Congress | మోటర్లకు మీటర్లు పెట్టనందుకు రాష్ర్టానికి సాయం చేయనన్న బీజేపీ.. చివరకు మ్యానిఫెస్టోలో రైతుబంధును కూడా ఎత్తేసింది. సాగుకు మూడు గంటల కరెంటు చాలు అంటున్నారు పీసీసీ అధ్యక్షుడు. రైతులు 10 హెచ్పీ మోటరు కొనుక్కోవాలంటూ తాఖీదులు ఇస్తారు. రైతుబంధు దుబారా అంటున్నారు మాజీ పీసీసీ అధ్యక్షుడు. అధికారంలోకి వస్తే.. ధరణిని ఎత్తేసి, పాత పట్వారీ వ్యవస్థను తిరిగి తెస్తామని చెప్తున్నారు సీఎల్పీ లీడర్.
అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్.. తెలంగాణ రైతుపై కత్తిగట్టినయ్. కక్షగట్టినయ్. రెండు పార్టీల మాటలు.. మ్యానిఫెస్టోలు చూస్తే పొంచి ఉన్న ప్రమాదమేందో ఎవరికైనా అర్థమవుతుంది. పదేండ్లుగా నిశ్చింతగా ఉన్న రైతు గుం డెల్లో ఈ ప్రకటనలు తీవ్ర అలజడి రేపుతున్నాయి. పొరపాటున కాంగ్రెస్కు అధికారం చిక్కితే రైతు బతుకు ఎంత కల్లోలం అవుతుందో నేతల ప్రకటనలే చెప్తున్నాయి.
రాష్ట్రంలో రైతు పరిస్థితి ఆగమయ్యే ప్రమాదం ముంచుకొస్తున్నది. కాంగ్రెస్కు ఒక్క ఓటు పడినా అంతే! కరెంటు 3 గంటలవుతుంది. దొంగోలె వచ్చే కరెంటు కోసం చేన్లకాడ చీకట్లో పాముకాటుకు గురయ్యే పాతరోజులు మళ్లొస్తయ్! రైతు నెత్తిన 10హెచ్పీ మోటర్ల భారం పడుతుంది. దుబారా అంటూ రైతుబంధుకు కత్తెర వేస్తారు. ధరణి ఎత్తేసి దళారీవ్యవస్థకు తలుపులు తెరుస్తారు. రైతుల భూమిహక్కు గాల్లో దీపంగా మారుతుంది. రైతులకూ కౌలుదార్లకూ మధ్య భూముల పంచాయితీలు మొదలవుతాయి. పచ్చని పల్లెల్లో మళ్లీ నెత్తురు పారుతుంది.
Congress | హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): రైతు తనకున్న భూమినే నమ్ముకొని బతుకుతాడు. ఆ భూమి భద్రంగా ఉన్నప్పుడే ఆ కుటుంబానికి భరోసా.. ఆ భూమిలో పంట బాగా పండినప్పుడే ఆ ఇంట్లో పండగ. ఎవుసం సాగాలంటే ఎలపట-దాపట ఎద్దులు ఎంత ముఖ్యమో.. రైతు బతుకు సాఫీగా సాగాలంటే సరిపడా కరెంటు- భూమి హక్కులు అంతే ముఖ్యం. పదేండ్ల కిందటి వరకు రైతుల జీవితాలు ఆగమై కునారిల్లిపోవడానికి కారణం ఇవే.. పదేండ్లుగా అన్నదాతలు గుండెమీద చెయ్యి వేసుకొని, కంటి నిండా నిద్రపోతూ, గౌరవంగా బతకడానికి కారణం ఈ కరెంటు, భూమి హక్కుల భద్రతే. ఇప్పుడిప్పుడే అప్పులు లేకుండా.. ఆదాయం కండ్ల చూస్తున్న మన జీవితాలను మళ్లా ఆగం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కాలనాగు మాదిరిగా ఎదురుచూస్తున్నది. పదేండ్లుగా పండుగగా మారిన వ్యవసాయాన్ని అధోగతి పాలు చేసేందుకు కత్తి పట్టుకొని సిద్ధంగా ఉన్నది.
