హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) అధికార పగ్గాలు చేపట్టి 3 నెలలు తిరక్కుండానే ఆ పార్టీలో అసమ్మతి రాగాలు ఒకొక్కటిగా బయటపడుతున్నాయి. లోక్సభ ఎన్నికల టికెట్లను ప్యారాచుట్ నేతలకు కేటాయించడాన్ని సీనియర్లు తప్పుబడుతున్నారు. మొన్న టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు ఎల్ నిరంజన్ అధిష్ఠానానికి ఫిర్యాదు చేయగా, నిన్న వీ హనుమంతరావు ఆయనకు గొంతు కలపడంతో ఆ పార్టీలో నివురుగప్పిన నిప్పులా రాజకుంటున్న అసమ్మతి ఒక్కసారిగా బట్టబయలైంది. దీంతో ముదురుతున్న అసమ్మతిని మొగ్గ దశలోనే తుంచేసేందుకు టీపీసీసీ అప్రమత్తమైంది. అసమ్మతి నేతలు గాంధీభవన్లో ప్రెస్మీట్లు పెట్టకుండా కట్టడి చర్యలు చేపట్టింది. తాజాగా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఎంత సీనియర్ అయినా చర్యలు తప్పవని హెచ్చరించింది.
పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా క్రమశిక్షణ చర్యలు తప్పవని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించి పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ మీడియాలో ప్రకటనలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పార్టీ నిర్ణయాలను అందరూ ఆమోదించాల్సిందేనని స్పష్టం చేశారు. భిన్నాభిప్రాయాలు ఉంటే పార్టీలో అంతర్గంగా తెలియజేయాలన్నారు. క్రమశిక్షణను ఉల్లంఘిస్తే సీనియర్లపైనా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఒకవైపు ఎంపీ సీట్ల కేటాయింపు, మరోవైపు నామినేటెడ్ పోస్టుల చిచ్చు అధికార కాంగ్రెస్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. దీంతో రాష్ట్రంలో కనీసం 12 లోక్సభ సీట్లను గెలుచుకోవాలన్న లక్ష్య సాధనకు పార్టీ శ్రేణులు మనస్ఫూర్తిగా సహకరించవేమోనని పార్టీ పెద్దలు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణలో దశాబ్దం తర్వాత కాంగ్రెస్కు అధికారం దక్కడంతో ఇంతకాలం ఆ పార్టీని నమ్ముకున్న నాయకులంతా తమకు మంచి రోజులు వస్తాయని గంపెడాశతో ఎదురు చూశారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమకు టికెట్లు లభించకపోయినప్పటికీ కనీసం పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేసే అవకాశమైనా దక్కుతుందని భావించారు. ఇప్పుడు ఆ ఆశలు కూడా ఆవిరైపోవడంతో సీనియర్లకు మింగుడు పడటం లేదు. మొన్నటి దాకా అధికారాన్ని అనుభవించిన నాయకులను అప్పటికప్పుడు కాంగ్రెస్లో చేర్చుకుని లోక్సభ టికెట్లు ఇవ్వడంపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. కొందరు నేతలు బాహాటంగానే అసమ్మతి గళాన్ని విప్పుతూ రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వ వైఖరిని తూర్పారబడుతున్నారు. దీంతో ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లో చేరి ఎంపీ టికెట్లు దక్కించుకున్న అభ్యర్థులు కూడా ఆందోళన చెందుతు న్నారు. తమ విజయానికి పార్టీ క్యాడర్ సహకరిస్తుందా? లేదా? అని అనుమానిస్తున్నారు.
కొత్త సరుకును అమ్ముకునేందుకు పాత సరుకును ‘క్లియరెన్స్ సేల్’ పేరుతో కారుచౌకగా అమ్మడం వ్యాపారులు అనుసరించే చిట్కా. సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని టీపీసీసీ సైతం ఇదే విధానాన్ని అనుసరిస్తున్నది. ఖమ్మం ఎంపీ టికెట్ను తనకు అనువైన వ్యక్తికి ఇప్పించుకునేందుకు రేణుకా చౌదరిని రాజ్యసభకు పంపిన రేవంత్రెడ్డి.. వరంగల్ టికెట్ను ఆశించిన సిరిసిల్ల రాజయ్యకు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ పదవిని, భువనగిరి టికెట్ను ఆశించిన పటేల్ రమేశ్రెడ్డికి రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పదవిని కట్టబెట్టిన విషయం విధితమే. నాగర్కర్నూల్ ఎంపీ టికెట్ను డాక్టర్ మల్లు రవికి కట్టబెట్టాలన్న ఆలోచనతో ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్కు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఇంతకాలం ఆయా పదవులపై ఆశలు పెట్టుకున్న నాయకుల్లో అసమ్మతి రాజుకుంటున్నది.
నామినేటెడ్ పోస్టుల పందేరం కూడా రేవంత్ మంత్రివర్గ సహచరుల మధ్య అగ్గి రాజేస్తున్నది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నామినేటెడ్ పోస్టులన్నీ మంత్రి శ్రీధర్బాబు అనుచరులకే దక్కాయని అదే జిల్లాకు చెందిన మరో మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. పదవులు ఇచ్చే ముందు మాటమాత్రానికైనా సంప్రందించలేదని సన్నిహితుల వద్ద వాపోయినట్టు సమాచారం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మధిరకు ఒక్క కార్పొరేషన్ పదవి కూడా దక్కకపోవడంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆగ్రహంతో రగిలిపోతున్నారని తెలుస్తున్నది. సీఎం రేవంత్రెడ్డి విజయంలో కీలకభూమిక పోషించిన కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి తమ నామినేటెడ్ పోస్టులపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆ పదవులను స్వీకరించేందుకు వారు విముఖతతో ఉన్నట్టు సమాచారం. ఈ అసమ్మతి సెగలన్నీ ఏ క్షణమైనా భగ్గుమనే అవకాశం లేకపోలేదని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.