Errabelli Dayakar Rao | హామీల అమలుకు సీఎం రేవంత్రెడ్డి ఆగస్టు వరకు గడువు పెట్టడాన్ని బట్టి చూస్తే, ఎన్నికలు దాటవేయాలనే ఆలోచన బట్టబయలు అవుతుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి అధ్యక్షతన వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సన్నాహాక సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి హాజరైన ఎర్రబెల్లి మాట్లాడుతూ.. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తానన్న రేవంత్రెడ్డి ఇప్పుడు మాట మార్చి ఆగస్టు నెలకు వాయిదా వేశారని అన్నారు. ఆగస్టు వరకు ఎన్నికలు పూర్తవుతాయని, ఇక అప్పుడు ప్రజలకు ఏం చెప్పినా నడుస్తుందనే ఆలోచనతో ఒక పథకం ప్రకారం ముందుకెళ్తున్నాడని విమర్శించారు. దమ్ముంటే ఆగస్టులో రుణమాఫీ చేస్తానని.. ఒకవేళ చేయకుంటే ప్రభుత్వాన్ని రద్దు చేస్తానని రాసివ్వాలని డిమాండ్ చేశారు. అయినా కాంగ్రెసోళ్లకు బాండ్లు రాసివ్వడం కొత్తేం కాదని, ఎన్నికల సమయంలో రాసిచ్చిన బాండ్ల అడ్రస్ ఎక్కడ అని మండిపడ్డారు. క్వింటాలుకు రూ.500 పంట బోనస్ ఏమైందని ప్రశ్నించారు.
రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారుల నుంచి ఢిల్లీకి సూటికేసులు తరలిస్తున్నారని ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందన్నారు. ప్రజలు కేసీఆర్ను ఓడించినందుకు బాధపడుతున్నారని అన్నారు. వరంగల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుస్తున్నట్లు కాంగ్రెస్ సర్వేలే చెబుతున్నాయని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై ఎవరి చేయి పడినా ఉరికించి కొట్టాలని, మీ పై అక్రమ కేసులు పెడితే నేను మీ వద్దకు వచ్చి కొట్లాడతానని అన్నారు. కార్యకర్తలు ఎవరూ అధైర్యపడవద్దని ధైర్యం నింపారు.