నాడు ఎట్లున్నదో గుర్తుచేసుకొని.. నేడు ఎట్లున్నదో విశ్లేషించుకొని.. రేపు ఎట్లయితదో ఒక్కసారి ఊహించుకుంటే మనకే అర్థమైతది. తెలంగాణ పీఠభూమి ప్రాంతం. నదులన్నీ దిగువన.. పొలాలన్నీ ఎగువన. కాబట్టి మనకు బోర్లు, బావుల కింద సాగు తప్ప మరో మార్గం లేదు. అంటే కరెంటు ఉంటేనే వ్యవసాయం. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో సుమారు 19 లక్షల వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు ఉండేవి. వీటి కింద కనీసం 40 నుంచి 50 లక్షల ఎకరాల భూమి సాగయ్యేది. 2004లో అధికారంలోకి వచ్చినప్పుడు వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్తు ఇస్తామని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ 2014 వరకు కూడా ఐదారు గంటలకు మించి సరఫరా కాలేదు. విద్యుత్తు రంగంపై విడుదల చేసిన శ్వేతపత్రంలోనే వ్యవసాయానికి 7 గంటల కరెంటు ఇచ్చామని, అది కూడా నాణ్యత లేకుండా సరఫరా చేశామని ఒప్పుకున్నారు. అప్పట్లో పగటిపూట 3 గంటలు, రాత్రిపూట 3 గంటల వరకు మాత్రమే ఇచ్చేవారు.
అదికూడా గంటకోసారి విరామం ఇస్తూ వచ్చేది. కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలిసేది కాదు. దీంతో రైతులు అర్ధరాత్రి కూడా పొలాలకు వెళ్లాల్సి వచ్చేది. కరెంటు ఎప్పుడు వస్తుందా? అని రాత్రుళ్లు అక్కడే మేలుకొని ఎదురు చూడాల్సిన దుస్థితి. ఈ క్రమంలో పాములు, పురుగులు కరిచి, కరెంటు షాక్తో పోయిన ప్రాణాలకు లేక్కేలేదు. మరోవైపు అర ఎకరమో, ఎకరమో పొలం తడవగానే కరెంటు పోయేది. మళ్లీ వచ్చిన తర్వాత మోటర్ ఆన్ చేస్తే.. తడిచిన పొలానికే మళ్లీ నీళ్లందేవి. ఫలితంగా సగానికిగా పైగా పొలం ఎండిపోయేది. పదెకరాల్లో నాట్లు వేసిన రైతుకు కూడా ఒకటిరెండు ఎకరాలకు మించి దిగుబడి వచ్చేది కాదు. అంతిమంగా తినడానికి తిండిగింజలు మాత్రమే దక్కేవి. ధాన్యం కుప్పలు ఉండాల్సిన చోట.. అప్పుల కుప్పలు పెరిగేవి.
కునారిల్లిన వ్యవసాయ రంగానికి తిరిగి ప్రాణం పోయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చేసిన మొదటిపని.. విద్యుత్తుపై సమీక్ష. ఆరు నెలల్లోనే గృహ, వాణిజ్య, పరిశ్రమలకు 24 గంటల విద్యుత్తును అందించగలిగారు. వ్యవసాయానికి 9 గంటలపాటు విద్యుత్తు సరఫరా చేశారు. దీంతో రైతుల ముఖాల్లో కాస్త ఆనందం కనిపించింది. 2018 జనవరి 1వ తేదీ నుంచి దేశమే ఆశ్చర్యపోయేలా వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్తు సరఫరా మొదలైంది. అప్పటి నుంచి నిరాటంకంగా కొనసాగుతున్నది. ఒకప్పుడు కరెంటు ఎప్పుడొస్తుందా అని ఎదురుచూసిన రైతు.. ఆరేండ్లుగా బిందాస్గా ఉంటున్నాడు. అర్ధరాత్రి కటిక చీకట్లో పొలాలకు వెళ్లే దుస్థితి తప్పింది. మన ఇష్టమున్నప్పుడు పొలానికి వెళ్లే వెసులుబాటు కలిగింది. మనకు ఇష్టమున్నంతసేపు మోటర్ను నడిపించుకొని, పొలానికి కావాల్సినన్ని నీళ్లు పట్టే సౌలత్ వచ్చింది. కరెంటు కోసం లైన్మెన్ను బతిలాడుకునే బాధ తప్పింది. మన మోటర్ ఎప్పుడు నడవాల్నో మనమే నిర్ణయించుకునే స్థితికి వచ్చింది.
వ్యవసాయానికి మూడు గంటల కరెంటు చాలు అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఒకటికి రెండుసార్లు చెప్తున్నారు. గట్టిగా అడిగితే 10 హెచ్పీ మోటర్లు అంటూ ఏదో కహానీలు చెప్తున్నారు. అంటే.. దశాబ్దాలపాటు కరెంటు సరిగా ఇయ్యకుండా మనల్ని కాల్చుకుతిన్నది కాంగ్రెస్కు సరిపోలేదన్నమాట. 14 ఏండ్లు పోరాడి సాధించుకున్న తెలంగాణలో.. పదేండ్లుగా ప్రశాంతంగా బతుకున్న మనల్ని మళ్లా ఆగం చేయాలని కాంగ్రెస్ కంకణం కట్టుకున్నట్టున్నది. ఇచ్చేది మూడు గంటలే అయితే.. పొద్దున ఒక గంట, సాయంత్రం ఒక గంట, అర్ధరాత్రి ఒక గంట ఇస్తారేమో. ఇదే జరిగితే.. నాలుగైదు గుంటలు కూడా పొలం తడవదు. కనీసం తిండి గింజలు కూడా పండవు. మరోవైపు రైతుబంధు దుబారా అంటున్నరు కాబట్టి.. పెట్టుబడికి సేటు దగ్గర చేయి చాపాల్సిందే. అప్పుల కుప్పులు మళ్లీ నెత్తిమీదికొస్తాయి. ఇప్పుడు పండుగలా ఉన్న వ్యవసాయం మళ్లా దండుగైతది. మనకు మళ్లా ఉరితాడో.. పురుగు మందో గతి అయితది. మన కుటుంబాలు ఆగమైతయి.
