TSPSC | హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ) : భవిష్యత్లో ఎవరైనా ప్రశ్నపత్రం లీకేజీకి పాల్పడితే ఇక అంతే సంగతులు. పదేండ్ల పాటు జైల్లో గడపాల్సిందే. ఉద్యోగం రాకుండా అనర్హత వేటుకు గురికావాల్సిందే. అంతేగాక భారీ జరిమానా, ఆస్తుల జప్తును ఎదుర్కోవాల్సిందే. ఈ దిశగా సమగ్ర చట్టం తీసుకువచ్చే ఆలోచనలో టీఎస్పీఎస్సీ ఉన్నది. ఈ మేరకు కమిషన్ సభ్యుల భేటీలో చర్చించారు. తప్పు చేయాలంటే భయపడేలా శిక్షలుండాలని కమిషన్ భావిస్తున్నది. పేపర్ లీకేజీని ప్రోత్సహించినా, సహకరించినా, లీకైన పేపర్తో పరీక్ష రాసినా అందరిపై కఠిన చర్యలు ఉండాలని భేటీలో చర్చ జరిగింది. కొన్ని రాష్ర్టాల్లో ప్రశ్నపత్రాల లీకేజీ కొత్తేమీ కాదు. ఇప్పటికే అనేకసార్లు జరగటంతో అక్కడ కొన్ని చట్టాలు చేశారు. ఏయే రాష్ట్రంలో ఎలాంటి చట్టాలు చేశారు? అంతకంటే ఉత్తమమైన చట్టాలు ఏం చేయవచ్చు? కొత్తగా ఏయే సంస్కరణలు తీసుకురావాలా? వంటి అనేక విషయాలపై భేటీలో లోతుగా చర్చించారు.
టీఎస్పీఎస్సీలో కంప్యూటర్ల హ్యాకింగ్, ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారాన్ని కమిషన్ సీరియస్గా తీసుకున్నది. ఒకవైపు సిట్ దర్యాప్తు కొనసాగుతుండగానే మరోవైపు దిద్దుబాటు చర్యలు చేపట్టింది. టీఎస్పీఎస్సీ కార్యాలయంలో అంతర్గతంగా విచారణ చేస్తున్నది. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై కమిషన్ దృష్టి సారించింది. ఇప్పటికే ఆ దిశగా ప్రక్షాళన ప్రారంభించింది. టీఎస్పీఎస్సీ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులను అంతర్గతంగా బదిలీ చేసింది. కీలక బాధ్యతల్లో ఉండే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచేందుకు చర్యలు చేపట్టింది. కంప్యూటర్ల హ్యాకింగ్ వల్ల ప్రశ్నపత్రాలు లీక్ అవటంతో డాటా రక్షణ వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించింది. సైబర్ సెక్యూరిటీ నిపుణుల సలహాలు, సూచనలు తీసుకుంటూ కంప్యూటర్లు, సర్వర్లు, ఫైర్వాల్ వంటి వాటిని మరింత పటిష్టం చేస్తున్నది. టీఎస్పీఎస్సీలో కీలకమైన బాధ్యతలు నిర్వహించే కొంతమంది ఉద్యోగులకు ప్రతి మూడు లేదా ఆరు నెలలకు ఒకసారి అంతర్గతంగానే స్థానచలనం చేయాలని కమిషన్ భావిస్తున్నది. టీఎస్పీఎస్సీలో పనిచేసే ఉద్యోగులకు సంబంధించి కొన్ని ప్రత్యేకమైన మార్పులు చేయాలని కమిషన్ ఆలోచిస్తున్నది. టీఎస్పీఎస్సీలో ఉండే వ్యక్తులు కమిషన్ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలకు పరీక్షలు రాయాలంటే.. ఏం చేయాలి? ముందుస్తుగానే సెలవు పెట్టాలా? లేదంటే అసలు టీఎస్పీఎస్సీలో పనిచేసే వాళ్లకు అవకాశం కల్పించకూడదా? వంటి అనేక విషయాలపై కమిషన్ కసరత్తు చేస్తున్నది.
టీఎస్పీఎస్సీ ఇప్పటికే ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. దేశంలోనే అనేక కమిషన్లు టీఎస్పీఎస్సీని ఆదర్శంగా తీసుకుని పనిచేస్తున్నాయి. ప్రస్తుతం మరో సంస్కరణ జరిగితే బాగుంటుందని టీఎస్పీఎస్సీ భావిస్తున్నది. భవిష్యత్తులో కంప్యూటర్ల హ్యాకింగ్, ప్రశ్నపత్రాల లీకేజీ వంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే కఠిమైన నిర్ణయాలు అవసరమని కమిషన్ అనుకుంటున్నది. ప్రశ్నపత్రాల లీకేజీకి పాల్పడాలంటేనే భయపడే పరిస్థితిని తీసుకురావాలని యోచిస్తున్నది. భవిష్యత్తులో ఏ చిన్నతప్పు జరగటానికి ఆవకాశం లేకుండా ప్రత్యేకంగా ఏమైనా చేయాలని, ఆ దిశగా కఠినమైన నిర్ణయాలు ఉండాలని కమిషన్ సభ్యులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసినట్టు తెలిసింది.