ఆరునెలల క్రితం నాటి మాట.. తెలంగాణలో పండించిన ధాన్యం కొనాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్రం అడిగితే.. అబ్బే గోదాములు ఖాళీ లేవు.. నాలుగైదేండ్లకు సరిపడా ఆహార నిల్వలు ఉన్నాయి. కొనే పరిస్థితి లేదు అని ఘనత వహించిన మోదీ సర్కారు సెలవిచ్చింది. సాగు విస్తీర్ణాన్ని తగ్గించండి అని సూచించారు.
ఈ మాటలు చెప్పి పట్టుమని ఆరు నెలలైనా కానేలేదు. సీన్ రివర్స్ అయింది. వాళ్లు చెప్పినట్టు గోదాముల్లో నాలుగైదేండ్లకు సరిపడా నిల్వ ఉన్న ధాన్యం ఏ ఎలుకలు తిన్నాయో.. పందికొక్కులు తిన్నాయో తెలియదు. నిల్వలన్నీ అడుగంటిపోయాయి. పంటల సాగు విస్తీర్ణమూ భారీగా తగ్గింది. వెరసి.. దేశంలో ఆహార సంక్షోభం తలెత్తే పరిస్థితి దాపురించింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): వ్యవసాయరంగంపై కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న అసంబద్ధ నిర్ణయాలు, ముందుచూపు లేమి దేశాన్ని ఆహార సంక్షోభం ముంగిట నిలిపాయి. పంటల సాగుపై కేంద్రం విధించిన ఆంక్షలు, తీసుకొన్న నిర్ణయాలతో ఈ వానకాలం సీజన్లో దేశవ్యాప్తంగా పంటల సాగు విస్తీర్ణం భారీగా తగ్గింది. ఆహార ఉత్పత్తుల నిల్వలు వేగంగా తగ్గిపోతున్నాయి. దీంతో దేశంలో ఆహార సంక్షోభం ఎదురయ్యే ప్రమాదం ఉన్నదనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాన ఉత్పత్తులైన బియ్యం, గోధుమలు, పప్పు పంటలపై ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా వరి సాగు భారీగా తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తున్నది.
గతేడాదితో పోల్చితే వరి సాగు ఏకంగా 51 లక్షల ఎకరాల్లో తగ్గడం గమనార్హం. ఈ తగ్గుదల ఐదారు రాష్ర్టాల్లో మొత్తం వరిసాగుకు సమానం కావడం గమనార్హం. దీంతో ఈ సీజన్లో సుమారు 50 లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తి తగ్గే అవకాశమున్నదని కేంద్ర వ్యవసాయశాఖ కార్యదర్శి సుధాన్షు పాండే స్వయంగా వెల్లడించడం పరిస్థితికి అద్దం పడుతున్నది. వరిసాగు చేసే ప్రధాన రాష్ర్టాల్లో ఒక్క తెలంగాణలో మినహా మిగిలిన అన్ని రాష్ర్టాల్లోనూ సాగువిస్తీర్ణం తగ్గింది. పప్పు పంటల విస్తీర్ణం కూడా నిరుటితో పోల్చితే సుమారు 14 లక్షల ఎకరాల్లో తగ్గింది. దేశ వ్యాప్తంగా మొత్తం పంటల సాగు 25 లక్షల ఎకరాలు తగ్గింది. నిరుడు ఇదే సమయానికి 10.94 కోట్ల హెక్టార్లలో వివిధ పంటలు వేయగా ఈసారి 10.84 కోట్ల ఎకరాలకు పరిమితమైంది.
వర్షాకాలంలోనే పలు రాష్ర్టాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొంటే ఎండాకాలం (యాసంగి)లో పరిస్థితి మరింత దారుణంగా ఉండే ప్రమాదమున్నది. వానకాలంలోనే పంటల సాగు తగ్గితే యాసంగిలో పంటలసాగు భారీగా తగ్గే అవకాశమున్నదనే ఆందోళన నెలకొన్నది. ఇదే జరిగితే ఉత్తరాది రాష్ర్టాల్లో గోధుమల ఉత్పత్తి, దక్షిణాది రాష్ర్టాల్లో వరి ఉత్పత్తి భారీగా తగ్గిపోతుంది. ఇదే జరిగితే వచ్చే ఏడాది దేశంలో ఆకలి కేకలు తప్పకపోవచ్చనే ఆందోళనలు నెలకొన్నాయి. ఇప్పటికే ఆకలి సూచీలో దేశం 101 వ ర్యాంకులో నిలిచింది. ఆహార సంక్షోభం ముదిరితే ఇది మరింత దిగజారే ప్రమాదం ఉంది. ఇదే జరిగితే ప్రపంచంలోని చిన్న చిన్న దేశాల ముందు భారత్ నవ్వులపాలవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కేంద్రం ఆంక్షలు, కరువుతో పంటల సాగు తగ్గి ఆహార ఉత్పత్తుల నిల్వలపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. దేశంలో ఆహార ఉత్పత్తుల బఫర్స్టాక్ వేగంగా కరిగిపోతున్నది. 2022 జూలైలో బఫర్స్టాక్ లక్ష్యం 13.5 మిలియన్ టన్నులు కాగా 31.7 మి లియన్ టన్నుల నిల్వలు ఉన్నాయి. 2023 ఏప్రిల్ నాటికి బఫర్స్టాక్ నిల్వలు 13.6 మి లియన్ టన్నులుగా అవసరం కాగా, నిల్వ లు 11.4 మిలియన్ టన్నులే ఉంటాయని అంచనా. అంటే బఫర్ స్టాక్ కన్నా 2.2 మి లియన్ టన్నుల బియ్యం తక్కువ. సాగు త గ్గుదల, కరువుతో ఈ కొరత మరింత పెరుగనున్నది. గోధుమలది కూడా దాదాపుగా ఇదే పరిస్థితి. 2023 ఏప్రిల్ నాటికి బఫర్ స్టాక్ 7.4 మిలియన్ టన్నులు ఉం డాలి. కానీ ఆ పరిస్థితి కనిపించడంలేదు. కేంద్రం అమలు చేస్తున్న ఉచిత బియ్యం, గోధుమల పంపిణీని మరోసారి పొడిగిస్తే దేశంలో ఆహార ఉత్పత్తుల నిల్వలు భారీగా పడిపోయి సంక్షోభం రావడం ఖాయమనే అభిప్రాయాలున్నాయి. ఈ పథకం పొడిగిస్తే 2021లో 56.93 మిలియన్ టన్నులుగా ఉన్న ఆహార ఉత్పత్తుల నిల్వలు 2023 ఏప్రిల్ నాటికి 18.88 మిలియన్ టన్నులకు పడిపోతాయనే అంచనా.