రైతుకు భూమి గుండెకాయలాంటిది. ఒక్క పూట అన్నం తినకపోయినా బాధపడడు.. కానీ రోజూ తన పొలాన్ని చూసుకోకపోతే మనసున పట్టదు. అలాంటి పొలాన్ని ఇంకొకడు అక్రమంగా గుంజుకుంటే.. లంచమిచ్చి మనకు తెలువకుండానే పట్టా మార్చుకుంటే.. కండ్లముందే కంచె వేసి ఆక్రమించుకుంటే గుండె పగిలిపోతది. ఉమ్మడి రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు ఊరికి వంద. కానీ ఇప్పుడు భూమి రికార్డులు భద్రం.. ధరణితో మనకు తెలువకుండా భూమిని ప్రపంచంలో ఎవరూ మార్చనంత కట్టుదిట్టం. గుండెమీద చేయి వేసుకొని నిద్రపోయేంత నిమ్మలం. కానీ.. కాంగ్రెస్ పార్టీ ధరణిని బంగాళాఖాతంలో పడేస్తా అంటున్నది. ఇదే జరిగితే పరిస్థితి మొదటికొస్తది.
ఉమ్మడి రాష్ట్రంలో భూముల రికార్డుల మీద అధికారం అధికారుల చేతుల్లో ఉండేది. అది కూడా ఏ ఒక్కరికో కాదు. వీఆర్వో, ఆర్ఐ, తాసిల్దార్, ఆర్డీవో, కలెక్టర్, సీసీఎల్ఏ, రెవెన్యూ కార్యదర్శి, రెవెన్యూ శాఖ మంత్రి.. ఇట్లా రాష్ట్రంలోని ప్రతి గుంట పొలం మీద ఎనిమిది మందికి అధికారం ఉండేది. ఎదురుపడి నమస్కారం పెట్టకపోయినా.. ఎదురు మాట్లాడినా.. తెల్లారేసరికి రికార్డు మారిపోయేది. మన పేరుమీదున్న పట్టా ఇంకొకరి పేరుమీదికి మారేది. పదెకరాల రైతు కూడా తెల్లారేసరికి కూలీగా మారిపోయిన ఘటనలు వేలల్లో. ఇది గెట్ల పంచాయితీగా మొదలై, పోలీస్ స్టేషన్లు, కోర్టుల దాకా పోయేది. అధికారుల కాళ్లు పట్టుకొని, లంచాలు ఇచ్చినా పని అయితదనే నమ్మకం లేదు. కండ్లముందే పొలం ఆగమై గుండె పగిలి చనిపోయిన రైతులు ఎందరో.. తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలో రెవెన్యూ నిపుణులు నిర్వహించిన ఒక సర్వే ప్రకారం రాష్ట్రంలో వివాదాలు లేకుండా ఒక్క ఎకరా భూమి కూడా లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
ఒక రైతు కష్టం మరో రైతుకే తెలుస్తుంది. అందుకే సీఎం కేసీఆర్కు రైతుల కష్టాలపై సంపూర్ణ అవగాహన ఉన్నది. రాత్రికి రాత్రే రికార్డులు మార్చేసే సంస్కృతికి చరమగీతం పాడాలని నిర్ణయించారు. ప్రభుత్వం ముందుగా రికార్డుల ప్రక్షాళనతో మొదలుపెట్టింది. ఆ తర్వాత రైతులు, పట్టాల వివరాలన్నింటినీ డిజిటలైజ్ చేసింది. ఆ తర్వాత వీఆర్వో మొదలు రెవెన్యూశాఖ మంత్రి వరకు ఎవరూ ఆ రికార్డును మార్చలేని విధంగా పటిష్ఠమైన వ్యవస్థ ‘ధరణి’ పోర్టల్ను రూపొందించింది. 2020 సెప్టెంబర్ 29వ తేదీన సీఎం కేసీఆర్ ఈ ధరణి పోర్టల్ను అందుబాటులోకి తెచ్చారు. ధరణి వచ్చిన తర్వాత రైతుల భూముల హక్కులు భద్రంగా ఉన్నాయి. రికార్డులను ఇష్టమొచ్చినట్టు మార్చేసిన వీఆర్వో వ్యవస్థ పూర్తిగా రద్దయ్యింది. దీంతో తెల్లారేసరికి మారిపోయే సంస్కృతికి చరమగీతం పాడింది. భూమి హక్కులను వేరొకరికి బదలాయించే అధికారాన్ని ప్రభుత్వం తన దగ్గరి నుంచి ప్రజల చేతికి ఇచ్చింది. ఆ అధికారం భూ యజమాని వేలికొసన వచ్చి చేరింది.
