మేడ్చల్, జూన్ 12(నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని చూస్తుంటే జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్కు వణుకు పుడుతున్నదని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఆదివారం ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ.. దేశ రాజకీయాలను మార్చే సత్తా సీఎం కేసీఆర్కే ఉన్నదని దేశంలోని వివిధ పార్టీలు భావిస్తున్నాయన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయం కేసీఆర్తోనే సాధ్యమని తెలిపారు. దేశ రాజకీయాల్లో జోక్యం చేసుకోవాలని సీఎం కేసీఆర్ను వివిధ పార్టీలు ఆహ్వానిస్తున్నట్టు మంత్రి పేర్కొన్నారు.
ఇవన్నీ చూస్తున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ముచ్చెమటలు పడుతున్నాయని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఏర్పడిన 8 ఏండ్లలోనే రాష్ర్టాన్ని దేశంలోనే నంబర్వన్గా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతుబంధు, రైతుబీమా, నిరంతర నాణ్యమైన ఉచిత విద్యుత్తు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పింఛన్లను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని తెలిపారు. వచ్చే దసరా నుంచి కేసీఆర్ తీసుకొనే నిర్ణయాలు దేశానికే ఆదర్శంగా నిలువనున్నాయన్నారు. విజన్ ఉన్న ముఖ్యమంత్రిగా దేశ ప్రజలంతా కేసీఆర్ను గుర్తిస్తున్నట్టు మల్లారెడ్డి తెలిపారు. తెలంగాణ మాదిరిగానే ఇతర రాష్ర్టాల అభివృద్ధిని కేసీఆర్ ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.