హైదరాబాద్: తెలంగాణలో ఆది, సోమవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదివారం ఉరుములు మెరుపులతో వర్షాలు పడవచ్చని వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరంలో ఉన్న ఆవర్తనం వాయవ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్నదని చెప్పారు.
ఇది సగటు సముద్రమట్టానికి 5.8 కి.మీ. ఎత్తు వరకు విస్తరించి ఎత్తుకు వెళ్లే కొందీ నైరుతి దిశగా వంపు తిరిగి ఉన్నదని చెప్పారు. ఈ ఆవర్తన ప్రభావంతో రాగల 24 గంటల్లో వాయవ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశమున్నదని పేర్కొన్నారు. దీనివల్ల రానున్న మూడురోజులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నదని తెలిపారు.