పెబ్బేరు, డిసెంబర్ 28 : రోగనిరోధక శక్తి పెంచుకుంటే క్షయవ్యాధిని ఆరు నెలల్లో దూరం చేసుకోవచ్చని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సూచించారు. బుధవారం వనపర్తి జిల్లా పెబ్బేరులో రూ.50 లక్షలతో నిర్మించనున్న షాపింగ్ కాంప్లెక్స్ పనులకు మంత్రి భూమి పూజ చేశారు. అనంతరం పీహెచ్సీలో 42 మంది క్షయవ్యాధిగ్రస్థులకు ఆయన సొంత ఖర్చుతో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మాంసం తినడం మానేసి మాంసకృత్తులు ఉండే కందిపప్పు, గుడ్డు, ఆకు కూరలు బాగా తీసుకోవాలని సూచించారు. దీంతో శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని చెప్పారు. వ్యాధిగ్రస్థులు వైద్యుల సూచనలను పాటించాలని కోరారు. జిల్లాలో ఉన్న 385 మంది బాధితులకు తన సొంత డబ్బుతో ప్రతి నెలా నిత్యావసర సరుకులను అందజేస్తామని తెలిపారు.