పాలకుర్తి : మహిళలు ఆర్ధికంగా బలపడితే ఆ కుటుంబం మొత్తం బలపడుతుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తిలో కుట్టు మిషన్ల ఉచిత శిక్షణా తరగతులను బుధవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళలను అన్ని రంగాల్లో వృద్ధి చేసేందుకు అనేక పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నారని పేర్కొన్నారు.
తెలంగాణలో మహిళలకు రూ. రెండువేల పింఛన్లు ఇస్తుండగా బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా ఇవ్వడం లేదని ఆరోపించారు. ఇచ్చే కొద్దిపాటి పింఛన్కు సవాలక్ష ఆంక్షలు పెడుతున్నాయని విమర్శించారు. తెలంగాణలో ఆడబిడ్డ పెళ్లికి కల్యాణ లక్ష్మి కింద రూ. లక్షా కట్నం కింద అందజేస్తున్నారని తెలిపారు. గర్భిణులకు పౌష్టిక ఆహారం, ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లడానికి వాహనాలు, ప్రసవం అయ్యాక కేసీఆర్ కిట్ ఇచ్చి కాపాడుతున్నారని తెలిపారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్యం అందుతుందని పేర్కొన్నారు.గతంలో నీటికోసం నానా గోసలు పడేదని రూ. 40వేల కోట్లతో మిషన్ భగీరథను తీసుకొచ్చి మంచినీటి బాధను శాశ్వతంగా తొలగించామని అన్నారు. ‘ కుట్టు మిషన్ల కోసం సీఎం కేసీఆర్ వద్దకు వెళ్తే మంచి ఆలోచన చేశావు . వెంటనే ప్రారంభించేందుకు ప్రోత్సహించార ’ ని మంత్రి పేర్కొన్నారు.
పర్వత గిరిలో కూడా కాకతీయుల కాలం నాటి గుడిని ఈనెల 26, 27,28 తేదీల్లో పునః ప్రతిష్ట చేస్తున్నామని వివరించారు. అనంతరం కంటి వెలుగు క్యాంప్ ను పరిశీలించారు. కార్యక్రమంలో వరంగల్ కలెక్టర్ గోపి, అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే , డీఆర్డీవో సంపత్ రావు, ప్రజాప్రతినిధులు, నాయకులు అధికారులు పాల్గొన్నారు.