గాయపడ్డ వారి వద్ద గంజాయి లభ్యం
మందలించిన మంత్రి దయాకర్రావు
జనగామ, మే 4(నమస్తే తెలంగాణ): రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకులకు తక్షణ వైద్య సహాయం అందేలా పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు దగ్గరుండి పర్యవేక్షించారు. బుధవారం జనగామ జిల్లా పర్యటనలో భాగంగా జనగామ-సూర్యాపేట జాతీయ రహదారిపై ఎర్రబెల్లి ప్రయాణిస్తుండగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరు యువకులు గాయపడి రోడ్డు పక్కన పడి ఉండటాన్ని మంత్రి గమనించారు. వెంటనే కాన్వాయ్ ఆపి పోలీసులు, వైద్య సిబ్బందికి సమాచారం అందించి దగ్గరుండి సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను జిల్లా ప్రధాన దవాఖానకు పంపించారు. కాగా ప్రమాదానికి గురైన ద్విచక్ర వాహనం నుంచి జారిపడిన గంజాయి ప్యాకెట్ను గుర్తించి పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.
ఈ సంఘటనతో సంబంధం ఉన్న ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు అక్కడి నుంచి పారిపోయారు. తాను సహాయం చేసిన యువకుల వాహనంలో గంజాయి దొరకడంతో మంత్రి ఎర్రబెల్లి సదరు నిందితులను మందలించారు. యువత గంజాయి, గుట్కాకు బానిస కావొద్దని, అక్రమ మత్తు పదార్థాల రవాణా, అమ్మకాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పారు.