KCR | అబ్ కీ బార్ చార్ సౌ పార్ అని బీజేపోళ్లు గ్యాస్ చెబుతున్నారని.. కేంద్రంలో మళ్లీ బీజేపీ గెలిస్తే పెట్రోల్, డీజిల్ ధరలు 400 అవుతుందని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. ఇందులో అనుమానమే అవసరమే లేదని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జహీరాబాద్ లోక్సభ సెగ్మెంట్ పరిధిలోని కామారెడ్డి నియోజకవర్గంలో కేసీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ఈ దేశం మనది, రాష్ట్రం మనది, దయచేసి ఆలోచించి ఓటు వేయాలని యువతను విజ్ఞప్తి చేశారు. ఈసారి కేంద్రంలో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమే అని తెలిపారు. బీజేపీకి 200 సీట్లు కూడా రావని పేర్కొన్నారు.
‘ మనం ఇచ్చిన కరెంటు పోయింది.. మంచినీళ్లు పోయినయ్.. రైతుబంధు పోయింది.. రైతుబీమా కూడా ఉంటదో పోతదో తెలియదు.. నిరుద్యోగులకు 4 వేల నిరుద్యోగ భృతి అన్నారు.. యువ వికాసం అని 5 లక్షలు బ్యాంక్ కార్డు ఇస్తామని అన్నారు? ఏ విద్యార్థికైనా ఇచ్చారా? ఇవన్నీ ఇయ్యకపోతే ఇయ్యకపోయారు.. మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వట్లేదు. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ 1100 పెట్టినం.. వాటిని జూనియర్ కాలేజీలు చేసినం.. అక్కడ పిల్లలకు అన్నం కూడా సరిగ్గా పెడతలేరు.. 125 స్కూళ్లలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు ఆస్పత్రి పాలవుతున్నారు.’ అని కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో అసలేం జరగుతుందని ప్రశ్నించారు. 5 నెలల్లో ఇంత ఆగమాగం ఉంటదా? అని నిలదీశారు. కేసీఆర్ పోగానే కట్క బంద్ చేసినట్టే కరెంటు బంద్ అయితదా? నల్లాలు బంద్ అయితయా? రైతుబంధు బంద్ అయితదా? అని ప్రశ్నించారు. డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయ్.. ఏం జరుగుతుందనేది దయచేసి ఆలోచన చేయాలని ప్రజలకు సూచించారు.
కామారెడ్డి జిల్లా చాలా చైతన్యం ఉన్న గడ్డ.. తెలంగాణ ఉద్యమంలో బ్రహ్మాండమైన పోరాటం చేసిన గడ్డ అని కేసీఆర్ పేర్కొన్నారు. ఇదే కామారెడ్డి పట్టణంలో పోలీసు కిష్టయ్య పిస్టోల్తో కాల్చుకుని అమరుడయ్యారని గుర్తు చేశారు. ఆనాడు చాలా కష్టపడి, అనేక సంవత్సరాలు పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం.. పొదరిల్లులా చేసుకున్నాం.. వ్యవసాయం బాగా చేసుకున్నాం.. పేద, ముసలి వాళ్లకు 2 వేల పింఛన్ ఇచ్చుకున్నాం.. బీడీ కార్మికులకు దేశంలో ఎక్కడా ఇవ్వనట్టుగా రెండు వేల పింఛన్ ఇచ్చుకున్నాం అని తెలిపారు. మొన్న ఎన్నికల్లో ఆరు గ్యారంటీల్లో భాగంగా ముఖ్యమంత్రి ఉండి రెండు వేలు కాదు నాలుగు వేల పింఛన్ ఇస్తామని చెప్పిండు.. ఎవరికైనా వచ్చిందా అని ప్రశ్నించారు. కొత్తగా వచ్చే నాలుగు వేలు రాకపోగా.. జనవరి నెలలో రెండు వేల పింఛన్ కూడా ఇవ్వలేదన్నారు. ఇచ్చిన వాగ్దానాలు భంగం చేయడమే కాకుండా.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి సంక్షేమ పథకాలను, రైతు పథకాలను, విద్యార్థి పథకాలను రద్దు చేశారని తెలిపారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడపిల్లలకు, చదువుకునే వాళ్లకు స్కూటీలు కొనిస్తామని అన్నారు.. స్కూటీలు రాలేదు కానీ లూటీలు మాత్రం మొదలైనయని తెలిపారు. ఈ విధంగా ఏ ఒక్క స్కీమ్ అమలు చేయలేదన్నారు.
‘ తెలంగాణకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పరిశ్రమలు, ఐటీ రంగంలో విశేష కృషి చేసి బ్రహ్మాండమైన పెట్టుబడులు తెచ్చినం.. ఇవాళ కరెంటు కోతల కారణంగా పెట్టుబడులన్నీ వాపస్ పోయే పరిస్థితి వస్తుంది. వెయ్యి కోట్లు చేసే పరిశ్రమ ఇప్పటికే మద్రాసు తరలిపోయింది.. ఇదే రకంగా జరిగితే చాలా కష్టమవుతుంది.’ అని కేసీఆర్ అన్నారు. అందుకే మన నదుల నీళ్లు కాపాడుకోవాలన్నా.. ఈ కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి మీకిచ్చిన గ్యారంటీలు అమలు చేయాలన్నా.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని, ఆస్థిత్వాన్ని రక్షించాలన్నా.. బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్కు 12 నుంచి 13 పార్లమెంటు మెంబర్లను గెలిపించి ఇస్తే కాంగ్రెస్ మెడలు వంచగలుగుతాం.. హామీలు అన్నీ అమలు చేయించగలుగుతామని తెలిపారు. నదులను కాపాడగలుగతాం.. తెలంగాణ హక్కులు కాపాడగలుగుతామన్నారు. అందుకే దయచేసి విజ్ఞతతో ఆలోచించి గాలి అనిల్కుమార్ను గెలిపించాలని కోరారు.