మెట్పల్లి, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): ఈ ఫోటోలో మక్క చేనుకు బోరు నీళ్లు పెడుతున్న రైతు లవంగ రాజేందర్. జగిత్యాల జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం, అమ్మక్కపేట గ్రామానికి చెందిన 3 ఎకరాల రైతు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడక ముందు ఉన్న మూడెకరాలను సాగు చేసేందుకు తల్లడిల్లిపోయాడు. పూర్తిగా భూగర్భ జలాలు, కరెంటుపై ఆధారపడే వ్యవసాయం ఆయనది. వర్షాలపై ఆధారపడి సాగు చేసినా.. ఏ యేడు కూడా పూర్తిగా పంట చేతికొచ్చిన సందర్భం లేదు. దిగుబడి రాక అప్పులు మాత్రమే మిగిలేవని రాజేందర్ వాపోయాడు. దీనికితోడు.. భూమి రికార్డులకు గ్యారెంటీ ఉండేది కాదు. పంట రుణం కావాలన్నా వీఆర్వో, గిర్దావర్, ఎమ్మెర్వోల చుట్టూ తిరగాల్సి వచ్చేది.
దీనితో తనకున్న మూడెకరాల వ్యవసాయ భూమిని బీడుగా వదిలేసి రాజేందర్ బతుకుదెరువు కోసం దుబాయ్కి వలస వెళ్లాల్సి వచ్చింది. ఆరేండ్లకుపైగా అక్కడ కూలీగా పనిచేసిన తర్వాత తెలంగాణ సర్కారు 9 గంటల విద్యుత్తు నిరంతరాయంగా ఇవ్వడం మొదలెట్టిందని తెలుసుకొని సొంతూరికి వచ్చాడు. బీడుగా వదిలేసిన మూడెకరాలను బోరు నీటితోనే సాగు చేయడం మొదలెట్టాడు. తెలంగాణ సర్కారు రైతుబంధు పథకం, పూర్తి ఉచితంగా 24 గంటల కరెంటు ఇవ్వటంతో వ్యవసాయాన్ని పండుగలా తీర్చిదిద్దుకున్నాడు. ఇప్పుడు ఏటా రెండు పంటలు పండిస్తున్నాడు. ధరణితో తన భూమిపై పూర్తి భరోసా వచ్చిందని చెప్తున్నాడు. మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కష్టాలు తప్పవని.. తమ బతుకులు బొంబాయి.. దుబాయి.. బొగ్గుబాయి గతి అయితదని ఆందోళన వ్యక్తంచేస్తున్నాడు.
ఆదిలాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): తన పత్తి, శనగ చేనులో స్పింక్లర్ల ద్వారా నీటిని అందిస్తున్న ఈ రైతు పేరు కుమ్మల రాజు. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రానికి చెందిన రాజుకు 12 ఎకరాల భూమి ఉన్నది. గతంలో కరెంటు సరిగా లేకపోవడంతో ఒకే పంట పండించేవాడు. వర్షాధారంగా మాత్రమే పత్తి, సోయా సాగు చేసుకునే పరిస్థితి ఉండేది. ‘నేను వానకాలంలో నాలుగెకరాల్లో పత్తి, ఎనిమిదెకరాల్లో సోయా వేశా. వర్షాలు లేకపోవడంతో కరెంటు మోటర్ స్ప్రింకర్ల ద్వారా పత్తికి నీరు అందిస్తున్నా. నీళ్లు లేకపోతే దిగుబడి 30 క్వింటాళ్ల వరకు వచ్చేది. ఇప్పుడు నీటి సరఫరా కారణంగా 50 క్వింటాళ్లు వస్తున్నది. కరెంటు సౌకర్యం ఉండడంతో సోయా పంట అయిపోగానే ఎనిమిదెకరాల్లో శనగ వేశా. 24 గంటల కరెంటు, నీటి సౌకర్యం ఫలితంగా 100 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశాలున్నాయి. సమైక్య రాష్ట్రంలో భూముల రికార్డులు అస్తవ్యస్తంగా ఉండేవి. పట్టాదారు పేర్లు, తండ్రి పేర్లు, ఇతర వివరాలు సరిగా ఉండేవి కావు. సొంత రాష్ట్రంలో భూములకు భరోసా వచ్చింది.. కరెంటుపై నమ్మకం పెరిగింది’ అని వెల్లడించాడు.
అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ను తీసేస్తామని కాంగ్రెస్ గట్టిగా చెప్తున్నది. కౌలు రైతులతోపాటు పాత రికార్డుల్లో ఉన్న అన్ని కాలాలను పునరుద్ధరిస్తామని ఆ పార్టీ నేతలు బల్లగుద్ది మరీ చెప్తున్నారు. అంటే.. పాత కాలంలో ఉన్నప్పటి పరిస్థితినే మళ్లీ తెస్తామని అంటున్నారు. మళ్లీ వీఆర్వోలు వస్తారు, ఆపై అధికారులకు అధికారాలు వస్తాయి. తాము అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో వీఆర్ఏల నియామకం చేపడుతామని బాజాప్తా ఎన్నికల మ్యానిఫెస్టోలోనే పెట్టింది. ఇదే జరిగితే మళ్లా మనం దినదిన గండంగా బతకాల్సిందే. ఇప్పుడు తలెత్తుకొని గర్వంగా బతుకుతున్న మనం.. కనిపించిన ప్రతి అధికారికి వంగివంగి సలాం పెట్టాల్సిందే. ఊరికి ఇద్దరు పైరవీకారులు వస్తారు. భూముల రికార్డులు వాళ్లే మార్చి.. మళ్లా సెటిల్మెంట్ల పేరుతో డబ్బులు గుంజిన తర్వాతే మళ్లీ మన పేరుమీదికి పట్టా వస్తుంది. రికార్డులు సరిగా లేక రైతుబంధు ఆగమవుతుంది. పంటకొనుగోళ్లు ఆగిపోయి అడ్డికి పావుషేరు లెక్క సేట్లకు అమ్ముకోవాల్సి వస్తుంది. అటు కరెంటు రాక, పంటలు పండక, ఇటు భూమిపై హక్కులు లేక.. మొత్తంగా మన బతుకు మళ్లా ఆగమవుతుంది.
సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన ధరణి పోర్టల్తో భూ రికార్డులు పదిలంగా ఉన్నాయి. నాకు మొత్తం 10 ఎకరాల భూమి ఉంది. ధరణి రికార్డులో నమోదైన నా భూమి వివరాలు నా వేలిముద్ర, అనుమతి లేకుండా రికార్డులు మార్చేందుకు ఎవరికీ సాధ్యంకాదు. మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తీసేస్తామంటున్నారు. అదే జరిగితే మాకు కష్టాలు మళ్లీ మొదలవుతాయి. కౌలుదారు, అనుభవదారు కాలాలు ప్రవేశపెడతామని కాంగ్రెస్ అంటున్నది. గతంలో ఉన్న ఆ కాలమ్స్ వల్ల రైతుల భూరికార్డులు సక్రమంగా లేక వివాదాలు తలెత్తి కోర్టుల చుట్టూ తిరగడమే కాకుండా భయంభయంగా గడపాల్సి వచ్చేది. కాంగ్రెస్ ప్రభుత్వం భూమాత పోర్టల్ను ప్రవేశపెడితే భూ రికార్డులన్నీ అస్తవ్యస్తంగా తయారవుతాయి. ప్రస్తుతం నడుస్తున్న ధరణి పోర్టల్ చాలా బాగుంది.
– వేమిరెడ్డి బాలరాఘవరెడ్డి, ఇనగాలి, ఖమ్మం
ధరణి పోర్టర్ లేకముందు నాలెక్క ఎంతోమంది రైతులు దగా పడ్డరు. భూమి సమస్యలు తీరక కార్యాలయాల చుట్టూ తిరుగుతూ అధికారుల కాళ్లావేళ్లా పడ్డా కనికరం ఉండకపోయేది. నేను 15 ఏండ్ల కింద 2.17 ఎకరాల భూమి మా ఊళ్లో కొని, నా భార్య పేరు మీద పట్టా చేసుకున్నం. పట్టా అయినంక మ్యుటేషన్కు తాసిల్ ఆఫీసోళ్లు ఎన్నో తిప్పలు పెట్టిన్రు. రెండు మూడేండ్లు ఆఫీసు చుట్టూ తిరుగుడే అయింది. ఎలాంటి సమస్యలు లేని భూమిని ఎందుకు ఆపిన్రో వాళ్లకే తెల్వదు. లోను రాలే. మస్తు ఇబ్బంది పడ్డ. లాస్ట్కు తిరగంగ తిరగంగ రికార్డులల్ల ఎక్కించిన్రు. అసొంటి గోస ఉండద్దనే కేసీఆర్ సార్ ధరణిని తీసుకువచ్చిన్రు. ఇప్పుడిప్పుడే ధరణితో సమస్యలు లేకుండా రైతులు ఆనందంగా ఉన్నరు.
