హైదరాబాద్/సంగారెడ్డి, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్ ప్రత్యేక అల్ట్రా హై పర్ఫామెన్స్ ఫైబర్ రీయిన్ఫోర్స్మెంట్ కాంక్రీట్ (యూహెచ్పీఎఫ్ఆర్సీ)ని అభివృద్ధి చేసింది. నిర్మాణ రంగంలో ఉపయోగించేందుకు అవసరమైన నూతన కాంక్రీట్ అభివృద్ధిపై ప్రొఫెసర్ సూర్య ప్రకాశ్ నేతృత్వంలో సివిల్ ఇంజినీరింగ్ బృందం, కండిషన్ అసెస్మెంట్ అండ్ స్ట్రెంథెనింగ్ ఆఫ్ కాంక్రీట్ స్ట్రక్చర్స్(సీఏఎస్టీసీవోఎన్) ల్యాబ్ బృందం పరిశోధనలు చేస్తున్నది. భిన్నమైన ప్రయోగాలతో సరికొత్తగా యూహెచ్పీఎఫ్ఆర్సీని అభివృద్ధి చేసింది. స్థానికంగా ఉపయోగించే సిమెంట్, ఫ్లైయాష్, సముద్రపు ఇసుక, మైక్రో సిలికా, ఉక్కు, ఫైబర్, పాలిప్రొపోలైన్ ఫైబర్స్, హైరేంజ్ వాటర్ రెడ్యూసింగ్ ఏజెంట్లను ఉపయోగించి ప్రత్యేకమైన కాంక్రీట్ మిక్స్ను రూపొందించింది. ఇది దృఢంగా ఉండటంతోపాటు మార్కెట్లో ఉన్న రెడీమిక్స్ కాంక్రీట్ కంటే రెండు రెట్ల తక్కువ ధరకు లభించే అవకాశం ఉన్నట్టు పరిశోధక బృందం తెలిపింది.
మరింత దృఢత్వం..
సిమెంట్, ఫైబర్స్ పరిమాణాన్ని తగ్గించడం, సరైన గ్రెడేషన్లో స్థానికంగా తక్కువ ధరలో లభించే కంకర వాడటం ద్వారా యుహెచ్పీఎఫ్ఆర్సీ ధర తగ్గనున్నది. బహిరంగ మార్కెట్లో లభ్యమయ్యే కాంక్రీట్ ధర కంటే ఇది రెండింతలు తక్కువకే లభిస్తుందని తయారీ బృందం చెప్తున్నది. స్టీల్, ఫైబర్ డోసేజ్ తక్కువ స్థాయిలో వెబ్ షేర్ రీయిన్ఫోర్స్మెంట్ రేషియోతో వంతెన గిర్డర్లు దృఢంగా ఉంటాయని తెలిపింది. ప్రొఫెసర్ సురియా ప్రకాశ్ బృందాన్ని ఐఐటీ డైరెక్టర్ బీఎస్ మూర్తి అభినందించారు. ఇలాంటి ఆవిష్కరణలు.. ఆర్థిక, సమర్థ మౌలిక సదుపాయాల పరంగా స్థానిక అభివృద్ధికి ప్రయోజనం చేకూర్చడమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మౌలిక సదుపాయాల రంగానికి దాని ప్రయోజనాన్ని చేకూరుస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రొఫెసర్ సూర్యప్రకాశ్ మాట్లాడుతూ.. స్థానికంగా లభించే ముడిపదార్థాలను ఉపయోగించి అల్ట్రా హై పర్ఫామెన్స్ కాంక్రీట్ను అభివృద్ధి చేయడం సంతోషంగా ఉన్నదన్నారు. ఈ కాంక్రీట్ ఉపయోగించడం ద్వారా నిర్మాణ రంగంపై ఆర్థికభారం తగ్గడంతోపాటు నిర్మాణాలు మరింత దృఢంగా ఉంటాయని తెలిపారు.