పోచమ్మమైదాన్, జూన్ 16: వరంగల్ నగరంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నిర్మించబోయే సూపర్ స్పెషాలిటీ వైద్యశాల స్థలాన్ని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ బుధవారం సందర్శించారు. సెంట్రల్ జైలు స్థలంలో 24 అంతస్తుల మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి సీఎం కేసీఆర్ ఈ నెల 21న శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో పనులను మంత్రులు పరిశీలించారు. ఇప్పటికే ఆర్అండ్బీ అధికారులు జైలుకు సంబంధించిన నిర్మాణాలను కూల్చివేసి, నేలను చదును చేశారు. దాదాపు 64 ఎకరాల స్థలంలో పెద్ద ఎత్తున కెనడా దేశంలో మాదిరిగా హాస్పిటల్ నిర్మించనున్న ఈ స్థలంలో శంకుస్థాపన కోసం ఏర్పాట్లను అధికారులు చకాచకా చేస్తున్నారు. సోమవారం వరకు అన్నీ సిద్ధంగా ఉంచాలని మంత్రులు ఆదేశించారు. వారితో ఎంపీ డాక్టర్ బండా ప్రకాశ్, నగర మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, సీపీ తరుణ్జోషి, కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఈఎన్సీ గణపతిరెడ్డి, వాస్తు నిపుణులు తేజ ఉన్నారు.