ఏ ఆఫీసుల చుట్టూ తిరుగుడు లేదు, లంచాలు ఇచ్చుడు లేదు. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి వస్తే ధరణిని తీసేస్తం అంటున్నరు. ధరణిని తీసేసి మళ్ల భూముల వ్యవస్థను ఆగమాగం చేసేతందుకా? భూములను దోచుకోవడానికా? వాళ్ల హయాంలో పట్టాదారు, అనుభవదారు, కౌలుదారు అని కాలమ్లు పెట్టి ఎంతమంది అసలు రైతులు మునగిపోలే. ఇప్పుడున్న ధరణితోనే టైటిల్ బందవస్తు ఉన్నది. కాంగ్రెస్వాళ్ల మాటలైతే ఎవలు నమ్ముతలేరు. ఒక్కసారి ధరణిల ఎక్కిందంటే ఆ రికార్డును మార్చేతందుకు రెవెన్యూవాళ్లకు కూడా చాన్స్ లేకుంట చేసిండు కేసీఆర్ సర్. కాంగ్రెస్ వాళ్ల దందాలు, కబ్జాలు సాగుతలేవనే ధరణిని తొలగిస్తం అంటున్నరు.
– కొత్త తిరుపతిరెడ్డి, నుస్తులాపూర్, కరీంనగర్
నాకు నాలుగెకరాల భూమి ఉంది. గతంలో పటేల్ పట్వారీ వ్యవస్థ కాలంలో డబ్బులకు ఆశపడి దొంగ రిజిస్ట్రేషన్లు చేసిండ్రు. రెవెన్యూ రికార్డుల్లో తప్పులు చేస్తూ రైతులను మోసం చేసేటోళ్లు. ఇలా ఎందరో రైతుల జీవితాలు ఆగమైనయి. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారంగా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరణి పోర్టల్ తెచ్చింది. ఏ అధికారితో సంబంధం లేకుండా అన్ని అధికారాలు మాకే కల్పించడం వల్ల భూమి సేఫ్గా ఉంది. మా భూములను ఎవరూ దొంగ రిజిస్ట్రేషన్ చేసుకోరాదు. మేం స్వయంగా భూములను అమ్ముకుంటే తప్ప పట్టా పాసు పుస్తకాలను మార్చే అధికారం ఏ అధికారికి లేకుండా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే భూమాత పోర్టల్ తెచ్చి మళ్లీ పాత విధానంలో ఉండే విధంగా అన్ని కాలమ్స్ పెడతామంటుంది. అట్లా అయితే కథ మళ్లీ మొదటికి వస్తది. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలి. ధరణి పోర్టల్ను కొనసాగించాలి.
– బింగి శెట్టిరెడ్డి, రైతు, ధరూర్, జగిత్యాల
కేసీఆర్ ప్రభుత్వం ధరణి తెచ్చిన తర్వాతనే భూముల విషయంల రైతులకు న్యాయం జరిగింది. గతంల వీఆర్వో, వీఆర్ఏల వ్యవస్థతోని చానా ఇబ్బందులు పడ్డం. ఏడాదికో రికార్డు రాసెటోళ్లు. అపుడు ఒకల పేరు ఇంకొకలకు రాసేది. పట్టా కాలం ఒకని పేరుంటే కబ్జా కాలం ఇంకొకని పేరుండేటిది. దాన్ని రైతులు ఎప్పటికపుడు చూసుకోకపోయేటిది. ఎప్పుడో ఓసారి చూసేవరకు రాసిన పట్వారి ఉండక పోయేది. ఇగ పేరు రాసిన రైతు మంచోడైతే మళ్ల ఎవలది వాళ్లకు వచ్చేది. మంచోడు కాకపోతే కోర్టుల చుట్టూ తిరుగక తప్పక పోయేది.
