హైదరాబాద్ : రైతు బీమా మాదిరిగా బాధిత గీత కార్మికుల కుటుంబాలకు తక్షణ సహాయం అందేలా అధికారులను రాష్ట్ర ఎక్సైజ్శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. రాష్ట్ర ఆబ్కారీశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్లోని తన కార్యాలయంలో ఆబ్కారీశాఖపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గీత కార్మికుల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా చేపడుతున్న కార్యక్రమాలపై మంత్రి అందుబాటులో ఉన్న గౌడ సామజిక శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, ఆబ్కారీ శాఖ అధికారులతో చర్చించారు.
సీఎం కేసీఆర్ గీత కార్మికులు ప్రమాదవశాత్తు మరణించిన, శాశ్వత అంగ వైకల్యం చెందిన వారికి అందించే ఎక్స్గ్రేషియా రూ. 2 లక్షల నుండి రూ. 5 లక్షల పెంచటం జరిగింది. పెంచిన ఎక్స్గ్రేషియాను రైతులకు అందిస్తున్న రైతు బీమా మాదిరిగా వెంటనే గీత కార్మికుల కుటుంబానికి అందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రమాదవశాత్తు గీత కార్మికులు చనిపోయిన, శాశ్వత అంగవైకల్యం చెందినా 24 గంటల వ్యవధిలో సమాచారం సేకరించి వారం రోజులలో విచారణ పూర్తి చేసి రాష్ట్ర ఆబ్కారీశాఖ కమిషనర్కు అందించాలని మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. చనిపోయినా, శాశ్వత అంగవైకల్యం పొందినా గీత కార్మికులకు చెల్లించే ఎక్స్గ్రేషియా బకాయిలను వెంటనే విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రంలో ఆబ్కారీశాఖ ఆధ్వర్యంలో ఎక్సైజ్ నర్సరీలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ నర్సరీలలో హైబ్రిడ్ తాటి, ఈత, ఖర్జుర, గిరక తాళ్ల చెట్లు (డాలర్ ట్రీ) మొక్కలను తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా పెంచాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఎక్సైజ్ నర్సరీల పనులు ఈ వర్షాకాలం లోనే ప్రారంభం కావాలని మంత్రి అధికారులను కోరారు. సొసైటీ సభ్యులకు, టీఎఫ్టీ లైసెన్సుదారులకు గుర్తింపు కార్డులను వెంటనే జారీచేయాలన్నారు. అనుమతి లేకుండా తాటి, ఈత చెట్లను అక్రమంగా నరికివేసే వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి, కఠిన శిక్షలు పడేలా ఆబ్కారీశాఖ అధికారులు కృషి చేయాలన్నారు.
అర్హులైన ప్రతి గీత కార్మికునికి ఎటువంటి అభ్యంతరాలు లేకుండా పెన్షన్లు అందేలా చూడాలన్నారు. గీత వృత్తికి సంబంధం లేని వారు గీత వృత్తితో భాగస్వామ్యం లేనివారు కాంట్రాక్టర్లుగా చెలామణి అవుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో తాటి, ఈత చెట్లకు నెంబర్లు వేసి వాటిని సంరక్షించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
ఈ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో రాష్ట్ర శాసన మండలి సభ్యులు బాలసాని లక్ష్మీనారాయణ, గంగాధర్ గౌడ్, ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, వివేక్, ఆబ్కారీశాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, ఆదనపు కమిషనర్ అజయ్ రావు, ఉన్నతాధికారులు ఖురేషి, చంద్రయ్య, రఘురామ్, గణేష్, ప్రదీప్ రావు తదితరులు పాల్గొన్నారు.