హైదరాబాద్: భారత న్యాయవ్యవస్థపై తనకు అత్యంత విశ్వాసం ఉన్నదని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. రాజ్యాంగం, దాని విలువలను విశ్వసించే తాను న్యాయవ్యవస్థను అత్యున్నతమైనదిగా భావిస్తూనే ఉంటానని చెప్పారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మంజూరైన బెయిల్కు సంబంధించి సీఎం చేసిన అడ్డగోలు వ్యాఖ్యలను సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసిన విషయం తెలిసిందే. దీనిపై ఎక్స్వేదికగా స్పందించిన సీఎం రేవంత్.. ‘నా వ్యాఖ్యలు న్యాయవ్యవస్థను ప్రశ్నిస్తున్నట్టుగా కొందరు ఆపాదించారు. ప్రత్రికల్లో వచ్చిన వార్తలపై బేషరతుగా విచారం వ్యక్తం చేస్తున్నా. న్యాయవ్యవస్థ, దాని స్వతంత్రత పట్ల నాకు అపార గౌరవం, విశ్వాసం ఉన్నాయి. రాజ్యాంగం, దాని విలువలను విశ్వసించే నేను.. ఎప్పటికీ న్యాయవ్యవస్థను అత్యున్నతమైనదిగా భావిస్తూనే ఉంటా’ అని ట్వీట్ చేశారు.
I have the highest regard and full faith in the Indian Judiciary. I understand that certain press reports dated 29th August, 2024 containing comments attributed to me have given the impression that I am questioning the judicial wisdom of the Hon’ble Court.
I reiterate that I am…
— Revanth Reddy (@revanth_anumula) August 30, 2024
సుప్రీంనే తప్పుపడ్తరా?
ఎమ్మెల్సీ కవిత బెయిల్ విషయంలో అడ్డగోలు వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్రెడ్డిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు తీర్పును తప్పు పడ్తారా? అంటూ తీవ్రస్థాయిలో మండిపడింది. ‘కోర్టులంటే గౌరవం లేదా?’ అంటూ కన్నెర్రజేసింది. పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉం టుందని తీవ్రంగా హెచ్చరించింది. ఢిల్లీ మద్యం విధానం కేసులో ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే బీజేపీ-బీఆర్ఎస్ ఒప్పందంలో భాగంగానే కవితకు బెయిల్ వచ్చిందంటూ బుధవారం సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్చాట్లో సీఎం మాట్లాడుతూ.. సిసోడియా, కేజ్రీవాల్కు రాని బెయిల్ ఐదు నెలల్లోనే కవితకు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. కవిత బెయిల్ కోసం బీఆర్ఎస్ ఎంపీ సీట్లను త్యాగం చేసిందని అన్నారు. ఈ వ్యాఖ్యలపై గురువారం సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడింది. ఓటుకు నోటు కేసు విచారణను వేరే రాష్ర్టానికి తరలించాలంటూ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై గురువారం జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ కేవీ విశ్వనాథన్తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.
సీఎం బాధ్యతగా ఉండాలి కదా..
సీఎం రేవంత్రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ, సిద్దార్థ లూథ్రా వాదనలు వినిపించారు. ఇది చాలా పాత కేసు అని, ఇప్పటివరకు 25 మంది సాక్షులను విచారించారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. ‘ఆయన (సీఎం రేవంత్రెడ్డి) నిన్న ఇచ్చిన స్టేట్మెంట్ను ఈ రోజు పొద్దున పత్రికల్లో చదివాం. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రి అలాంటి వ్యాఖ్యలు చేయవచ్చా?’ అని ప్రశ్నించారు. ‘ఆయన ఏం అన్నారో ఓసారి చూడండి. మేము రాజకీయ పార్టీలను సంప్రదించి ఆదేశాలు ఇస్తామా?. ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయవచ్చా?’ అని మండిపడ్డారు. సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు కొందరి మనసుల్లో భయాందోళనలు కలిగించే అవకాశం ఉన్నదని అన్నారు.
‘మేం రాజకీయ నాయకులను పట్టించుకోం. మా ఆదేశాలను ఎవరైనా విమర్శించినా ఇబ్బంది లేదు. మా మనస్సాక్షి ప్రకారం, మేము చేసిన ప్రమాణం ప్రకారం మా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాం’ అని స్పష్టం చేశారు. జస్టిస్ విశ్వనాథన్ మాట్లాడుతూ.. ‘ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి చేయాల్సిన వ్యాఖ్యలేనా ఇవి?. ప్రభుత్వం, న్యాయస్థానాల మధ్య పరస్పర గౌరవం ఉండాలన్న ప్రాథమిక నియమం కూడా తెలియదా?. వ్యవస్థల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నా.. గౌరవం ఉండాలి కదా’ అని ప్రశ్నించారు. ‘ఇలాంటి ప్రవర్తన, ఇంత మొండి వైఖరి ఉంటే ఎలా?. కార్యనిర్వాహక, శాసన వ్యవస్థల్లో మేము (కోర్టులు) జోక్యం చేసుకోబోమని ఎప్పుడూ చెప్తుంటాం. అంతే గౌరవాన్ని మేము వారి నుంచి కూడా ఆశిస్తాం’ అని జస్టిస్ గవాయి పేర్కొన్నారు.
ఈ ఒక్క కారణంతో కేసు విచారణను పిటిషనర్ కోరినట్టు మధ్యప్రదేశ్ హైకోర్టు బదిలీ చేయాలని ఆదేశాలు ఇవ్వొచ్చు అన్నారు. ‘సుప్రీంకోర్టు ఆదేశాలపై ధైర్యంగా వ్యాఖ్యలు చేయచ్చని అనుకుంటున్నారా. నిన్ననే ఒక అదనపు కార్యదర్శికి నోటీసులు ఇచ్చాం’ అని మహారాష్ట్రకు చెందిన ఐఏఎస్ అధికారికి కోర్టు ధిక్కరణ నోటీసులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. దేశంలోని అత్యున్నత న్యాయస్థానం పట్ల ఆయనకు గౌరవం లేకపోతే.. వేరే రాష్ట్రంలో కేసు విచారణను ఎదుర్కోమనండి.. అని జస్టిస్ గవాయి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దశలో రేవంత్రెడ్డి తరపున న్యాయవాదులు స్పందిస్తూ.. ఈ వ్యాఖ్యలు అవాంఛనీయమని, ఆయన తరఫున సుప్రీంకోర్టును క్షమాపణలు కోరారు. మరోసారి ఇలా జరుగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. సీఎం రేవంత్రెడ్డికి కౌన్సెలింగ్ ఇస్తామని చెప్పారు. సీఎం వ్యాఖ్యలపై ఎలాంటి నోటీసులు ఇవ్వవద్దని విజ్ఞప్తిచేశారు. వారి విజ్ఞప్తి మేరకు కేసు విచారణను ధర్మాసనం సోమవారానికి వాయిదా వేసింది.