వికారాబాద్, జనవరి 12 : ఖాతాదారులు బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి రుణాలు తీసుకొని, చెల్లించిన రూ.1.57 కోట్లను ఇంచార్జి మేనేజర్ స్వాహా చేసిన ఉదంతం వికారాబాద్ ఐసీఐసీఐ బ్యాంక్లో ఆలస్యంగా వెలుగుచూసింది. సీఐ రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద గల ఐసీఐసీఐ మేనేజర్ సాయిరాం వ్యక్తిగత కారణాలతో మూడు నెలలు సెలవు పెట్టారు. అసిస్టెంట్ మేనేజర్ బీ శివకుమార్కు ఇంచార్జి మేనేజర్గా బాధ్యతలు అప్పగించారు. బ్యాంక్లో బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టిన 29 మంది ఖాతాదారులు రూ.1.57 కోట్లు చెల్లించి విడిపించుకొన్నారు. ఈ డబ్బులను ఇంచార్జి మేనేజర్ బ్యాంక్లో జమ చేయకుండా స్వాహా చేశాడు. సెలవులు పూర్తి కావడంతో మేనేజర్ సాయిరాం డిసెంబర్లో విధుల్లో చేరారు. బ్యాంక్ ఖాతాలను పరిశీలించగా రూ.1.57 కోట్లు తేడా వచ్చింది. దీంతో అసిస్టెంట్ మేనేజర్ శివకుమార్ను ప్రశ్నించగా పొంతన లేని సమాధానం చెప్పాడు. వెంటనే శివకుమార్పై డిసెంబర్ 23న పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు మొత్తాన్ని శివకుమార్ స్వాహా చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. కేసు నమోదు చేసి ఈనెల 6న శివకుమార్ను కోర్టులో హాజరుపర్చి రిమాండ్కు తరలించినట్టు సీఐ రాజశేఖర్ తెలిపారు.