వరంగల్ : అంతా బాగుంటేనే ఆరోగ్య తెలంగాణ సాధ్యమని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జిల్లాలోని వర్ధన్నపేట మండలం పంథిని, రాయపర్తి, మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఐదేళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేసి పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..బంగారు తెలంగాణ కావాలి అంటే పాడి పంటలతో పాటు..అందరికి ఆరోగ్యం ఉన్నప్పుడే సాధ్యం అన్నారు. సీఎం కేసిఆర్ ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధ పెడుతున్నారు.
ముఖ్యంగా తల్లీ, బిడ్డల ఆరోగ్యం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. మాతా శిశు సంరక్షణలోనూ మన రాష్ట్రం దేశంలో నెంబర్ వన్ గా ఉందన్నారు. రాష్ట్రంలో అందరికి ఉచిత వైద్యం అందించాలనేది సీఎం కేసీఆర్ ఆలోచన అన్నారు. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అందరి ప్రొఫైల్ సిద్ధం చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.