Telangana | వరంగల్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ ప్రభుత్వం ఇసుకపై పెట్టిన అనధికారిక నిబంధనలు కొందరికి లాభంగా మారితే, వినియోగదారులకు మాత్రం భారంగా మారుతున్నాయి. గత ప్రభుత్వం అనుమతినిచ్చిన ఇసుక రీచ్లలో తవ్వకాలు నిలిపివేయాలని, అనుమతి గడువు రెన్యువల్ చేయవద్దన్న ప్రభుత్వం ఆదేశాలతో దాదాపు అన్ని రీచ్లు మూతపడ్డాయి. తవ్వకాలు ఆగిపోవడంతో ఇప్పటికే క్వారీల్లో ఉన్న ఇసుక కోసం లారీల యజమానులు ఎగబడుతున్నారు. దీనిని సొమ్ముచేసుకునేందుకు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, తెలంగాణ స్టేట్ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు కలిసి దోపిడీకి పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
క్వారీల్లోని ఇసుక కోసం లారీల యజమానులు నిర్దేశించిన మొత్తానికి ఆన్లైన్లో డీడీలు తీసుకుంటారు. ఆ మేరకు క్వారీల వద్ద ఇసుక లోడ్ చేస్తారు. ప్రభుత్వం పెట్టిన తాజా నిబంధన కారణంగా డీడీలు తీసినా దోపిడీ తప్పడం లేదు. డీడీల మొత్తానికి అదనంగా రూ. 1000 నుంచి రూ. 3000 వేలు ఇస్తేనే క్వారీల్లో ఇసుక లోడ్ చేస్తున్నారు. కొత్తగా ఇసుక తవ్వకాలు లేకపోవడంతో చేసేది లేక లారీల యజమానులు అడిగిన మొత్తం చెల్లించుకుంటున్నారు. ఈ దందా కారణంగా మార్కెట్లో ఇసుక ధర సామాన్యులు మోయలేనంత భారంగా మారుతున్నది.
బంగారుబాతులా పల్గుల గుండ్రాత్పల్లి క్వారీ
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని పల్గుల గుండ్రాత్పల్లి క్వారీలో ఇసుక నాణ్యంగా ఉంటుంది. స్లాబ్లకు, గిలాబ్కు ఇక్కడి ఇసుకను వాడుతుంటారు. గత ఎండాకాలంలో రీచ్ల నుంచి తవ్వి సమీపంలోని క్వారీలో ఇసుక నిల్వ చేసి పెట్టారు. నాణ్యమైన ఈ ఇసుక ఇప్పుడు అధికారులు, కాంట్రాక్టర్లకు బంగారుబాతులా మారింది. రెండువారాల క్రితం ప్రతి రోజు ఇక్కడి నుంచి 350 లారీలు ఇసుకను రవాణా చేసేవి. ఇప్పుడు ఆ సంఖ్య 530కి పెరిగింది.
ఆ మేరకు అధికార పార్టీ నాయకులు, అక్కడి అధికారి జేబులు నింపుకొంటున్నారని లారీ యజమానులు ఆరోపిస్తున్నారు. పలుగుల 6, పలుగుల(గుండ్రాత్పల్లి), పలుగుల 5, పలుగుల 10, పలుగుల 7 (మద్దులపల్లి) క్వారీల నుంచి ఇసుక ఎక్కువగా రవాణా అవుతున్నది. సోమవారం పలుగుల గుండ్రాత్పల్లి క్వారీకి 130 లారీలు రాగా 4 వేల టన్నుల ఇసుక లోడ్ చేశారు.
పలుగుల 5 క్వారీకి వచ్చిన 90 లారీల్లో 3 వేల టన్నుల ఇసుక రవాణా అయింది. పలుగుల 6 క్వారీ నుంచి 70 లారీల్లో 2వేల టన్నుల ఇసుక రవాణా జరిగింది. పలుగుల 7(మద్దులపల్లి ) క్వారీకి 120 లారీలు రాగా, 3 వేల టన్నుల ఇసుకను లోడ్ చేశారు. పలుగుల 10 క్వారీకి వచ్చిన 120 లారీల్లో 3500 టన్నుల ఇసుక రవాణా అయింది.
హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, పెద్దపల్లి, ఇతర సమీప జిల్లా కేంద్రాలు, పట్టణాలకు ఇక్కడి నుంచి ఇసుక రవాణా పెద్ద ఎత్తున జరుగుతున్నది. కాళేశ్వరం నుంచి వచ్చే సాధారణ ఇసుక వరంగల్లో టన్నుకు రూ. 900 ఉండేది. ఇప్పుడు రూ.1400కు పెరిగింది. రూ.1000 ఉండే నాణ్యమైన ఇసుక ధర ఇప్పుడు రూ.1800 వరకు పలుకుతున్నది. కొందరు డిమాండ్ను బట్టి అధిక ధరలకు అమ్ముతున్నారు.