హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): ఎక్కడైనా విలువైన వనరు ఉంటే దానికోసం గొడవలు, యుద్ధాలు జరుగుతుంటాయి. ఇప్పుడు తెలంగాణలో భూమి అనేది అత్యంత విలువైన వనరుగా మారింది. అయి నా ధరణి పోర్టల్తో రికార్డులు భద్రంగా ఉండటం, లావాదేవీలు అత్యంత పారదర్శకంగా సాగుతుండటంతో గొడవలు, కొట్లాటలు జరగకుండా గ్రామాలు ప్రశాంతంగా ఉన్నాయి. రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులు ఉంటే, ఇందులో 90 శాతానికిపైగా చిన్న సన్నకారు రైతులే. వాళ్ల ఆధీనంలో గుంట, రెండు గుంటలు మొదలు నాలుగైదు ఎకరాలలోపే భూమి ఉన్నది. ఆ భూమిని వదులుకోవడానికి ఎవరూ ఒప్పుకోరు. ఒకప్పుడు తెలంగాణలో ఎకరం భూమి రూ.50 వేల నుంచి రూ.2.5 లక్షల వరకు పలికేది. అయినా ఊర్లల్లో నిండా గెట్ల పంచాయితీలు ఉండేవి.
గజం భూమి కోసం కూడా ఏండ్లకేండ్లు వివాదాలు నడిచేవి. దాడులు, ప్రతిదాడులు మొదలు హత్యల వరకు వెళ్లేది. ఇప్పుడు రాష్ట్రంలో ఎకరం భూమి రూ.40 లక్షల నుంచి రూ.3 కోట్ల మధ్య నడుస్తున్నది. పైగా వ్యవసాయం పూర్తి లాభదాయకం అయ్యింది. నీళ్లు వచ్చాయి, ఉచిత విద్యుత్తు అందుతున్నది. ప్రభుత్వం రైతుబంధు, రైతుబీమా ఇస్తున్నది, విత్తనాలు సరఫరా చేస్తున్నది. ధాన్యం కొంటున్నది. వ్యవసాయం అత్యద్భుతంగా లాభసాటిగా మారింది. దీంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి.
ప్రతి అడుగు జాగా కూడా విలువైందే. ఇప్పుడు పెరిగిన ధరలకు ధరణి లాంటి పోర్టల్ లేకుంటే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకుంటేనే భయంకరంగా ఉంటుంది. గతంలో వచ్చిన ఒక నివేదిక ప్రకారం సివిల్ కోర్టుల్లోని కేసుల్లో 66 శాతం భూ వివాదాలేనని చెప్పింది. దేశంలో జరుగుతున్న హత్యల్లో 14 శాతం.. అంటే ప్రతి వంద హత్యల్లో 14 భూ తగాదాల వల్లే జరుగుతున్నట్టు నివేదిక స్పష్టం చేసింది. ధరణిని తీసేస్తే ఈ నేరాల సంఖ్య రెట్టిపయ్యే అవకాశం ఉంటుంది. కౌలురైతులు వచ్చి చేరితే మరింత ముదురుతాయి. గ్రామాలు రావణకాష్టాన్ని తలపిస్తాయి.