నా ఎర్కల ఇట్ల నేను మస్తు పంచాయతీలు చూసిన. తప్పు జరిగింది సరి చెయ్యమంటే పైసలడిగేది. పైసలు ఇయ్యకపోతే మళ్ల అట్లనే రాసుకచ్చేది. ఇట్ల రైతులు మస్తు ఇబ్బందులు పడ్డరు. ఏండ్లకేండ్లు ఆఫీసుల సుట్టూ తిరగాల్సి వచ్చేటిది. గసొంటి రెవెన్యూను సీఎం కేసీఆర్ సార్ మొత్తం మార్చేసిండు. ధరణి పేరుతోని మా భూములకు భద్రత కల్పించిండు. మా బొటనవేలు ముద్ర వేస్తే తప్ప ఇంకొకనికి బదిలీ కాదు. ఇంత మంచి వ్యవస్థను కాంగ్రెసోళ్లు తప్పువడుతున్నరు. అది వాళ్ల నాశినానికే. భట్టట్టి విక్రమార్క ధరణి స్థానంల ఇంకేదే తెచ్చి గతంల ఉన్న కబ్జా కాలం ఇంకేదో తెస్తమని చెప్పిండు. పట్వార్లు చేసే తప్పులకు మేం బలవుతున్నమనే కదా.. కేసీఆర్ సార్ ధరణి తెచ్చింది. ఇప్పుడు దాన్ని తీసేస్తమంటే రైతులం ఊకుంటమా?
– కూర శ్యాంసుందర్రెడ్డి, చెర్లభూత్కూర్, కరీంనగర్
ధరణి పోర్టల్తో రైతులు కంటి నిండ నిద్రపోతుండ్రు. అదే తీసేస్తే పైరవీకార్లు రాజ్యమేలుతరు. పటేల్ పట్వారీల వ్యవస్థలో క్షణాల్లో పహాణీలో పట్టాదారు పేరు దొంగతనంగా మార్చేది. రైతులు చెప్పులరిగేలా తిరిగినా పనులు కాకపోయేది. ధరణితో దళారులకు, లంచాలకు చెక్ పడింది. స్వల్ప లోపాలుంటే సవరించి ఆప్షన్లు పెట్టాలి. ధరణిని కాంగ్రెసోళ్లు బంగాళాఖాతంలో వేస్తామనడం అవివేకం. దాన్ని తీసేస్తే రెవెన్యూ వ్యసస్థ ఆగమైతది. రైతుల భూములకు రెక్కలొస్తయ్. పట్టేదారుకు తెల్వకుంటనే అతని భూమి మార్పిడి జరుగుతది. ధరణితో ఒకేసారి రిజిస్ర్టేషన్, మ్యుటేషన్ జరిగి తక్షణం అమ్మినవారి పేరు డిలీట్ అయి, కొన్నవారి పేర భూమి నమోదైతాంది. సెల్ఫోన్లో మన భూముల వివరాలు కనిపిస్తున్నయ్. భూమి కొలతలు కావాలంటే కిలాసర్ చుట్టూ నెలల తరబడి తిరిగేది. నేడు ఫోన్లోనే వస్తోంది. ఒకవేళ ధరణి మార్చితే రైతులు నెలకోసారి మీ సేవకు పోయి మా పేర్ల మీదే భూములున్నాయా? వేరే పేర్లకు ఎక్కిందా? అని చూసుకోవాల్సి వస్తది. కేసీఆర్ పుణ్యమా అని ధరణి పేర 90 శాతం రికార్డులు అవకతవకలు లేకుండా చేసిన్రు. ఆయన అన్నట్టు భూముల సమగ్ర సర్వే జరిగితే మంచిది.
– లేగ సోమిరెడ్డి, రామరాజుపల్లి, దేవరుప్పుల, జనగామ
కాంగ్రెస్ వస్తే ధరణి పోర్టల్ తీసేసి భూమాత పోర్టల్ తీసుకొస్తామంటున్నరు. సోయి ఉన్న ఏ నాయకుడు ఆ పనిచేయడు. ధరణి పోర్టల్తో రైతులు సంతోషంగా ఉన్నారు. కాంగ్రెస్ మాటలు చూస్తుంటే ఆ పార్టీకి వ్యవసాయం, రైతుల గురించి అవగాహన ఉన్నట్టు అనిపించడం లేదు. తెలివున్నోళ్లు ఎవరైనా రైతులను మళ్లీ కష్టాలపాలు చేస్తామంటారా? కాంగ్రెస్ నాయకులు ఏ సోయితో మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. ఇది ముమ్మాటికీ రైతు వ్యతిరేక చర్యే.
– రోండ్ల నర్సారెడ్డి, వాడి గ్రామం, నిజామాబాద్
నాకు ఐదెకరాల భూమి ఉంది. తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన ధరణితో భూరికార్డులు భద్రంగా ఉన్నాయి. ధరణి వల్ల భూ సమస్యలు వచ్చే అవకాశం లేదు. నా భూమి ఇంకొకరి పేరుమీదికి మార్చే అవకాశమే ఉండదు కాబట్టి రందిలేకుండా ఉండొచ్చు. మేం అధికారంలోకి వస్తే తీసేస్తామని కాంగ్రెసోళ్లు అనడం అన్యాయమే. ధరణి వల్ల మా భూమి ఎంత ఉన్నదనేది ఎక్కడి నుంచైనా చూసుకోవచ్చు. కేసీఆర్ సార్ ధరణి తీసుకొచ్చి భూరికార్డులను ఇతరులు మార్చే అవకాశం లేకుండా చేశారు. తెలంగాణ రాకముందు అరిగోస పడ్డాం. మళ్లీ మమ్మల్ని కష్టాలు పాల్జెయ్యడమే వారి ఉద్దేశంలాగా ఉన్నది. వాళ్లొస్తే మళ్లీ పాత రోజులే వస్తాయి. పంచాయితీలు, గొడవలు మళ్లీ మొదలవుతాయి.
