక్తహీనత సమస్య ఎక్కువగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించిందని, ఈ లోపాన్ని నివారించేందుకు కేసీఆర్ న్యూట్రిషియన్ కిట్ పేరుతో పోషకాహార కిట్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ కిట్ ద్వారా ఏటా లక్షా25వేల మంది మహిళలు ప్రయోజనం పొందనున్నారన్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో 7-12 సంవత్సరం వరకు చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా హెల్త్ అండ్ జెనిక్ కిట్లను పంపిణీ చేయనుందన్నారు.
పథకంతో రాష్ట్రవ్యాప్తంగా 7లక్షల మంది బాలికలకు ప్రయోజనం చేకూరనుందన్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత బతుకమ్మను రాష్ట్ర పండుగగ ప్రభుత్వం నిర్వహిస్తుందని, పండుగ సందర్భంగా ఆడబిడ్డలను గౌరవిస్తూ ప్రభుత్వం చీరెలను పంపిణీ చేస్తుందన్నారు. రంజాన్, క్రిస్మస్ సందర్భంగా మైనారిటీ మతాలకు చెందిన మహిళలకు చీరెలు కానుకగా అందజేస్తుందని, ఇటీవల అంగన్వాడీలకు పోచంపల్లి చీరెలను పంపిణీ చేసిందని, దీని ద్వారా నేత కార్మికులందరికీ పని దొరుకుతుందన్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత అంగన్వాడీ సమస్యలను సానుభూతితో అర్థం చేసుకొని.. కార్యకర్తలకు రూ.13,600, హెల్పర్లకు 7,800 వేతనం అందిస్తుందన్నారు.
గృహ హింసకు గురవుతున్న మహిళలకు న్యాయ సహాయం, వైద్య సహాయాన్ని అందించేందుకు మహిళా పోలీసుల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసిందని వివరించారు. చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడే వారిని శిక్షించేందుకు ప్రభుత్వం ఫోక్సో కోర్టులను ఏర్పాటు చేసిందని, ఈ కోర్టుల నిర్వహణ కోసం అవసరమైన నిధులు మంజూరు చేసిందని, బాలల అక్రమణ రవానాను అడ్డుకునేందుకు 33 జిల్లాల్లో ప్రత్యేక బాలరక్షక వాహనాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని వివరించారు.