కందుకూరు, ఫిబ్రవరి 7: కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడం ద్వారా రాష్ర్టానికి కాంగ్రెస్ ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. అయినా, సీఎం రేవంత్రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. కృష్ణా నదీ జలాలపై తెలంగాణ హక్కులను కాపాడుకోవడానికి ఎందుకు ఆయన ప్రయత్నించడం లేదని నిలదీశారు. బుధవారం రంగారెడ్డి జిల్లా కందుకూరులో ఆమె మాట్లాడుతూ.. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా కేసీఆర్ ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించలేదని, పదేండ్లు కాపాడారని గుర్తుచేశారు.
కృష్ణా ప్రాజెక్టులను కేఈఆర్ఎంబీకి అప్పగించాలని నిర్ణయించిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ర్టానికి అన్యాయం చేస్తే సహించబోమని, రాష్ట్ర ప్రభుత్వ ప్రమాదకర ధోరణిని ప్రజాక్షేత్రంలో ఎండగడుతామని హె చ్చరించారు. తెలంగాణ నీటి హక్కులు తేలే వరకు ఉద్యమాన్ని వదిలిపెట్టబోమని ఆమె స్పష్టం చేశారు. కందుకూరుకు కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసిన మెడికల్ కాలేజీని ఉపసంహరించుకోవడం తగదని ఆగ్రహం వ్యక్తంచేశారు. మెడికల్ కళాశాల రద్దు జీవోను ఉపసంహరించుకోవాలని కోరారు. సమావేశంలో జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సురుసాని సురేందర్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మన్నే జయేందర్ ముదిరాజ్, పీఎసీఎస్ చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సురుసాని రాజశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.