– సత్తు మోహన్, కొలిమికుంట, కరీంనగర్ జిల్లా
ఒకప్పుడు ఏటా పాణినకల్ తీసుకునేటోళ్లం. మా భూములున్నయా? ఎవని పేరు మీదికన్న పోయినయా? అనేది ఎప్పటికీ భయమే ఉండేది. రెవెన్యోళ్లను నమ్మెతానికి లేకుండే. కేసీఆర్ సార్ ధరణి తెచ్చినంక ఒక్క పంచాయతన్నా అయితందా? ధరణి ఉండబట్టిగనే ఎవని భూములు ఆని చేతులున్నయి. అమ్ముకున్నా.. కొనుక్కున్నా పది నిమిషాలల్ల పనైపోతుంది. ఒక్క దినంలనే ముటేషన్ సుతం చేసి చేతుల వెడుతున్నరు. ఎన్కట ఎట్లుండె. రిజిస్ట్రి కాయితాలు రావాలె. మళ్ల తాసిల్దార్ ఆఫీసుల దరఖాస్తు వెట్టుకోవాలె. కాళ్లకు బట్టగట్టుకుని ఆఫీసుల చుట్టు తిర్గాలె. కాళ్లరిగెతట్టు తిర్గినా కనికరించెటోళ్లుగాదు. ఇసోంటి మంచి సవులతి ఉన్న పద్ధతిని తీసేత్తమని కాంగ్రెసోళ్లు అంటుండ్రట. ఇదేం పద్ధతో వాళ్లకే తెల్వాలె.
– దాసరి రాజిరెడ్డి, చెర్లభూత్కూర్, కరీంనగర్
సీఎం కేసీఆర్ తెచ్చిన ధరణి పోర్టల్ రైతుకు ఎంతో సౌకర్యంగా ఉన్నది. రైతుకు తెల్వకుండా అతని భూమి మరొకరికి మార్చే అవకాశమే లేదు. రైతు అనుమతితో మాత్రమే తాను అమ్ముకుంటేనే అతని భూములు మరొకరి పేరిట ఎక్కుతయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి తీసేసి పాత పద్ధతిలో పట్వారీ వ్యవస్థను తెస్తే మళ్లీ మాలాంటి అమాయకపు రైతులు మోసపోవాల్సి వస్తుంది. ఒకే భూమిని ఏండ్లుగా సాగు చేసుకునే కౌలు రైతుల్లో ఎవరికైనా వక్రబుద్ధి పుడితే రెవెన్యూ అధికారుల సాయంతో పట్టాదారు కాలంలో తన పేరు ఎక్కించుకునే ప్రమాదం కూడా ఉంటది. అప్పుడు అసలు పట్టాదారు ఇబ్బంది పడాల్సి వస్తది.
– కాల్వ కొమురయ్య, గొల్లపల్లి మండలం, జగిత్యాల
ఉన్నదాన్ని తీసుడెందుకు? కొత్తగా పెట్టుడెందుకు? ఇప్పుడున్న ధరణి మంచిగానే ఉంది కదా. ఎక్కడున్నా మన భూమిని చూసుకోవచ్చు. భూ కార్డుల్లో కౌలు రైతు పేరు నమోదు మంచిది కాదు. ఎందుకంటే కొందరు కౌలు ఇచ్చి వేరే పనుల మీద ఎక్కడెక్కన్నో ఉంటారు. ఐదేండ్లకో, పదేండ్లో వచ్చేటప్పటికీ కౌలు రైతు అసలు పట్టాదారు అయి కూర్చుంటడు. అప్పుడు ఆ భూమి యాజమాని ఏం కావాలి? నాకు 4.30 ఎకరాలు ఉన్నది. 4ఎకరాల్లో వరి, 30గుంటల్లో పత్తి పండిస్తున్న. రేపు పొద్దున నాకు చేత గాకపోవచ్చు. అప్పుడు కౌలుకిస్తా. కొన్నేండ్ల తర్వాత ఆ కౌలు రైతు నాదే భూమి అంటే ఎలా? నాకు చేతగాదు. ఆఫీసుల చుట్టూ తిరగలేను. ఇక నా భూమిని ఇడ్చి పెట్టాల్సిందే.
– చింతల రఘుపతి, రైతు, పెద్దపల్లి